నిన్న "అమరావతి" సినిమా చూసాను. రవిబాబు (చలపతిరావు కొడుకు) నటించి దర్శకత్వం వహించిన సినిమా. సాధారణంగా ఇతని సినిమాలు నాకు నచ్చుతాయి. ఏ ముఢనమ్మకానికి వ్యతిరేకంగానో, లేదా సైన్సు కి సంబంధించిన విశ్లేషణలతోనో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఒక శాస్త్రీయ అంశం ఉంటుంది సినిమాలో.
అమరావతి విషయానికొస్తే "హిప్నాటిజం లేదా వశీకరణవిద్యను మానవళికి ఉపయోగపడేలా ఎంత ఉన్నతంగా వాడుకోవచ్చో అంతే అధమంగా మనుషులకి చెడు కలిగించడానికి కూడా వాడుకోవచ్చు, కాబట్టి జగ్రత్తగా ఉండండి. ఈ హిప్నాటిజం ని ఎవరికిబెడితే వాళ్ళకి నేర్పితే ప్రమాదాలు జరగవచ్చు" అనేది ఈ సినిమాలో పాయింటు. దాదాపు రెండు గంటల నిడివి తో కాస్త ఉత్కంఠ రేగిస్తూ బాగానే తీసారు సినిమా.
ఈ సినిమా చూసాక నాకు నా చిన్నతనంలో జరిగిన విషయం గుర్తొచ్చింది. 10 వ తరగతి వేసవి శెలవులు, ఇంకా ఫలితాలు రాలేదు. మంచి మార్కులొస్తాయని తెలిసినా ఏక్కడో చిన్న ఉత్కంఠ ఉండేది మనసులో. మా ఇల్లు ఊరి మధ్యలో కాకుండా కాస్త దూరంగా ఉండేది. అది అప్పుడే పుట్టిన కొత్త కాలనీ. అప్పటికి మా కాలనీలో 10-12 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆ కాలనీ కి ఎదురుగా, ఎడమవైపు కనుచూపుమేర పచ్చని పొలాలు. కాలనీలో అడుగు పెట్టగానే ఎడమచేతి పక్క ఒక ఇల్లు, దానికి ఎదురుగా గేస్ గొడౌన్. తరువాత ఒక 100 మీటర్ల దూరంలో మా ఇల్లు, దానికి ఆనుకుని పక్కిల్లు. అంతే ఆ వరసలో ఇంక ఇళ్ళు లేవు. వెనక వరసల్లో అక్కడా అక్కడా ఒక్కోటి చొప్పున ఓ 10-12 ఇళ్ళు ఉన్నాయి. ఇంక చుట్టూరా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు గొప్ప ఆహ్లాదంగా ఉండేది వాతావరణం. ఎక్కువ జనసంచారం కూడా ఉండేది కాదు. మా ఇంటి వెనక ఎడమచేతి వైపు ఒక చిన్న చెరువు, మా ఇంటి ఎదురుగా ఒక పేద్ద బావి కనీసం ఓ 5-6 మంది ఒకే టైంలో ఈతకొట్టగలిగేటంత పెద్ద బావి. అంత పెద్ద బావిని చూడడం అదే మొదలు, చివర. ఇప్పటివరకు మళ్ళీ అంత పెద్ద నుయ్యిని చూడలేదు, చూడబోనేమో. ఆ బావి పక్కనే ఒక చిన్న ఇల్లు ఉందేది. ఒకే గది ఉన్న చిన్న పెంకుటిల్లు. వాళ్ళకి ఓ రెండుమూడు గేదెలు, కాస్త పొలం ఉండేవి. ముసలి తల్లిదండ్రులు, పెద్దకొడుకు-భార్య, వాళ్ళకి చంటిపిల్ల, చిన్నకొడుకు ఉండేవారు ఆ ఇంట్లో. పాపం బాగా పేదవారు. పాలవ్యాపారం మీదే వాళ్ళ గమనం సాగుతూ ఉండేది ఎక్కువగా. ఎదురుగా ఉండేవారు కాబట్టి ఏ చిన్నపనికైనా వాళ్ళనే పిలిచేవాళ్ళం ఎప్పుడూ. అలాగే అప్పుడప్పుడూ డబ్బు, భోజనం వంటి సహాయాలు చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో అందరితో మాకు బాగా పరిచయం. వాళ్ళింటికి చుట్టాలొస్తే మా ఇంటి ముందు గదిలో పడుకునేవాళ్ళు కూడా. వాళ్ళింటికి వాళ్ళ మేనమామ తరచూ వస్తూ ఉండేవాడూ. అతను కూడా మాకు బాగా తెలుసు.
ఇలా ఉన్న ఆ కాలనీ లో ఓ రోజు మధ్యాన్నాం 12.00 గంటలవేళ "సోది చెబుతానమ్మ సోది" అంటూ కేకలు వినిపించాయి. ఆ కోలనీలో ఎక్కువ ఇళ్ళు లేకపోవడం వలన వీధిలోకి వచ్చి ఎవరూ సరుకులు అమ్మడమో, ఇలా సోది వాళ్ళు రావడమో సాధారణంగా జరగేది కాదు. ఆరోజు ఈ కేక వినిపించింది. నేను మా గదిలో కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నాను. చెల్లి హాల్ లో టి.వి చూస్తున్నాది. అమ్మ మిషన్ కుట్టుకుంటున్నాది. ఒక 5 నిముషాల తరువాత మిషన్ శబ్దం ఆగిపోయింది. ఇంట్లో కూడా అమ్మ అలికిడి వినిపించలేదు. ఎక్కడకెళ్ళిందబ్బా, చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే అని ఆలోచిస్తూ బయటకి వచ్చి చూస్తే, వీధి గుమ్మంలో ఆ సోది ఆవిడ తో మా అమ్మ కూర్చుని ఉంది. సాధారణంగా మా అమ్మ ఇలాంటివి నమ్మదు. ఎప్పుడూ ఎవరితోనైనా ఇలాంటివాటి గురించి మాట్లాడడం కూడా వినలేదు. ఇదేమిటి ఇప్పుడు ఇలా ఈవిడతో సోది చెప్పించుకుంటున్నాది అని ఆశ్చర్యపోయాను. సరేలే ఎదో ముచ్చటపడింది కాబోలు ఊరికే అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. ఒక 10 నిముషాల తరువాత "సౌమ్యా" అని పిలిచింది.
"ఏంటమ్మా?"
"వెళ్ళి కొంచం బియ్యం, పప్పు పట్రా"
"ఎందుకు?"
ఎర్రగా చూసింది నా వైపు. మాట్లాడకుండా వెళ్ళి ఓ గ్లాసుడు బియ్యం, పప్పు తెచ్చి ఇచ్చాను.
"సరే వెళ్ళి నీ పని చూసుకో"
"సరేనమ్మా"
ఇంకో పది నిముషాలు పోయాక మా చెల్లిని పిలిచింది. తరువాత నాకేమి వినిపించలేదు. ఇంకో 15 నిముషాల తరువాత
"అక్కా, అమ్మ ఇంకా బియ్యం, పప్పు తెమ్మంటున్నాది. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను నేను" అంది మా చెల్లి.
సరే ఈ కథేమిటో చూద్దాం అని వెళ్ళి పరిశీలనగా చూస్తే మా అమ్మ తదేకంగా ఆ సోది ఆవిడని చూస్తున్నాది. ఆవిడ ఓ ఎముక పట్టుకుని ఏవో మంత్రాలు చెప్తున్నాది. ఒక పెద్ద వెదురుబుట్టలో ఎముకలు, పసుపుకట్టిన గుడ్డలు, కాసింత కుంకం, ఇంకా ఏవో తాయెత్తులు, నిమ్మకాయలు, మన్ను, మశానం అన్నీ ఉన్నాయి. ఆ బుట్టలోనే మేము అప్పటివరకు ఇచ్చిన బియ్యం, పప్పు కూడా ఓ వారగా పోసి ఉన్నాయి.
అమ్మా అని పిలిస్తే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు చూసింది మా అమ్మ. బియ్యం, పప్పు తీసుకునిరా అంది. వద్దమ్మా అని వారించబోతే చెడామడా ఆవిడ ముందే తిట్టింది. నాకు చిరాకేసి తెచ్చిపడేసాను. అప్పటికే బియ్యం, పప్పు రెండూ నిండుకున్నాయి. అక్కడే నిలుచుని చూస్తున్నాను ఏమి జరుగుతుందో అని. ఇలాంటి విషయాలు నాకు కొత్త. అడపాదడపా వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. అయినా సోది చెప్పేవాళ్ళు ఏదో భవిష్యత్తు గురించి నాలుగు అబద్ధాలు చెప్పి కాసింత బియ్యం, కూసింత పప్పు తీసుకెళ్తారని మాత్రమే నాకు తెలుసు. కానీ ఈ ఎముకలు, నిమ్మకాయలు ఏమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ బియ్యం తెమ్మంది. అన్నీ అయిపోయాయి అని చెప్పాను. ఆ సోది ఆవిడ నన్ను లోపలకి వెళ్ళిపోమంది. నేను వెళ్ళను, ఉంటాను అన్నాను. మా అమ్మ చాలా కోపంగా నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టింది. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. లోపలకి వెళ్ళకపోతే కొడతానని కూడా చెప్పింది. మా చెల్లి అప్పటికే బిక్కచచ్చిపోయింది. ఏమిచెయ్యాలో తెలియక లోపలికెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాను. మరో 10 నిముషాలలో ఒక మగగొంతు అరుపులు, కేకలు వింపించాయి. చెల్లి నేను పరిగెట్టుకొచ్చి చూసాము. ఆ ఎదురింటివాళ్ళ మేనమామ ఆ సోది ఆవిడని చెడామడా తిడుతున్నాడు. అమ్మ బిత్తరపోయి చూస్తున్నాది. నిన్ను పోలీసులకప్పజెబుతాను, నాటకాలాడుతున్నవా అని నానా తిట్లు తిట్టి కొట్టబోయాడు కూడా. ఆవిడ కూడ ఏవో మంత్రాలు గట్టిగా చదువుతూ అతన్ని తిడుతూ ఉంది. అతను, ఆవిడ జబ్బట్టుకుని రోడ్డుమీదకి లాకెళ్ళి ఒక్కటి పీకాడు. ఆ దెబ్బకి తట్ట, బుట్ట పట్టుకుని పరుగులంగించుకుంది. కానీ అతను వదల్లేదు. ఆ బియ్యం, పప్పు వదిలేసి వెళ్ళమన్నాడు. కానీ అమ్మ వద్దంది, అప్పటికే వాటి నిండా ఎముకలు, పసుపు అన్ని పెట్టి ఉన్నాయి. సరే అని చెప్పి మళ్ళీ ఇటువైపు వచ్చావో చస్తావు అని ఒక్క గసురు గసిరాడు అతను. ఆ దెబ్బతో వెనక్కి తిరిగిచూడకుండా పరుగెత్తింది ఆ సోది ఆవిడ.
ఏమయిందని అతన్ని అడిగాను.
"నేను ఇందాకటి నుండీ గమనిస్తున్ననమ్మా, మీరు బియ్యం, పప్పు తెచ్చి ఇస్తున్నారు. అమ్మ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, ఏదేదో అంటున్నారు. అప్పుడే వచ్చి విషయం కనుక్కుందామనుకున్నాను, కానీ ఏమోలే ఆవిడ తెలిసే చేస్తున్నారు అనుకున్నాను. కానీ కాసేపోయాక మీ అమ్మగారు మంగళసూత్రం తీసి దాని బుట్టలో వేసారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏమిటీవిడ బంగారం అలా వేసేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నాను. వెనువెంటనే నల్లపూసలు కూడా తీసి వెయ్యబోయారు. పరిగెత్తుకొచ్చి ఆ సోది దాన్ని గదమాయించాను. అమ్మేమో ఉలిక్కిపడి, ఏమీ అర్థం కానట్లు చూస్తున్నారు. అప్పటికి నాకు విషయం పూర్తిగా అర్థమయింది. దానిమీద నాలుగు కేకలు వేసాను, ఈ లోగా మీరు కూడా వచ్చారు. నేను చూసి ఉండకపోతే ఇల్లంతా దోచేసి ఇచ్చేద్దురు మీ అమ్మగారు. ఏమిటమ్మా మీలాంటి చదువుకున్నవాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలామ్మా" అని కాస్త చివాట్లు కూడా పెట్టాడు.
నాకు మా అమ్మ మీద ఎక్కడలేని కోపమొచ్చింది. కానీ తనని చూస్తే జాలేసింది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. తనే అలా చేసింది, అలా బంగారం తీసి ఇచ్చింది అని నమ్మలేకపోయింది. తనకి ఏమీ తెలియలేదని కూడా చెప్పింది. సరేలెండి ఏదో అయిపోయింది, అమ్మని లోపలకి తీసుకెళ్ళి తలుపేసుకోండి అని చెప్పేసి అతనెళ్ళిపోయాడు. అమ్మేమీ మాట్లడలేదు. అసలేం జరిగింది, ఏమి జరుగుతోంది అని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మతిపోయినదానిలా ఉంది. బాగా షాక్ తిన్నట్టు ఉంది. అన్నం తినమంటే తినకుండా గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను, చెల్లి ఏదో ఇంత ముద్ద తినేసి భయంగా, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. సాయంత్రం 6.00 గంటలకి నాన్నగారింటికొచ్చారు. ఆయన రాగనే అమ్మ లేచి భోరున ఏడవడం మొదలెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న కంగారు పడ్డారు. నేను జరిగిన విషయమంతా చెప్పాను. ఒక్క నిముషం ఆయన మొహంలో భయం, ఆందోళన చూసాను. వెంటనే నవ్వేసి "సరేలెండి జరిగిపోయిందేదో జరిగింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండండి."అన్ని చెప్పి మా అమ్మ ఏడుపు ఆపే ప్రయత్నం చేసారు. ఇంక అక్కడనుండి మా అమ్మ మీద, జరిగిన విషయం మీద జోకులేస్తూ ఉన్నారు అమ్మ నవ్వే వరకు.