StatCounter code

Showing posts with label పుస్తకాలు/సాహిత్యం. Show all posts
Showing posts with label పుస్తకాలు/సాహిత్యం. Show all posts

Tuesday, March 6, 2012

మా ఊరుకి పుస్తకాల పండగొచ్చిందోచ్చ్!

పుస్తకాలు పుస్తకాలు!
"అటు నేనే ఇటు నేనే" అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!
ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!

చంద్రుణ్ణి చూసి ఎగిసే అలల్లా మీదకి దూకుతున్నాయి!
తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు ఝుమ్మన్ని మీదకు ముసురుతున్నాయి!
కలకండ చుట్టూ చేరిన చీమల్లా చుట్టుముట్టేస్తున్నాయి!
వలసపోయే పక్షుల్లా బారులు తీరి ఉన్నాయి!
ఉఛ్వాశనిశ్వాసల్లా ఎగసెగసి పడుతున్నాయి.
ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబికిరి చేస్తూ "నన్ను చదువు అంటే నన్ను చదువు" అని పోటీపడుతున్నాయి.

సుమారు 13 లక్షల పైచిలుకు పుస్తకాలు. 2500 స్టాల్స్ ...కనివినీ ఎరుగని రీతిలో పుస్తకాలు. బొమ్మలకొలువులో బొమ్మల్లా అందంగా అమర్చబడ్డాయి 20th Wolrd Boof Fair పుణ్యమా అని. ఢిల్లీ లో ప్రతీ రెండేళ్లకొకమాటు World Book Fair జరుగుతుంది. ఈసారి 25 ఫిబ్రవరి నుండీ 4 మార్చి వరకూ జరిగింది.


26 ఆదివారం మేము వెళ్ళేసరికి ఆ ప్రభంజనం చూసి మా ఊరి పైడితల్లి అమ్మవారి పండుగ గుర్తొచ్చిందంటే అతిశయోక్తి కదు. ఢిల్లీలో పుస్తకప్రియులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. ఈ  పండుగ గురించి ఏ రకమైన సమాచారం మాకు తెలీదు. పేపర్ లో చూసి ఆదివారం కదా అని బయలుదేరాం. అడుగుపెట్టగానే "మీకేమైనా సహాయం" కావాలా అని అడిగారు. ఒక Information book 20 రూపాయిలు కొనుక్కొమన్నారు. కొనుక్కుని చూసాం. కళ్ళు గబగబ తెలుగుని వెతికాయి. కనిపించింది కనిపిచింది....యాహూ తెలుగుకి మూడు స్టాల్సు ఉన్నాయట. ముందు అటుపోదాం అని Regional Books ఉన్న హాల్ కి వెళ్ళాము. అది హాలా! దానికదే ఓ పెద్ద భవనంలా ఉంది. ఎన్నెన్ని పుస్తకాలో! తెలుగుకి మూడు, తమిళానికి ఓ పది. మళయాళం, ఒడిసా, మరాఠీ...అబ్బ ఒకటేమిటీ అన్నీను! ఉర్దూ పుస్తకాలైతే ఫ్రీ గా పంచుతున్నారు. ఉర్దూకే అత్యధికం స్టాల్స్.

తెలుగుకి విశాలాంధ్ర, విజయవాడ పబ్లిషర్స్, మంచిపుస్తకం వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఆ ఆదివారం నాటికి విశాలాంధ్రలో మాత్రమే పుస్తకాలు వచ్చాయి. మిగతావి ఇంకా రాలేదు. విశాలాంధ్రలో మంచి కలక్షన్ ఏమీ లేదు. అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి. కానీ అక్కడున్నవి చాలామటుకు నా దగరున్నాయి. నాకు కావలసినవి పెద్దగా లేవన్నమాట. :) కానీ పెట్టారన్న సంబరంలో ఏవో కొన్నాను. విశాలాంధ్ర స్టాల్ పెట్టినాయన అనంతపురమునుండీ వచ్చారట- సోమశేఖరెడ్డిగారు.మొత్తం వారం రోజుల పడుగలో మూడురోజులు వెళ్ళాను నేను ఆస్టాల్స్ వైపు రెడ్డిగారు బాగా ఫ్రెండ్ అయిపోయారు. మంచి పుస్తకప్రియులు కూడాను. మేమిద్దరం చాలా పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడొక వింత సంఘటన జరిగింది. మొదటిరోజు నేను పుస్తకాలు చూస్తూ ఇది ఉందా అది ఉందా అని అడుగుతుంటే రెడ్డి గారు సరదాపడి మూలమూలలనుండి పుస్తకాలు తీస్తూ నాతో వాటి గురించి చర్చిస్తూ తిరిగారు. ఈలోగా ఓ పెద్దమనిషి అక్కడకు వచ్చాడు. ఓ 45 ఉంటుందేమో వయసు. ఊరికే కనిపించిన పుస్తకాలన్ని తిరగేస్తున్నాడు. నేను రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ఇతగాడు నావైపు తెరిగి "మీరు బాచదువుతారా పుస్తకాలు" అన్నాడు. "అవును" అన్నాను. "ఓ మంచి పుస్తకం" చెప్పండి అన్నాడు. ఎదురుగా రమణీయాలు కనిపిస్తే చూపించాను. "ఇవి బావుంటాయా! పి.వి నరసింహా రావు గారు ఏదో రాసారుట మీరు చదివారా" అన్నాడు. "అట, కానీ నేను చదవలేదు,నాకు తెలీదు" అన్నాను. మీ ఇంట్లో బోలడు పుస్తకాలున్నాయా! ఇవన్నీ ఏం చదువుతాం. చదివాక ఏం చెయ్యాలి. మా ఇంట్లో నేనొక్కడినీ ఉన్నాను, చదివేసాక ఏం చెయ్యను ఈ పుస్తకాన్ని. ఎన్నని కొనుక్కు చదువుతాము. అసలు ఏంటివన్నీ...ఏం పుస్తకాలు, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఏవైనా పుస్తకాలు కావాలంటే అడుగుతాను. మీ ఇంటికొచ్చి పుస్తకాలు చూస్తాను." అంటూ అతను మాట్లాడుతుంటే నేను, రెడ్డి గారు తెల్లబోయాం. ఏదో వింత జీవి వేరే గ్రహం నుండి దిగి వచ్చినట్టు అనిపించింది. చదివేసాక పుస్తకాన్ని ఏమి చెయ్యాలా! నాకు బుర్ర తిరిగిపోయింది ఈ ప్రశ్న చూసి. ఎంత కోపం వచ్చిందంటే "అసలు మిమ్మల్ని ఎవడండీ ఇక్కడకు రమ్మన్నాడు?" అని అడగాలనిపిచింది. పుస్తకాలు ఎందుకు చదావాలి అన్న దానిపై చిన్న లెక్చరు ఇద్దామా అని ఆలోచించాను రెండు నిముషాలు. కానీ నాకు అప్పుడు అంత ఓపిక లేదు. పైగా బోల్డు పని ఉంది, ఇంకా బోల్డు పుస్తకాలూ చూడొద్దూ! అందుకే చిన్నగా నవ్వేసి మెల్లిగా జారుకున్నాను అక్కడినుండి. ఆ జిడ్డు మనిషి అక్కడనుండి పోయాడు అని తెలిసాక మళ్ళీ వెళ్ళాను. :) విజయవాడ పబ్లిషర్లు మీద బోల్డు ఆశలు పెట్టుకుని మర్నాడు వెళ్ళానుగానీ ఆశ అడియాశ అయిపోయింది. ఏమీ లేవు అక్కడ. యండమూరి, యద్దనపూడి లేదంటే దేవుడి పుస్తకాలు, అదీ కాదంటే వంటల పుస్తకాలు. ఓ నమస్కారం పెట్టి "మంచి పుస్తకం" లో చూస్తే అన్నీ చిన్నపిల్లల పుస్తకాలే. సరదావేసి కొన్ని కొనుక్కున్నాను.


ఆ తర్వాత ఇంగ్లీషు మీద పడ్డాం. అవేం పుస్తకాలురా నాయనా...తెలుగంటే ఏవి చదవాలో ఏవి వద్దో, నాకేవి నచ్చుతాయో ఏవి నచ్చవో....ఒక జ్ఞానం ఉంది. కానీ ఇవో! ఏవో కొన్ని చాలా ఫేమస్ పుస్తకాలు తప్పితే పెద్దగా తెలీదే :(  సరే చూద్దం అని అడుగుపెట్టాం. అబ్బ అబ్బ అబ్బ...కళ్ళు చెదిరిపోయేలా పుస్తకాలు. అన్నీ చదవాలనిపిస్తుంది. ఏది చదవాలో తెలీదు. ఇది బావుంటుందా...ఏమో కొనేసాక బాగోకపోతే! ఒకవేళ కొనకపోతే మంచి పుస్తకం మిస్ అయిపోతామేమో! అని ఒకటే పీకులాట.

ప్రగతి మైదాన్ అన్న స్థలంలో జరిగింది ఈ పండుగ. ఆ మైదానం మా విజయనగరమంత ఉంటుందేమో అనిపించింది. అందులో మొత్తం 16 హాల్స్. Pages, Oxfor, Penguin, Pacific, Goodwell, Cambridge, Just Read, Om Books, Flipcart....చిన్న చితకా, ముసలి, ముతక అన్నీ రకాల పబ్లిషర్స్ ఉన్నారు. ఆదివారం నాడు మేము రెండు స్టాల్స్ చూసేసరికి మాకు మొహం తిరిగిపోయింది. ఇంకా 14 చూడాలా అని అనుకుంటేనే కళ్ళు తిరిగాయి. ఇంక లాభం లేదని ఆరోజుకి దుకాణం కట్టేసాము. మర్నాడు వెళితే జనం కాస్త తక్కువ ఉన్నారు. కొంచం హాయిగా ఇంకో రెండు హల్స్ తిరిగాము. కొన్ని బుక్స్ కొన్నాము. 

ముఖ్యంగా చెప్పుకోవలసినది Nationla Book Trust గురించీ, Sahitya Academy గురించీ. NBT లో పుస్తకం ధర చాలా చౌక. 20-30 రూపాయలనుండీ ఉన్నాయి పుస్తకాలు. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సాహిత్య అకాడమీలో కూడా చాలా భాషల పుస్తకాలు ఉన్నాయి. నేను తెలుగువి కొన్ని కొన్నాను. 


ఈ పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. "150 యేళ్ళ రవీంధ్రనాథ్ ఠాగూర్", "100 యేళ్ళ ఢిల్లీ" సంబరాలు జరుపుకుంటున్నాయి. రవీంద్రనాథ్ రచనలు, ఢిల్లీ కి సంబంధించిన రచనలు అనేకం ఉన్నాయి. వీటికి ఎక్కువ స్టాల్స్ కేటాయించారు. 

అలాగే నేను చూసిన అత్యధిక స్టాల్స్ ఓషో వి. ప్రతీ హాల్ లోనూ ఓషో రచనలు, సీడీలతో స్టాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంక, భూటాన్ అంటూ విదేశీ భాషల పబ్లిషర్స్ కి కూడా కొన్ని స్టాల్స్ కేటాయించారు. పిల్లలపుస్తకాలకి మాత్రం ఇది నిజమైన పండుగ. Children Pavilion అని వాళ్లకు ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. ప్రతీ హాల్ లోనూ చాలా ఎక్కువ Children's Books ఉన్న స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎన్నెన్ని పుస్తకాలో! అంబేద్కర్ కి కొన్ని ప్రత్యేకంగా స్టాల్స్. అన్నాహజారే కి ఒకటి. చిన్న, పెద్ద పబ్లిషర్స్ మాత్రమే కాకుండా రోడ్డు సైడ్ పుస్తకాలు అమ్మేవాళ్లలాంటివాళ్లున్నారు. వీళ్లకి స్టాల్స్ ఉండవు. ఏమూల జాగా కనిపిస్తే అక్కడ వాళ్ళ పుస్తకాలు పెట్టేసుకుంటారు. ప్రతీ పుస్తకమూ 100 రూపాయిలు మాత్రమే. చాలా పుస్తకాలు సెకండ్ హేండువి. నాకు హైదరాబాదులో కోటీ సెకండ్ హేండ్ బుక్స్ మార్కెట్ గుర్తొచ్చింది. వీళ్ల దగ్గర కూడా 100 కి కొన్ని పుస్తకాలు కొన్నాము. 

నవ్వు తెప్పించిన ఒక విషయం ఏమిటంటే రిలయన్స్ కూడా ఇందులోకి దిగింది. అచ్చు కూరగాయలు అమ్మినట్టే ఒకటి కొంటె రెండు ఫ్రీ అని. మూడు కొంటే ఐదు ఫ్రీ అని. కొన్నిటి మీద 30% డిస్కౌంట్, కొన్నిటి మీద 10%...ఇలా రకరకాల options పెట్టారు. రిలయన్స్ షాపింగ్ మాల్ లో ఉన్నట్టే. నవ్వొచ్చింది అది చూసాక. :)

ఈ పండుగలో పుస్తకాలే కాకుండా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. రోజూ సాయంత్రం ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. రోజూ ఏదో ఒక పుస్తకావిష్కరణ సభ. రచనావ్యాసంగం గురించీ, పుస్తకాల గురించీ ఏదో ఒక Workshop, Seminar జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగకి "వందేళ్ళ భారతీయ సినిమా" అన్నది కూడా ప్రత్యేకం. సినిమా గురించి రకరాకల Workshops జరిగాయి. How to Read a Cinema? అనే work shop కి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. అది విన్నాక సినిమాలు తియ్యడం ఇంత కష్టమా అనిపించింది. సినిమాకోసం ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది. అందులో సినిమాలకి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎక్కువ హిందీ సినిమాల గురించి. తరువాత బెగాలీ సినిమాల గురించి. కొంచం తమిళ సినిమాల గురించి. అంతే. మిగతా భాషల్లో సినిమాలు ఇటువంటి రచనలకు నోచుకోలేదు గాబోలు! రోజూ ఏదో ఒక సినిమా వేసేవారు సాయంత్రం పూట. పథేర్ పాంచాలి, చారుశీల - సత్యజిత్ రే సినిమాలు రెండూ చూద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు :(. మాల్గుడీ డేస్ కాసేపు చూసాం :) 

మేము వరుసగా మూడు రోజులు సాయంత్రం అక్కడకి వెళ్ళడం పుస్తకాలు చూడడం, ఏవో కొనుక్కోవడం, కొనుక్కోవలసినవటి గురించి ఆలోచించడం ఇదే పని మాకు. :) చివరి రోజులు కదా అని మళ్ళీ 3 మార్చి శనివారం నాడు వెళ్ళాం. ఆరోజైతే ఇసుక వేస్తే రాలనంత జనం. మాకు చాలా విసుగొచ్చింది. కొందరిని చూస్తే వీళ్ళు అసలు అక్షరాస్యులేనా అనిపించేది. వాళ్ల వాలకం అలా ఉండేది...నిజంగా వీళ్ళకి చదవడం, రాయడం వచ్చా అని సందేహమొచ్చింది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. పిక్నిక్ కి వచ్చినట్టు వచ్చేసారు. మేము వెళ్ళినట్టే! :)

ఇంతా చేస్తే మేము నాలుగు రోజులు వెళ్ళి చూసినవి మొత్తం 5 హాళ్ళు...అంతే! అవి చూసేసారికే మాకు తల ప్రాణం తోకకొచ్చింది. నిజం చెప్పాలంటే, ఒకానొక సమయంలో పుస్తకాలంటే విరక్తి వచ్చేసింది. బాబోయ్ ఈ పుస్తకాలు నాకొద్దు అని దూరంగా పారిపోవాలనిపించింది. :)

అలా సరదా సరదాగా సాగిపోయింది మా ఊర్లో పుస్తకాల పండుగ! ఇంతమంచి పండుగలో మేము పాల్గొనగల్గినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 

మేము కొన్న పుస్తకాలు....

తెలుగు:
సాహిత్య అకాడమీ: కాళోజీనారాయణరావు - పేర్వారంజగన్నాథం, శాస్తి - కాన్హుచరణ్ (ఒడియాఅనువాదం)
తాపీ ధర్మారావు: ఇనుపకచ్చడాలు, రాలు-రప్పలు, దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?
శరత్‌ సాహిత్యం: దేవదాసు, శ్రీకాంత్, చరిత్రహీనులు
సహవాసి: పంచతంత్రం, బేతాళకథలు, అమ్మ
గణిత విశారద - అవసరాల రామకృష్ణారావు
నామిని ఇస్కూలు పుస్తకం
రైలుబడి - టెట్సుకో కురొయనాగి (తెలుగుఅనువాదం)
జరుక్‌శాస్త్రి పేరడీలు
అనువాద సమస్యలు - రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వారుస్వామి
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ - చాగంటి తులసి
కాదంబరి - రావూరి భరద్వాజ
మధురాంతకం రాజారాం కథలు - రెండు భాగాలు
గోనగన్నారెడ్డి - అడివి బాపిరాజురచనలు
సిప్రాలి -శ్రీశ్రీ
దక్షిణభారతంలో దేవాలయాలు - వాకాటి పాండురంగారావు (అనువాదం)
కథాసరిత్సాగం - జగన్నాథశర్మ
భమిడిపాటి కామేశ్వరరావు - నాటకాలు
రంగుటద్దాలకిటికీ - ఎస్.నారాయణస్వామి
పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా - గోపీచంద్
కథాసరిత్సాగము - జగన్నాథశర్మ
కృష్ణశాస్త్రి సాహిత్యం: వ్యాసావళి - వ్యాసాలు, కృష్ణపక్షము
రాహుల్సాంకృత్యాయన్: ఓల్గానుండిగంగవరకు, మనిషికథ, ప్రాక్పశ్చిమదర్శనాలు

English:
The Summons & The King of Torts - John Grisham
Life of Pi - Yann Martel
Why I am an Athiest? - Bhagat Singh
Indian Food: A Historical Companion - K. T. Achaya
The Monk Who Sold his Ferrari - Robin Sharma
Fall of Gaints - Ken Follet
Piccadilly Jim - Wodehouse
Freedom Struggle - Bipin Chandra
A History of South India - K. A. NilakanthaSastri
The Alchemist - Paulo Coelho
The Immortal of Meluha& The Secret of Nagas - Amish
The Dairy of a Young Gilr - Anne Frank
Twilight in Delhi – Ahmed Ali
The Davinci Code – Dan Brown

ఇంకా చాలా తమిళ పుస్తకాలు :)


Friday, December 30, 2011

ఈ యేడాది (2011) -నేను-నా పుస్తకాలు

సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అరవనుగానీ ఈ యేడదిలో నేను చదివిన పుస్తకాల్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామని.

చదువులా, చావులా? - నామిని
ఈ పుస్తకం గురించి ఇదివరకే ఒక టపాలో కూలంకషంగా చర్చించాను. కార్పొరేటు విద్యా సంస్థల్లో చిన్నారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో, ఆటపాటలకు దూరం అవుతూ చదువు బరువును ఎలా మోస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతూ తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు నామిని. ఆ బుజ్జాయిల మనసుని తెలుసుకుంటే ఎంతో బాధగా అనిపించింది. మిగతా వివరాలన్నీ ఈ పోస్ట్ లో చదవొచ్చు.

కృష్ణవేణి - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారు తన పంతొమ్మిదవ యేట రాసిన మొట్టమొదటి నవలకి ఫుట్ నోట్స్ ని జోడిస్తూ తిరిగి ప్రచురించారు. ఈ కథ అప్పట్లో జ్యోతిలోనో, ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమీ లేవుగాని ఆవిడ రాసిన ఫుట్ నోట్స్ కోసం ఈ పుస్తకం చదివి తీరాలి. ఎప్పుడో తన చిన్నప్పుడు రాసిన కథని తనే విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవిడ రాసిన విధానం అద్వితీయం. ఒక నలభై, యాభై యేళ్ళ తరువాత రచయిత్రి తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుతో, పరిణితితో తన పాత రచనను నిర్మొహమాటంగా విమర్శించుకోవడమనేది రంగనాయకమ్మగారికి ఉన్న గొప్ప గుణం. Hats off to you Madam! ఫుట్ నోట్స్ లో కూడా తన హాస్యశైలిని వదిలిపెట్టలేదు. చదువుతున్నంతసేపు బాగా నవ్వుకున్నాను.

మానవి, సహజ - ఓల్గా
సుజాతగారి ధర్మమా ఆని మొట్టమొదటిసారి ఓల్గా రచనలు చదివాను. మానవి, సహజ రెండూ విలక్షణమైన రచనలు. రెండూ స్త్రీవాద రచనలే. స్త్రీకి తనదైన వ్యక్తిత్వం ఉండాలని, పెళ్ళి అయినా కూడా భర్త, పిల్లలే కాకుండా తనకంటూ ఇష్టాయిష్టాలను కలిగి ఉండాలని చెప్పే నవలలు.

సహజ విషయానికొస్తే నలుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు- పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. సహజ తప్ప మిగతా ముగ్గురు పెళ్ళి వల్ల తమ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నవాళ్ళే. ఎన్నో యేళ్ళ తరువాత నలుగురు కలుసుకోవడం వారి జీవితాలను చూసి సహజ ఆశ్చర్యపోవడము, పెళ్ళి అంటే వ్యక్తిత్వం కోల్పోవడం కాదని మెత్తగా చివాట్లు పెడుతూ తన ఇద్దరు స్నేహితురాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు తేగలగడం ఇదీ కథ. స్నేహితురాళ్ల మధ్య జరిగే వాదోపవాదాలు, సహజకి తన భర్తకి మధ్య జరిగే చర్చలు ఎంతో ఆలోచింపజేస్తాయి. సహజ ఉద్యోగం చేసుకుంటూ తన మనసుకి నచ్చిన ప్రసాద్ ని పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ స్వతహాగా మంచివాడు. భార్య భర్తలలో ఎక్కువ తక్కువలు లేవని, ఇద్దరూ సమానమేనని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. పెళ్ళయ్యాక అలాగే మెలుగుతాడు కూడా. ఇద్దరూ ఉద్యోగస్థులు అవ్వడం వలన సహజ, ప్రసాద్ కూడా ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ప్రసాద్ కి ఒక పెద్ద చిక్కొచ్చిపడుతుంది. తను అందరి మగవాళ్లలా కాకుండా మంచి భర్తగా మెలుగుతూ సహజకి ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉన్నాడు కదా, మరి సహజ ఇవన్నీ ఎందుకు గుర్తించడం లేదు? తనని మంచివాడుగానో లేదా ఉత్తమ భర్తగానో ఎందుకు గుర్తించడం లేదో అనుకుంటూ మధనపడుతుంటాడు. ఇంక ఆగలేక ఒకరోజు ఈ విషయాన్ని సహజ దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి సమాధానంగా సహజ నవ్వుతూ చెప్పే మాటలే ఈ పుస్తకం లోని "Take away". అవి యథాతథంగా…
“నేనిన్నాళ్ళు నీ భార్యననుకోలేదు ప్రసాద్ నీకు అత్యంత ఆప్తురాలినన స్నేహితురాలిననుకున్నాను. స్నేహితులతో ప్రవర్తిస్తున్నటే ప్రవర్తిస్తున్నావు అనుకున్నానుగానీ నువు ప్రత్యేకంగా నన్ను మంచిగా, దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావనుకోలేదు. ఎంత భ్రమలో ఉన్నాను! నేను ఆడదాన్ని ఏ హక్కులూ లేనిదాన్ని, బానిసను. నువ్వు మంచివాడివి. నీ బానిసకి అన్ని సహాయాలు చేసావు, దయగా చూసావు. అయినా ఈ బానిస తన యజమానిని గుర్తించలేదు. లోకంలో చాలామంది మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటారు, నువ్వు అలా కాకుండా మంచివాడివనీ నీకు తెలుసు. కానీ నా సంగతేమిటి? నేను చాలా భ్రమల్లో ఉన్నాను. స్త్రీ పురుషులు సమానమనన్నట్లు ప్రవర్తించాను. నేను ఏ పురుషుడి కన్నా తక్కువదాన్ని అనుకోలేదు. ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకివాళ తెలిసింది. ఔను...సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరు-మేం స్వేచ్ఛగా ఉన్నాం. పురుషులతో సమానులం అనుకోవటం ఎంత వెర్రితనం. అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి. ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది." అని వ్యంగ్యంగా చురక అంటిస్తుంది.
ఈ మాటలతో ప్రసాద్ కు, చదివే ప్రేక్షకులకూ కూడా జ్ఞానోదయం అవుతుంది. :)

ఇంక మానవి పుస్తకంలో భర్త, ఇల్లు, పిల్లలే లోకం అనుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంట్లో పనిమనిషిలా చాకిరీ చేస్తూ అదే జీవితం అనుకుని ఆనందంగా గడిపే ఇల్లాలి జీవితంలో సంభవించే పెనుమార్పులు, తరువాతి పరిణామాలే మానవి కథ. వసంత, భర్త, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి తల్లిలాగే ఉంటుంది అన్ని కోణాలలోనూ. చిన్నమ్మాయి స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. వసంత అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కాకపోతే రాను రాను తన వ్యక్తిత్వం త్యజించి, అభిరుచులను పక్కనబెట్టి ఒక పనిమనిషిలా మారిపోతున్న భార్యతో కాపరం చెయ్యడం దుస్సాధ్యమవుతున్న భర్త మరొకరిని ఆశ్రయిస్తాడు. తల్లిని అవసరాలకు వాడుకోవాలనే చూసే పెద్ద కూతురి చెర నుండి విడిపించి తల్లిని తనతో పాటే తీసుకువెళుతుంది చిన్న కూతురు. వసంత, చిన్న కూతురు, తన స్నేహితురాళ్ళు, వాళ్ల ఆశయాలు, ఉద్యమాలు అన్నిటిలో పాలుపంచుకుంటూ జీవితంలో తను ఏమి కోల్పోయిందో, తన వ్యక్తిత్వాన్ని ఎలా విడిచిపెట్టిందో మెల్లిమెల్లిగా గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని సాధించి మానవి అవుతుంది. ఈ రచనలో మార్కిజం పాళ్ళు కాస్త ఎక్కువైనట్టు అనిపించినా చదవదగ్గ పుస్తకం.

కోమలి గాంధారం - మృణాళిని
స్వీట్ హోం తో చాలా పోలికలున్న చిన్న కథల సమాహారం. అన్ని స్త్రీవాద కథలే. కోమలి చాలా తెలివైంది. తన భర్తకి, తనతో పాటు పనిచేస్తున్న మగవాళ్ళకూ అవసరమైనప్పుడల్లా చురకలు అంటిస్తూ చాకచక్యంగా పనులను నెట్టుకొస్తూ ఉంటుంది. మొదట్లో బావున్నట్టు అనిపించినా కొన్ని కథలయ్యాక చాలా బోర్ కొట్టింది. నాకు నచ్చని విషయం ఏమిటంటే కోమలికి తన భర్త మీద అస్సలు గౌరవం లేదు. ఎప్పుడూ తీసి పారేస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న భర్తని మరీ అంత హీనంగా, చులకన చెయ్యడం ఏమిటో నాకర్థం కాలేదు. స్వీట్ హోం తో పోల్చుకుంటే విమల, బుచ్చిబాబుని ఎంత వెక్కిరించినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతను వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరచదు. కానీ కోమలి అలా కాదు. ఇది నాకు కనిపించిన నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే కోమలి, తన అత్తగారు రెగ్యులర్ అత్త-కోడళ్ళ సీరియల్స్ లాగ కీచులాడుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మంచి స్నేహితురాళ్ళలా ఉంటారు. ఇది నాకు బాగా నచ్చింది.

కోతికొమ్మచ్చి - మూడు భాగాలు - ముళ్ళపూడి వెంకటరమణ
కోతికొమ్మచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది. పసందైన విందు భోజనంలాంటి రచన. మెల్లిగా చదువుతూ ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ కొంత జీర్ణం చేసుకుంటూ, కొంత నెమరువేసుకుంటూ....ఇక్కడ తమిళంలో ఉన్న ఒక expression వాడాలనుంది...."రసిచ్చి, రుసిచ్చి, ఇనిచ్చి" చదివాను. అంటే రసాస్వాదన చేస్తూ, రుచిని అనుభవిస్తూ, తియ్యదనాన్ని నెమరువేసుకుంటూ చదివాను.

ఈ రమణ గారేంటో ఆయన కష్టాలను కూడా ఏదో కథ చెబుతునట్టు, ఆయనేకేం పట్టనట్టు చాలా మామూలుగా చెబుతారు. చదువుతున్న మనకే గుటక పడదు. తెల్లబోయి తేరుకుని కన్నీళ్ళు పెట్టాలా, వద్దా అన్న మీమాంసలో ఉండిపోతాం. కళ్ళు మాత్రం మనమాట వింటాయేంటి...మెదడు ఏదో ఆలొచిస్తుందిలే మనం కన్నీళ్ళు కార్చేద్దాం అంటూ నీళ్ళకుండల్ని జారవిడుస్తాయి. తెప్పరిల్లే టైము కూడా ఇవ్వకుండా వెనువెంటనే నవ్వించేస్తారు. ఈయన మాత్రం అసాధ్యులు, నిజంగా! ఆయన రచనావ్యాసగం, ఉద్యోగం, సినిమ అనుభవం కడురమణీయంగా ఉన్నాయి. మూడు భాగాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.

అతడు అడవికి జయించాడు - డా. కేశవరెడ్డి
పట్టుమని వంద పేజీలు కూడా లేని పుస్తకం...పొద్దున్నుండీ, సాయంత్రం వరకూ ఒక ముసలాడి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు - అంతే కథ. చెప్పడానికి ఇంత సులువుగా ఉందిగానీ ఆ తొంభై పేజీలలో జీవిత పరమార్ధాన్ని చూపించారు. పందులను పెంచుకునే ఒక ముసలివాడు, అతని మనవడు, రెండు సుక్క పందులు - ఇవే కథలో పాత్రలు. ఒకరోజు సాయంత్రం ముసలివాని మనవడు మేతకు తీసుకువెళ్ళిన రెండు పందుల్లో ఒకదానితో మాత్రమే తిరిగొస్తాడు. రెండో పంది - కడుపుతో ఉన్నది తప్పిపోయిందని తెలుసుకున్న ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడవిలోకెళ్ళి, రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు తెల్లారాక ఇంటికి తిరిగొస్తాడు. అయితే సుక్క పంది దొరికిందా లేదా? అతని జరిపిన పోరాటం ఏమిటి? అన్నదే మొత్తం కథ. జీవనము- మరణము, సంతోషం-దుఃఖము, నిశ్చలత-అనిశ్చలత, ఆశ-నిరాశ, జయము-అపజయము, నిర్వేదం-స్థితప్రజ్ఞత, అన్వేషణ-అస్థిత్వ సంఘర్షణ...ఒకటేమిటి, వీటన్నిటి గురించీ ఉంది. మొత్తం జీవితం యొక్క తత్వాన్ని ఆ చిన్న కథలో బంధించారు. చెప్పాలంటే చాలా హెవీ డోస్. ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. ఈ పుస్తకం ఒకసారి చదివి పక్కనపెట్టేసేది కాదు. కొంచం కొంచం మెల్లిగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ దానిలో మమైకమైపోతేగానీ పరమార్థం బోధపడదు. చాలా బరువైన రచన. భాష కొంచం కొత్తగా ఉండి నలగడానికి కాస్త సమయం పట్టిందిగానీ భావం నలగడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్టుంది. ఇది పూర్తిచేసేసరికి ఏమిటో నేను వేదాంతంలో పడిపోయాను..ఎంతోసేపటికిగానీ తేరుకోలేదు. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.

వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి వీరేంద్రనాథ్
ఆ మధ్య యండమూరి నవలల గురించి బ్లాగు/బజ్జు మితృలతో ఓ పెద్ద చర్చ జరిఒగింది. యండమూరిని ని మరీ అంత తీసిపారేయక్కర్లేదు, కొన్ని చదవాల్సినవి ఉనాయి అన్న మితృల సలహా మీదట మళ్ళీ వెన్నెల్లో ఆడపిల్లతో మొదలెట్టాను. ఒక చెస్ క్రీడాకారుడు, అతన్ని అజ్ఞాతంగా ప్రేమిస్తూ కవ్వించే ఒక ఫోనమ్మాయి. ఆ అమ్మాయిని కనిపెట్టడానికి అతనికి క్లూలిస్తూ ఉంటుంది. అతను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా, ఆ అమ్మాయి కనిపెట్టాడా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే. మొదట్లో ఓ 20 పేజీలకవరకూ కథ బాగానే నడించింది. పాత్రల పరిచయం అదీ బాగానే ఉంది. ఆ పిల్ల ఇచ్చే పజిల్స్ అవీ తమాషాగా అనిపించాయిగానీ కాసేపయ్యేటప్పటికి బండి అస్సలు ముందుకి నడవలేదు. నాకు ఆ పజిల్స్ గోల చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నిక్కుతూ నీల్గుతూ మెల్లిగా నడిపించాను మొత్తానికి. అయితే మధ్యలో జేమ్స్ పెళ్ళి గురించి జేమ్స్ మనస్తత్వ విశ్లేషణ మొదలయినదగ్గరనుండీ బాగుందనిపించింది. ఆఖరాఖరుకి ఆ పజిల్స్ ని ఆ తెలివితేటల్ని చాలా ఎంజాయ్ చేసాను. కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ఆ పజిల్స్, కథ నడిపించిన తీరు బాగుంది అనిపించింది. అయితే మళ్ళీ మళ్ళీ చదివే నవల మాత్రం కాదు.

సాయంకాలమైంది - గొల్లపూడి మారుతీరావు
నాకు అస్సలు అస్సలు నచ్చలేదు అన్నది చిన్న expression అవుతుంది. ఏ కాలానికీ, ఏ సంఘానికీ పనికిరాని, అవసరంలేని కథ ఇది అనిపించింది. పోనీ కొత్తగా ఏదైనా నేర్చుకుందామా అంటే అదీ లేదు. పోనీ నిజాయుతీగా, చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్టుగా రాసారా అంటే అదీ లేదు...రంగులు పులిమి, కంటి తుడుపు కోసం అక్కర్లేని పాత్రలు ప్రవేశపెట్టడం. పోనీ వర్ణనలను, రచనాశైలిని మెచ్చుకుందామా అంటే ఉహూ మనసొప్పట్లేలేదు.

సదాచారసాంప్రదాయాన్ని పాటించే ఒక వైష్ణవుల కుటుంబం. నాలుగో తరం నుండి వారింట్లో వచ్చే మార్పులు. పిల్లాడు పైచదువుల కోసం అమెరికా వెళ్ళడం. అమ్మాయి వేరే కులస్థుడిని పెళ్ళి చేసుకోవడం. తద్వారా ఆ దంపతులు ఎలా బాధపడ్డారు - ఇదీ కథ.

ఏ రకంగానూ నచ్చలేదు నాకు. కొన్ని వర్ణనలైతే రోత పుట్టించాయి. నవనీతాన్ని ఒక దరిద్రుడు రేప్ చేస్తుంటే కోపంతో ఆ అమ్మాయి వాడిని సగం విరిగిన సీసాని తూట్లు తూట్లుగా పొడుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టు విడువడు. అప్పుడు "కూలిపోతున్న యోధుడు శరీరమంతా బుల్లెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తూటా పేల్చి ఒక్క శతృవునైనా కబళించి పోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్యనిరతి వీటన్నిటినీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమయిన శరీరానికి అఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు." యుద్ధంలో యోధుడికి, రేపిస్ట్ కి పోలికా? ఇంతటి జుగుప్సాకరమైన వర్ణనని నేనింతవరకూ చదవలేదు, నిజంగా.

అలాగే ఒక వైష్ణువుడికి, క్రిస్టియన్ కి పుట్టిన అమ్మాయిని కలుపుమొక్కతో పోల్చడం....దారుణం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందులో.

సమాజం మారుతోంది, నిజమే. అలా మారడం పై రచయిత ఏ మాత్రము గౌరవము లేనట్టు అనిపించింది. నన్నడిగితే అలా మారడం చాలా గొప్ప విషయం. ఈ సమాజపు అభివృద్ధికి సంకేతం.అయినా కుటుంబాలలో మార్పు అన్నది ఒక్క వైష్ణవ కుటుంబానికే పరిమితం కాదు. అన్ని కులాలలోనూ ఈ మార్పు జరిగింది. ఎవరి పరిధుల్లో వాళ్ళు సంప్రదాయపు బంధాల నుండి బయటపడ్డారు, పడుతున్నారు. ఈ మార్పు మంచిదే కదా. సంప్రదాయాలు, సదాచారాలు కాలానుగుణంగా మారుతాయి, మారాలి. కానీ అదేదో మహాఘోరాపరాధం అన్న భావన కలిగించారు రచయిత ఈ పుస్తకంలో. అంతే కాకుండా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన భారతీయులపై ఏ మాత్రమూ గౌరవము లేకపోవడం. వాళ్ళేదో తల్లిదండ్రులను వదిలేసి వారి సుఖం వారు చూసుకున్నట్టు, పై దేశం వెళ్ళగానే అన్నీ వదిలేసుకున్నట్టు చిత్రీకరించారు. అది చాలా అన్యాయంగా తోచింది నాకు.

ఈ పుస్తకం గురించి ఎంత తక్కువ చెపుకుంటే అంత మంచిది.

పాకుడు రాళ్ళు - డా. రావూరి భరద్వాజ
500 పేజిల పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కథ - వాళ్ళు పడే కష్టాలు, ఆ పరిశ్రమలో ఉండే రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు. చదువుతున్నంతసేపు ఎంత అసహ్యం కలుగుతుందంటే సినిమా అంటే విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చేవాళ్ళ దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు రాసారు. ఈ పరిశ్రంలో ఆడది అంటే అంగడిబొమ్మ. పనికావాలంటే పక్కలోకి చేరాల్సిందే. ఈ పుస్తకం 1990 లో రాసారు. అంటే అప్పటివరకూ సినిమా పరిశ్రమలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేసి రాసి ఉంటారు. అసలు అవి ఎంతవరకు నిజమో తెలీదుగానీ అలా జరిగి ఉంటుంది అన్న ఊహే గొప్ప భయంకరంగా అనిపించింది. మనకు తెలిసిన హీరోయిన్లను ఆ స్థితిలో ఊహించుకోవడానికి భయం వేసింది. అసలు ఊహించుకోవడం అసాధ్యం అయ్యింది. నమ్మబుద్ధి కాలేదు. ఏంటో బాధనిపించింది, ఏడుపొచ్చింది కూడా. ఇంకా 100 పేజీలు మిగిలున్నాయి. ఈ యేడాది లోపల అనగా రేపటి లోపల పూర్తిచెయ్యాలనుకుంటున్నాను :)

వైట్ టైగర్ - అరవింద్ అడిగా (ఇంగ్లీషు)
ఇంగ్లీషు సాహిత్యం..ఈ యేడాదిలో ఈ ఒక్కటే చదివాను. ఢిల్లీ లో ఉండే కారుడ్రైవర్ల దయనీయ పరిస్థితిని వివరించే గొప్ప రచన. మూడేళ్ళు ఢిల్లీ లో ఉంటూ కారు డ్రైవర్ల జీవన విధానాన్ని పరిశీలిస్తున్నానేమో నన్ను గొప్పగా కదిలించిది ఈ పుస్తకం. ఎక్కడో బీహార్ లో పుట్టి, తిండికి గతిలేక, ఒక్కడు పని చేసినా చాలు ఇంటిల్లిపాదీ కనీసం రెండు-మూడు రోజులకైనా తింటారు అనుకునే పరిస్థితులలోనుండి కారు డ్రైవర్లుగా నెలకి రెడు-మూడు వేల రూపాయల జీతానికి ఢిల్లీకి వస్తారు. యజమానులు వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. అడుగులకు మడుగులు ఒత్తిస్తారు. నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ, మనిషిని అన్న విషయమే మరచిపోయి బతుకులీడుస్తున్న కారు డ్రైవర్ల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా రాయడంలో అరవింద్ సఫలమయ్యారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

ఇవే కాకుండా కినిగె ద్వారా గిఫ్ట్ గా పుచ్చుకున్న పుస్తకాలు సెబాసురా శంకరా, తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు చదివాను. రెండూ అద్భుతమైన రచనలు. ఇంకా కినిగె పుస్తకాలు కొన్ని ఉన్నాయి. చదవాలి.

మొత్తానికి ఈ యేడాది నా పుస్తకపఠనము సంతృప్తికరంగానే ఉంది. ఒకే ఒక్క చిన్న అసంతృప్తి ఏమిటంటే ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువ చదవలేకపోయాను. చాలా పుస్తకాలు సగం సగం చదివి ఆపేసాను. ఈసారి అలా చెయ్యకూడదనుకుంటున్నాను. వచ్చే యేడాది ఇవి కూడా ఎక్కువ చదవాలి.

ఇక పుస్తకాల సేకరణ విషయంలో నేను అద్భుతంగా మరో అడుగు ముందుకేసాను. బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను. బహుమతులుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు.

2011 లో నేను కొనుక్కున్న పుస్తకాలు





ఇవి బహుమతులుగా వచ్చినవి

ఇవే కాకుండా కృష్ణవేణి, చలం-సత్యం, శైవం, సుందరం కూడా వచ్చాయి. మిధునం పుస్తకాన్ని శంకర్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు. మిగతా పుస్తకాలన్నీ సుజాత గారు (మనసులో మాట) పంపించారు...ఆవిడకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తనకి నేనెంతో ఋణపడిపోయాను. ఇంకా కినిగె పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన రెహ్మాన్ ని, మురళి కి, నాగార్జున కి ధన్యవాదములు!

ఇవే కాకుండా మరికొన్ని కొన్నాను. కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు కాబట్టి, వాటిని వచ్చే యేడాడి ఖాతాలో వేస్తున్నా.

ఈ పుస్తకపఠనాన్ని, కొనుగోలుని 2012 లో కూడా ఇదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను...చూద్దాం! :)


Tuesday, May 31, 2011

నేను, నా పుస్తకాల గోల

పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు (హాబీ) అని చిన్నప్పటినుండీ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ అదేంటో నాకు ఈ అలవాటు కానేలేదు చిన్నవయసునుండీ. పెద్దనాన్నగారు చెప్పే పద్యాలు అలాగే నేర్చేసుకుని తిరిగి ఒప్పజెప్పడం తప్ప పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. చిన్నవయసులో చందమామ పుస్తకాలు మాత్రం విపరీతంగా చదివేదాన్ని. అవి తప్పితే వేరే పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు. అసలు అంతంత పెద్ద పెద్ద పుస్తకాలు ఎలా చదువుతారో బాబోయ్ అని భయమేసేది నాకు. క్లాసు పుస్తకాలు చదవడానికే బద్దకంగా ఉండేది ఇంక జనరల్ రీడింగ్ ఎక్కడేడిసింది!మా ఇంట్లో రకరకాల పుస్తకాలు ఉండేవి మా కుటుంబంలో అందరికీ చదవడం బాగా అలవాటు. నేను వీళ్ళ మధ్య తప్పబుట్టానేమో అనుకునేదాన్ని ఒక్కోసారి. :(

మా ఇంట్లో అందరూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి పంఖాలు. ఆయన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. సరే మరీ ఇంతలా చెబుతున్నారుగా ఓపాలి చదివి పడేస్తే పోలా అని తొమ్మిదో తరగతిలో మొదలెట్టా "వడ్లగింజలు"...బ్రహ్మాండంగా అనిపించింది....గుక్కతిప్పుకోకుండా చదివేసాను (అప్పట్లో నాకు కళ్ళతో కాకుండా, శబ్దం బయటికి రాకుండా నోటితో చదివే అలవాటుండేది). తరువాత "మార్గదర్శి" చదివాను....అమృతకలశం...వడ్లగింజలకంటే బాగా నచ్చింది. అంతే ఇంక పుస్తకాలు చదవాలన్న తృష్ణ పెరిగింది. "శ్రీపాద కథలు" రెండు భాగాలు ఎకాయెకిని చదివేసాను. నేను పుట్టకముందు రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ ఆంధ్యజ్యోతిలోనో ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. ఆ కాగితాలు చింపి బైండ్ చేసి ఒక పుస్తకంగా కుట్టి ఉంచారు మా ఇంట్లో. అది "స్వీట్ హోమ్ పార్ట్-2"...పెద్ద పుస్తకం. అది చదవడం మొదలెట్టా..విపరీతంగా నచ్చేసింది. తరువాత చేతికి దొరికినది చలం "స్త్రీ"...అప్పటికి నేను పదికి వచ్చాను. స్త్రీ చదివి వెర్రెక్కిపోయాను..అప్పటికి చలం బతికున్నాడా లేడా, చలం ఎవరు అన్న స్పృహ లేదు నాకు. చలం ఎక్కడ ఉన్న ఓసారి వెళ్ళి కలిసిరావాలని అనిపించింది స్త్రీ చదివాక. ఆ తరువాత విశ్వనాథవారి "హాహాహూహూ" పుస్తకం మా అత్త వాళ్ళింట్లో కనిపించింది..బలే గమ్మత్తైన కథ..ఓ దేవతాశ్వం, అది కిందకి దిగి రావడం...బలే వింతగా ఉంటుంది. కొత్తగా, సరదాగా, ఆలోచింపదగినదిగా అనిపించింది అప్పట్లో. చాసో గారు మా ఊరే కదా మా కుటుంబానికి చాలా పరిచయం...మా ఇంటికి కూడా వస్తుండేవారు. నాకు చిన్నతనం కాబట్టి పెద్దగా పరిచయం ఉండేదికాదు. మా ఇంటికొచ్చినా నేనెప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఓసారి మా నాన్నగారు నన్ను, ఆయనకి పరిచయం చేసారు. అప్పుడు ఆయన సంతకం చేసిన కథల పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చారు నాకు. అందులో "కుంకుడాకు" మాత్రమే చదివాను. తరువాత యండమూరి "తులసీదళం"...ఇది కూడా ఏదో సంచికలో సీరియల్‌గా వచ్చేది. దాన్ని కూడా కుట్టి బైండింగ్ చేసి పెట్టారు మా ఫ్రెండు వాళ్ళింట్లో. తనదగ్గరనుండి తెచ్చుకుని అది మొత్తం చదివాను. ఓసారి మా నాన్నగారు, నాకు రూట్స్ తెలుగనువాదం "ఏడు తరాలు" కొని ఇచ్చారు. అది ఎంత హృద్యంగా అనిపించిందంటే...చదువుతూ ఎన్నిసార్లు కళ్లనీళ్లు పెట్టుకున్నానో నాకే తెలీదు. మనసుకి హత్తుకుపోయింది ఆ పుస్తకం. వేదుల సత్యనారాయణ శర్మ గారు రాసిన "ఆర్య చాణక్య" చదివాను...అద్భుతమైన కథనం...చాలా ఉత్తేజపరిచింది ఈ కథ. ఇంక అంతే, పదికొచ్చేసానుగా పుస్తకాలు పక్కన పడేసి క్లాసు పుస్తకాల మీద పడ్డాను...పై చెప్పినవన్నీ నా అంతట నాకు బుద్ధి పుట్టి చదివిన మొట్టమొదటి పుస్తకాలు. వీటిని ఈ జన్మకి మరచిపోలేను.

చిన్నప్పటినుండీ పద్యాలు అనర్గళంగా చెప్పే అలవాటు మాత్రం అబ్బింది. దాంతో భారత, భాగవత, రామాయణాల్లో పద్యాలు బాగా నేర్చుకున్నాను. స్కూల్ లో పద్య పఠన పోటీలు పెడితే నాకే కచ్చితంగా ఫస్ట్ వచ్చేది. ఓసారి శతక పద్య పఠన పోటీలు పెట్టారు. "లలితసుగుణజాల తెలుగుబాల" అనే మకుటంతో ఉండే శతకం (ఈ పద్యాలు కరుణశ్రీ రాసారు) లో 100 పద్యాలూ కంఠతా పట్టాను. కానీ పోటీకెళ్ళేసరికి 85 మాత్రమే గుర్తు ఉన్నాయి...అయినా ఫస్ట్ నాకే. (సెకండ్ వచ్చిన అమ్మయి 56 పద్యాలే చెప్పింది). ఈ పద్యాలు నేర్చుకునే అలవాటు మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ ఉంది. కాబట్టి మా పెద్దనాన్నగారు మా మధ్య ఒక పద్యపఠన పోటీ పెట్టారు. దానికోసమనీ నా పదవతరగతి సెలవుల్లో విరాటపర్వం మొత్తం బట్టీ పట్టాను. మా ఇంట్లో భారతం పర్వాలవారీగా ఒక్కో పుస్తకం ఉండేది. కాబట్టి విరాటపర్వాన్ని కూడ ఓ పుస్తకం గా లెక్కేసేస్తున్నా. :)

ఇంక అంతే, మళ్ళీ జనరల్ రీడింగ్ జోలికి పోలేదు. మా ఇంట్లో అందరూ "దీనికి పుస్తకాలు చదివే అలవాటు ఈ జన్మకి అబ్బదు, ఇది ఎందుకూ పనికిరాదు" అని నిర్ణయించేసుకునే సందర్భంలో మళ్ళీ మొదలెట్టాను ఓ నాలుగేళ్ళు గడిచాక...నా డిగ్రీ లో. కానీ తెలుగు కాదు. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ప్రయాసతో Ayn Rand రాసిన "Fountain Head". మనకి వచ్చిన ఇంగ్లీషే అంతంత మాత్రం ఇంక అంత పెద్ద పెద్ద పుస్తకాలు కొరుకుడుపడాలంటే సాధ్యమా!...ఓ సంవత్సరం చదివా. తరువాత "Atlas Shrugged"...ఇది కూడా ఓ యేడాది పట్టింది. మాక్సీం గోర్కీ "అమ్మ" చదివాను...బావుంది కానీ ఏడుతరాలంత కదిలించలేదు.

ఇంకేముంది డిగ్రీ అయిపోగానే విజయనగరం వదిలేసి హైదరాబాదుకి చలో....HCU లో చేరాక పుస్తకాలు వగైరా మూలన పడేసి కెరీర్ అనుకుంటూ దానివెంట పరిగెత్తాను. మళ్ళీ ఏ పుస్తకం తెరవలేదు. మా HCU లో ఉన్న తెలుగు లైబ్రరీ లాంటిది నేనెక్కడా చూడలేదు. అసలు రెండు కళ్ళు చాలవు ఆ పుస్తకాలు చూడడానికి. కానీ నేనెప్పుడు అటువైపు పోనేలేదు. PhD కొచ్చాక...మూడేళ్ళు దాటాయి 2007కి...ఎంతకీ మా గైడ్ తెమల్చడు...నరకం చూపిస్తున్నారు. అసలు ఈ జన్మకి నా PhD అవుతుందా అని కళ్ళనీళ్లు పెట్టుకునేదాన్ని రోజూ. విసుగు, నిరాశ, నిస్పృహ, విరక్తి ఇలాంటివన్నీ కలిగి ఏమి చెయ్యలో తెలీదు. నాతోటివారికి చెప్పుకుందామా అంటే ఇంచుమిందు వారూ అదే పరిస్థితిలో ఉంటారు. పెద్దవారికి చెబితే PhD యా మాజాకా, అలాగే ఉంటుంది, తట్టుకోవాలి అన్నీ అంటారు. ఇక ఎటూపాలుపోక పుస్తకంలో తలదూర్చాను. లైబ్రరీకెళ్ళి "కన్యాశుల్కం" తెచుకున్నాను. ఆపాకుండా చదివాను. ఎంత నచ్చేసిందంటే ఇన్నాళ్ళు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవనందుకు ఎన్ని సార్లు నన్ను నేనే తిట్టుకున్నానో చెప్పలేను. మా ఇంట్లో ఉండి కూడా ఎప్పుడూ చదవలేదే అని తెగ బాధపడిపోయాను. ఏకబిగిన చదివేసి మొత్తం పూర్తిచేసాను. సంతృప్తి కలగలేదు, మళ్ళీ మొదటి పేజీ నుండి మొదలెట్టాను. అలాగే ఏకబిగిన చదివాను. ఇప్పటివరకూ ఒకే పుస్తకం వరుసగా రెండు సార్లు చదవడం అన్నది కన్యాశుల్కం విషయంలో మాత్రమే జరిగింది. ఇంకే పుస్తకం అలా చదవలేదు. ఆ తరువాత చలం ది "సత్యం, శివం, సుందరం" తీసాను. అప్పుడు పట్టింది నాకు చలం పిచ్చి...దాదాపు ఆయనవి అన్నిపుస్తకాలు ఉన్నాయి మా లైబ్రరీలో...ఒక్కోటి చదవడం మొదలెట్టాను. కొన్ని వీపరీతంగా నచ్చాయి. కొన్ని కొంచం నచ్చాయి, కొన్ని అస్సలు నచ్చలేదు, ఇంకొన్ని చిరాకేసాయి. కానీ వాటిని ఎలా విశ్లేషించుకోవాలో తెలియలేదు. అప్పుడు రంగనాయకమ్మగారి "చలం సాహిత్యం" పుస్తకం చదివాను. అది చదివాకే చలం ఇంకా బాగా బోధపడ్డాడు అని చెప్పగలను. అలా RN పుస్తాకాల మీద పడ్డాను. స్త్రీవాద రచనలు బాగా నచ్చాయి. మార్కిజం పాళ్ళు ఎక్కువవుతున్నకొద్దీ కొద్దిగా బోర్ కొట్టాయి.


ఇంక అక్కడమొదలయింది నా పుస్తక పఠన ప్రవాహం. ఒకటేమిటి విశ్వనాథ వేయిపడగలు, శ్రీరమణ మిధునం, పేరడీలు, హాస్యజ్యోతి, కథలు...అన్నీ, ముళ్ళపూడి రమణీయాలు అన్నీ, కొ.కు చదువు, వ్యాసాలు, నామిని పచ్చనాకుసాక్షిగా, మిట్టూరోడి కథలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు, తిలక్ కథలు, శ్రీపాద క్షీరసాగర మధనం,పుల్లంపేట జరీచీర,అనుభవాలు-జ్ఞాకపకాలు, ఆరుద్ర రచనలు కొన్ని, యండమూరి యుగాంతం, భ.రా.గో రచనలు, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, ఇరావతీ కర్వే యుగాంతం, గురజాడ దిద్దుబాటు, భానుమతి అత్తగారి కథలు, నాలో నేను, మొక్కపాటి బారిస్టరు పార్వతీశం, మల్లాది కృష్ణాతీరం,శ్రీదేవి కాలాతీతావ్యక్తులు....ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే రెండు టపాలు అవుతాయి...అలా చేతికి ఏది దొరికితే అది చదివేసాను. అలా చదవడం వల్ల నాకు ఎలాంటి భావనలు నచ్చుతాయి, ఎలాంటివి భరించలేను అన్న లైన్ క్లియర్ కట్ గా బోధపడంది. ఇలా చదవడమే కాకుండా విశాలాంధ్ర పై దాడి కూడా చేసాను. నచ్చిన పుస్తకాలన్నీ కొనేసుకున్నాను. కోటీలో విశాలాంధ్ర exhibition ఉంటుంది ఎప్పుడూ. అక్కడ 10% ఆఫ్ ఇస్తాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు బోల్డు పుస్తకాలు కొనేసాను రూ. 1000 రూపాయలయింది. ఆ పుస్తకాలు యూనివర్సిటీకి ఎలా తీసుకెళ్ళాలన్నది సమస్య. కోటీలో పెద్ద బేగు కొని అందులో అన్నీ నింపేసి తీసుకెళ్ళాను. కేంపస్ లో అడుగుపెడుతుంటే అందరూ ఏంటి ఊరెళ్ళి వస్తున్నావా అని పలకరించారు. :D ఇంక అప్పటినుండీ ప్రతీ ఆదివారం కోటీ కి ఆ బేగుతో వెళ్ళడం రూ. 1000-1500 రూ వరకూ పుస్తకాలు కొనడం. విశాలాంధ్రవాడు సంతోషం పట్టలేక నాకు 15% ఆఫ్ ఇచ్చేవాడు. తరువాత అది 18% పెంచాడు. ఓరెండు వారాలు నేను వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి 'ఏంటి మేడం మీరు రావట్లేదు' అని అడిగేవాడు. :D ఏదైనా పుస్తకం లేకపోతే నాకోసం తెప్పించేవాడు. చలం పుస్తకాల కోసం అతన్ని పెట్టించిన పరుగులు అన్నీ ఇన్నీ కాదు. ప్రింట్ లో లేని పుస్తకాలు కొన్ని వాళ్ళ గోడౌన్ లో ఎక్కడో పడి ఉంటే అవి వెతికి మరీ తెప్పించుకున్నాను. ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ exhibition కి వెళ్ళి ఏదో ఒక్కటైనా పుస్తకం కొనకుండా బయటకి వచ్చినది ఏనాడూ లేదు. చివరికి PhD అయిపోయాక ప్రత్యేకంగా వాడిదగ్గరకెళ్ళి స్వీట్స్ ఇచ్చి ఇంకో నాలుగు పుస్తకాలు కొని మరీ వచ్చాను. అలా ఆ యేడాది మొత్తం పుస్తకాల మీదే గడిపాను. ఓ 6-7 వేల దాకా పుస్తకాల మీద ఖర్చుపెట్టాను. ఆ మొత్తం సంవత్సరం PhD అన్నది పట్టించుకోలేదు. పూర్తిగా పక్కన పెట్టేసాను. ఆ తరువాత మా గైడ్‌ ఎందుకో, ఏమిటో దారిలోకొచ్చి నన్ను పట్టించుకోవడం మొదలెట్టారు. ఇంక అప్పటినుండీ నేనూ ఈ జనరల్ రీడింగ్ పక్కనపెట్టేసి సీరియస్ గా రిసెర్చి చేసాను. అంతే మళ్ళీ వదిలేసాను పుస్తకాలని. (మధ్యమధ్యలో యండమూరి నవలలు, యద్ధనపూడి సులోచనారాణి నవలలు కొన్ని చదివాను. కానీ ఏదో కాలక్షేపానికే).

ఇదిగో ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ మొదలెట్టాను. ఎలా అంటే...రోజూ ఆఫీసుకి మెట్రోలో వెళ్ళేటప్పుడు 20-25 ని. వచ్చేటప్పుడు 20-25 ని. ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది. మొదట్లో ఆ ప్రయాణం కొత్త కాబట్టి ఆ టైములో వచ్చేపోయేవారిని గమనిస్తూ ఉండేదాన్ని. తరువాత కాస్త బోర్ కొట్టి పాటలు వినడం మొదలెట్టాను అదీ బోర్ కొట్టాక ఆ 20 ని. ఏదో పెద్ద ప్రయాణంలాగ అనిపించడం మొదలెట్టింది. మామూలుగా దూరప్రయాణాలలో పుస్తకం చదువుకునే అలవాటుంది, అదే ఇక్కడ ఎందుకు మళ్ళీ మొదలెట్టకూడదూ అనిపించింది. మెల్లిగా మొదలెట్టాను. ఈసారి కాస్త ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుదామని నిర్ణయించుకున్నాను. గత మూడు నెలలలో నేను పూర్తి చేసిన పుస్తకాలు

1.చదువులా చావులా - నామిని
2. The White Tiger - Aravind Adiga
3. The Illustrated Brief History of Time, Updated and Expanded Edition - Stephen Hawking
4. సహజ - ఓల్గా
5. మానవి - ఓల్గా

'చదువులా చావులా' గురించి ఇంతకుముందే బ్లాగులో రాసాను.

'వైట్ టైగర్' చాలా ఎంజయ్ చేస్తూ చదివాను. డిల్లీ లో రెండేళ్ళుగా కారు డ్రైవర్ల పరిస్థితి గమనించి ఉన్నానేమో ఈ పుస్తకం అద్భుతంగా అనిపించింది. బీహార్ నుండి వచ్చే కారు డ్రైవర్ల దయనీయ పరిస్థితి, వారి మానసిక సంఘర్షణ. స్వేచావాయువులు పీల్చాలనే ఆరాటం...ఇవన్నీ చాలా బాగా చిత్రీకరించారు. అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. డిల్లీ పరిస్థితులు తెలిసున్నవాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.

నాకు ఫిజిక్స్ అంటే కొంచం ఆసక్తి. ఇంతకుముందే Brief History of Time చదివాను. ఇప్పుడు updated version వచ్చిందని తెలిసి వెంటనే కొని చదివేసాను. Stephen Hawking గురించి నేను కొత్తగా చెప్పేదేముంది...ఆ పుస్తకం చదువుతుంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అబ్బురంగా తోస్తుంది.

'సహజ', 'మానవి'..ముందుగా సుజాత (మనసులో మాట) గారికి బోలెడు బోలెడు ధన్యవాదములు ఈ పుస్తకాలు పంపించినందుకు. ఓల్గా వ్యాసాలు ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు చదివానుకానీ దృష్టిపెట్టి ఎప్పుడూ చదవలేదు. ఈ పుస్తకాల గురించి తెలియజెప్పడమే కాకుండా వెంటనే పంపించినందుకు నేను సుజాత గారికి ఋణపడిపోయాను. రెండూ మంచి పుస్తకాలు....స్త్రీ చైతన్యం, హక్కులు ప్రధాన ప్రాతిపదికగా రాయబడిన కథలు...నాలో ఎన్నో ఆసక్తికరమైన ఆలోచనలను రేకెత్తించాయి.

తెలుగయితే 20 నిముషాలలో ఓ 30 పేజీల వరకూ అయిపోయేవి. ఇంగ్లీషు అయితే ఓ 15 వరకు అయ్యేవి. మూడునెలలలో ఐదు పుస్తకాలు చదివానంటే నాకే గొప్ప ఆనందంగా ఉంది.

ఇప్పుడు చదువుతున్నది Ideas and Opinions - Einstein. ఇది కొంచం కష్టంగా ఉంది...అయినా ఇష్టం గా చదువుతున్నాను. కాకపోతే కాస్త మెల్లిగా నడుస్తున్నాది బండి.

తరువాత లిస్ట్ లో ఉన్నవి.

1. విశ్వదర్శనం - నండూరి
2. Delhi - Kuswanth Singh
3. The Motorcycle Diaries (ఎప్పటినుండో చదవాలని అనుకుంటూ ఉన్నాను, ఇప్పటికి నా లిస్టులోకొచ్చింది).
4. చివరికి మిగిలేది - బుచ్చిబాబు (ఇది సగమే చదివాను, పూర్తిచెయ్యాలి).

ఇవి పూర్తయ్యాక మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టుకుంటాను. చినవీరభద్రుడి కథలు , కా.రా కథలు చదవాలని కోరిక. తరువాతి లిస్టులో అవి ఉంటాయి. ఏది ఏమైనా అసలు పుస్తకాలు చదవడం అలవాటు లేని స్థాయి నుండీ మెల్లిమెల్లిగా లిస్టుగా పెట్టుకుని పుస్తకాలు చదివే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ నన్ను నేను మలుచుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఎంతో మానసికోల్లసాన్ని కలిగించాయి. వీటినుండి ఎంతో నేర్చుకున్నాను. ఆలోచనా శక్తి అభివృద్ధి చెందింది. పరిశోధనాసక్తి పెరిగింది. కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అంతర్గత భావాలను వ్యక్తపరచగలిగే సామార్థ్యం పెంపొందింది. భాష మీద పట్టు చిక్కింది. ఈ పుస్తకాలు నాకు నేస్తాలు....చిరాకులో, బాధలో నాకు తోడుగా నిలిచాయి, మరువలేని ఆనందాన్ని పంచాయి. ఈ పుస్తకాలే లేకపోతే నా జీవితంలో అతి ముఖ్యమైన ఒక భాగం లేనట్టే. గత రెండు మూడేళ్ళుగా ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పుస్తకమే ఇస్తున్నాను. ఇది, ఇప్పుడు ఒక అలవాటుగా కూడా మారింది. వేరే బహుమతుల వైపు దృష్టి పోనేపోవట్లేదు. సందర్భానికి తగ్గట్టుగా ఏం పుస్తకం ఇద్దాం అని ఆలోచిస్తుంటాను. కానీ నేను చదివినవి ఏమీ కావు...ఇంకా ఎన్నో ఏన్నెన్నో ఉన్నాయి. ప్రతీసారి నేను ఈ పుస్తకం చదవలేదే అనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. అవన్నీ ఎప్పుడు చదువుతానో ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితకాలం సరిపోతుందా అని బెంగగా ఉంటుంది. కానీ నిరంతరంగా చదవడం తప్పించి చేయగలిగినది ఏమీ లేదు కదా!

Let books be your dining table,
And you shall be full of delights
Let them be your mattress
And you shall sleep restful nights.... అని ఎక్కడో చదివాను. ఇది నాకు బాగా నచ్చింది!



Monday, May 9, 2011

చదువులా, చావులా?

నా స్నేహితురాలి కూతురు బలే చురుకైన పిల్ల. వాగుడు కాయ నెంబర్ వన్ ...ఒకసారి మొదలెట్టిందంటే ఆపడం చాలా కష్టం. చురుకైనది, చాలా తెలివైనది కూడా. అలాంటిది మొన్న ఆ మధ్య కలిసినప్పుడు చాలా డల్ గా ఉన్నాది. మాటలు బాగా తగ్గించేసింది. నేను దాన్ని పిలిచి, కొత్త స్కూలు లో చేరానన్నావు, ఆ విశేషాలు చెప్పు అని అడిగితే పెదవి విరిచేసి, మాట మార్చేసింది. ఏమయింది దీనికి అని మా ఫ్రెండుని అడిగాను. కొత్త స్కూలు లో చేర్చాక దానికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాగుడు తగ్గించి బుద్ధిగా చదువుకుంటున్నాది. మంచిదే, కొత్త స్కూలులో బాగా చెబుతున్నారు, పిల్ల దారిన పడుతోంది అదే నాకు సంతోషం అని ఇంత మొహం చేసుకుని మెరిసే కళ్ళతో నా ఫ్రెండు చెబుతుంటే నాకు ఎక్కడో అనుమానపు పొర మెదిలింది. సరే అని సమయం చూసి దాన్ని పిలిచి, ఆ మాట ఈ మాట కలిపి, మెల్లిగా స్కూలు గురించి అడగడం మొదలెట్టను. మొదట్లో తప్పించుకోవాలని చూసినా, ఎట్టకేలకు పెదవి విప్పింది. దానికి కొత్త స్కూలు అస్సలు నచ్చలేదు. అక్కడ పాఠాలు చెప్పి చంపేస్తున్నారు. ఏమీ బుర్రకెక్కట్లేదు. కావలసినట్టు ఆడుకోవడనికి, చందమామలు చదువుకోవడానికి టైము ఉండట్లేదు, విసుగొస్తున్నాది పాపం. ఇంతా చేస్తే అది చదువుతున్నది ఆరో తరగతి. మేథ్స్ టీచరు మహా కర్కోటకుడుట. చెప్పినది వినడం, పది సార్లు బట్టీ పట్టడం తప్ప ఏదైనా అర్థం కాలేదని అడిగితే చెంపలు వాయిస్తాడట. ఏదైనా డౌటు అడిగితే ఆ మాత్రం అర్థం చేసుకోలేవూ, చూడు నీ తోటి పిల్లలు ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారో అని ఎద్దేవా చేస్తాడట. దాని మేథ్స్ నోట్ బుక్ చూసాను. ఆరో తరగతిలో logarithms ఉన్నాయి. ఇదేమిటి మన చదువుకున్నప్పుడు ఏడు లో కొంత పరిచయం మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఆరు లోనే చెప్పేస్తున్నారా, సర్లే కాలం మారిందిగా అనుకున్నాను (ఈ మధ్య స్కూల్లో సిలబస్సు అవీ ఎలా మారాయో నేను గమనించలేదు). పాపం ఆ చిన్ని బుర్రకి లాగ్ పవర్ e కి లాగ్ పవర్ 10 కి ఉన్న తేడా అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది అంటున్నాది. దాని తెలుగు అసైన్మెంట్ చూసాను. "సువర్ణదీర్ఘసంధి" అని ఉంది...దానికి టిక్ పెట్టబడి, మార్కులు కూడా వేయబడి ఉన్నాయి. వాళ్ళ టీచరే కరక్ట్ చేసిందిట...రెండు సార్లు 'సువర్ణ అని రాసినా అది తప్పుగా కనిపించలేదు మహతల్లికి.

ఇంతలో పక్కింటి అమ్మయి ఒకర్తి వచ్చింది పుస్తకాలు పట్టుకుని. వాళ్ళిద్దరూ రోజూ ఓ గంట కుర్చుని చదువుకుంటారట. ఆ పిల్ల 8 చదువుతున్నాది. ఆ పిల్ల నోట్స్ చూసాను. అందులో ప్రోబబిలిటీ ఉంది....ఏదో భయంకరమైన కౄర జంతువుని చూసినట్టు అదిరిపడ్డాను నేను. ఎనిమిది లోనే ప్రోబబిలిటీ ఏమిటి, మాకు పది లో ప్రోబబిలిటీ గురించి కొంచం పరిచయం మాత్రం చేసేవారు అంతే. ఆ మాత్రం దానికే చుక్కలు కనిపించాయి నాకు. ఇప్పుడేమో ఈ పిల్ల ఎనిమిదిలోనే చదివేస్తున్నాది. పైగా ఆ పిల్ల చెప్పినది విన్నాక నాకు కళ్ళు తిరిగినంత పనయింది. వాళ్లకి ప్రోబబిలిటీ పాఠ్య పుస్తకంలో లేదుట. పై క్లాసులలో ఉంటుందిట. కానీ కింది క్లాసులలోనే అది చదివేసుకుంటే పదికి వచ్చేసరికి సులువుగా ఉండి పదిలోనే ఇంటర్ లెక్కలు అవీ నేర్చేసుకోవడానికి వీలుగా ఉంటుందిట. అప్పుడు ఇంటర్ లో మొత్తం సమయమంతా IIT కోచింగ్ మీద ఖర్చు పెట్టి మంచి ర్యాంకులు తెచ్చేసుకోవచ్చుట. ఇది వాళ్ల స్కూలో ప్లాను. అందుకని వీళ్ళని ఇలా రుద్దేస్తున్నారు. ఇది విన్నాక నాకు ఒక విచిత్రమైన, భయంకరమైన ఊహ వచ్చింది. రేపొద్దున్న కడుపులో పిండం పడీ పడగానే, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వడానికి కావలసిన ఆసక్తిని రేకిత్తించే మందులను ఇంజక్ట్ చేసేసి, పుట్టగానే చదువు మొదలెట్టేసి,ఆరో తరగతి లోపే పదో తరగతి పూర్తిచేయించేసి, పదో తరగతి లోపు IIT కోచింగు పూర్తయిపోయి, ఇంటర్ లో ఇంజనీరింగు కోర్సులు చెప్పేసి, B.Tech లో M.Tech, M.Tech లో phd చేయించేసి...అమ్మో...తలుచుకుంటేనే కడుపులో దేవినట్టనిపించింది. :( సరే ఇంతకీ మీరిద్దరూ వేరేవేరే క్లాసులు కదా కలిసి చదువుకోవడమేమిటర్రా అని అడిగితే.... పక్కింటి పిల్ల తో కూర్చుని చదువుకుంటే ఎనిమిదో క్లాసు లెక్కలు కూడా దీనికి కొంచం తెలుస్తాయిట (ఇది నా ఫ్రెండు పైత్యం) అప్పుడు ఎనిమిదో క్లాసుకొచ్చేసరికి దీనికి సులువుగా ఉంటుందిట. అలాగే దీనికి చెబుతూ చదువుకోవడం వల్ల పక్కింటి పిల్లకి ఆ లెక్కలు బాగా వంటబట్టి ఇంకెప్పటికీ మరచిపోదుట. ఆహ ఏమి తెలివితేటలే తల్లి అని, ఇంక లాభం లేదని చెప్పి, ముందు ట్రీట్మెంట్ వీళ్ల అమ్మకి జరగాలి అనుకుని...నామిని రాసిన "చదువులా, చావులా?" పుస్తకం ఇచ్చాను నా ఫ్రెండుకి. ఈ మధ్యనే ఈ పుస్తకం నేను చదివాను.

నామిని రాసిన ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇది 2008 లో వచ్చిందనుకుంటా. ఈ పుస్తకం గురించి ఆయన మాటల్లో: "పాత కాలంలో పిల్లల్లు సరి అయిన వైద్యం అందక లేత వయసులోనే చచ్చిపోయేవాళ్ళు. ఈ కొత్త కాలంలో చేతికి అంది వచ్చిన పిల్లలు, మనం కోరిన చదువుల్ని అందుకోలేక అన్యాయంగా చచ్చిపోతున్నారు"

అలా ఉంది ఇవాల్టి పరిస్థితి. నామిని 'ఇస్కూలు పిల్లకాయల కథ', 'పిల్లల భాషలో ఆల్జీబ్రా' అనే రెండు పుస్తకాలు రాసారు ఇంతకుముందే. కానీ ఈ చదవుల చేతిలో నలిగిపోయే పిల్లల బాధలు చూడలేక ఈ పుస్తకం రాసారుట. ఈ పుస్తకం లో రాయదలుచుకున్న విషయాన్ని 50 మంది పిల్లలకు చెప్పారట. వాళ్ళంతా దీనికి "చదువులా చావులా" అనే పేరు పెట్టమని సూచించారట. పాపం కదూ...వాళ్ళ చిన్నారి మనసులు ఎంత నలిగిపోకపోతే ఈ మాటంటారు! బడి,చదువు అంటేనే అగ్నిగుండం లో దూకుతున్నట్టు బాధపడుతున్నారు.

(పై ఫొటో వీవెన్ గారి సౌజన్యం)

చిన్నవయసునుండే పిల్లలు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారో, తల్లిదండ్రుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో, వారి మానసిక పరిస్థితి ఎలా తయారవుతున్నాదో ఈ పుస్తకంలో ఉదాహరణలతో వివరిస్తారు. అంతేకాక పాఠాలు చెప్పే పంతుళ్ళ రాక్షసత్వం, విద్యా బోధనలోని కర్కసత్వం కళ్లకు గట్టినట్టుగా చూపిస్తారు. ఇవన్నీ నామిని కల్పించిన కథలు కావు...చేదు నిజాలు, నిజంగా కళ్ళజూచిన చేదు అనుభవాలు. ఇది ఇప్పటి విద్యావిధానాల పై స్వీయ అనుభవాలను చేర్చి ఝళిపించిన కొరడా.

తన భార్యే తన కూతురితో చదువు విషయమై ఎలా మాట్లడుతుందో, ఎలా హింసిస్తుందో కళ్లకు కట్టినట్టుగా రాస్తారు. "14 ఏండ్ల నాకూతురి మీద, 30 కేజీల నా కూతురి మీద, 300 కిలోల బరువూ బాధ్యతా" అని వాపోతారు. పిల్లలని చావచితగ్గొట్టకుండా వారికి అర్థమయిన రీతిలో బుజ్జగిస్తూ, అరటిపండు తొక్క వలిచి చేతిలో పెట్టినట్టుగా ఎలా పాఠాలు చెప్పొచ్చో వివరిస్తారు. బిడ్దను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మజ్జిగన్నం తినిపించి మూతి తుడిచినంత ప్రేమతో లెక్కలు అవీ చెప్పాలి అంటారు, నిజమే కదూ!

కోళ్ళ ఫారం లా స్కూళ్ళు పెట్టి పిల్ల జీవితాలతో ఎలా ఆడుకుంతున్నారో స్వీయ అనుభవాలతో రాస్తారు. ఆయన స్వయంగా విన్న విషయం: "ఒక షెడ్డేసి రెండువేల పిల్లలతో బ్రాయ్లర్స్ పెట్టేసాను. మనకింకా అరవై అంకణాలుంది. దాంట్లో కూడా షెడ్డేసి స్కూలు పెట్టేసాను. ఏక్‌దమ్మున 200 మంది పిల్లలు చేరిపోయారు." కొత్తగా పెట్టిన స్కూలులో అంతమంది పిల్లలు ఎలా చేరిపోయారూ అని అడిగితే "బలే ఐడియా వేసానులెండి. LKG, UKG - ఫిఫ్టీ రుపీస్. 1st to 7th - 100 రుపీస్ ఫీజు. అంతే ముందు ఆట్లాగే పెట్టలి. షెడ్ బాగుంది. మద్రాసు దాకా పోయి 5 వేలు పెట్టి టాయ్స్ అవీకొనుక్కొచ్చాను. చేరి పోయారు" అని చెప్పాట్ట ఒక మహానుభావుడు.

"ఈ speed, acceleration మీ నెత్తినేసుకు రుద్దుకోండి, ఈ physics లేని లోకానికి వెళ్ళిపోతున్నాను" అని ఓ చిన్నారి ఉత్తరం రాసి పెట్టి, నిండు జీవితాన్ని బలి చేసుకున్న కథ వింటే మనసు కకావికలమవుతుంది. ఒక పాప స్కూలు డ్రెస్ మీద స్వెట్టర్ వేసుకుందిట. "ఏమ్మా ఉక్కబెడుతుంటే స్వెట్టర్ కూడా వేసుకున్నవ్" అని అడిగితే "టీచర్లు కొడతారు కదా సార్, ఈ స్వెట్టర్ వేసుకుంటే కాస్త మెత్తగా ఉండి నెప్పి తక్కువగా ఉంటుందని వేసుకున్నా సార్" అందిట. ఈ మాట విన్నాక నాకైతే ఇంకో ఉపయోగం కూడా కనిపించింది. ఆ పుస్తకాల సంచి మొయ్యడానికి కూడా, మెత్తగా ఉండి, పనికివస్తుంది అనిపించింది. చిన్న తరగతులనుండే బండెడు పుస్తకాలు మోయలేక వాళ్ళ మొహాలు ఎంత వడిలిపోతుంటాయో!


ఇంటర్ లో చదువుల గురించి రాస్తూ....కోడిని కొయ్యడానికి మెడ మీద కత్తిపెట్టాక దాని గుండెకాయలు ఎంత స్పీడుగా కొట్టుకుంటాయో అంత ఉద్విగ్నంగా ఉంటారుట పిల్లలు ఎంసెట్ ఫలితాల వెల్లడి అప్పుడు.

"చదువులో పసలేదుగానీ సోకులకేం కొదవలేదు. పుస్తకం ముందు నిముషం కూర్చోలేవు. అద్దం తీసుకుంటే మాత్రం ఒళ్లే తెలవదు. బిడ్డ చదివితే ముచ్చట. ఈ సోకులు చేసుకుంటే కాదు. ఆ సుజాతని చూడు. పుట్టుక అంటే అది! ఆ పిల్ల చదివే స్కూలే కదా నువ్వూ చదివేది, ఆ పిల్లకి చెప్పే టీచర్లే కదా నీకూ చెప్పేది. నీ తలకాయలో ఉండేది బంకమట్టి కదా" - ఒక తల్లి.

"కన్ననేరానికి టెన్త్ ఫెయిలవగానే దీనికి ఎవణ్ణో ఒక పంగమాలిన వెధవను చూసి తగిలించేస్తే పోతుంది" - ఒక తండ్రి.

"అమ్మా, తల్లి! నీ కథ నాకు తెలుసు. నువ్వు ఒక్క ఫార్ములా కూడా నేర్చుకోలేవు. నీకు పవన్ కల్యాణ మీద ఉండే శ్రద్ధ సబ్జెక్టు మీద లేదు" - ఒక టీచరు.

దీన్ని దెయ్యల భాష అంటారు నామిని. ఇది మనుషులు మాట్లాడవలసిన భాష కాదు, అందుకే ఈ పుస్తకం రాసానంటారు. మేజిక్ ఫిగర్ 500 కోసం మేథ్స్ టీచర్లు పిల్లలని ఎలా చావబాదుతున్నారో, క్లవర్లు, మొద్దులు అని పిల్లలని విడదీసి వాళ్ళ పసి మనసులని ఎంత నుసి చేస్తున్నారో అన్న విషయలు వింటుంటే మనకే గుండె తరుక్కుపోతుంది, ఇంక ఆ పిల్లల సంగతి ఏంగాను! తల్లిదండ్రులకి కూడా పిల్లల సమగ్రవికాసం అక్కర్లేదు. కావల్సినది ర్యాకులే. వారికి ఆటలు అక్కర్లేదు. లలితకళల ప్రాధాన్యత చెప్పక్కర్లేదు. మానసికోల్లాసం కలిగించక్కర్లేదు. చదివేసుకుని మార్కులు తెచ్చుకుంటే చాలు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు.

ఒకాయన వాళ్ళ పిల్లాడి రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పాడట....
1)మా హరీ ఉదయన్నే నాలుగ్గంటలకి నిద్ర లేవాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి అరగంట ధ్యానం.
2)తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, యూనిఫాం వేసుకుని రెడీ అయిపోతాడు. 5 గంటలకల్లా Maths, physics, chemistry చెప్పే ట్యూషన్ మాస్టారు వస్తాడు. 7 వరకూ ఆయన పాఠాలు చెబుతాడు. తర్వాత ఎనిమిదిన్నరకల్లా మరోసారి రివిజన్ చేసుకుని కప్పు నానబెట్టిన బఠానీలు, ఒక గ్లాసుడు పాలూ...స్కూలికెళ్ళిపోతాడు.
3) 12-45కి మధ్యాహ్నం భోజనం, డ్రైవర్ తీసుకెళ్తాడు, రోకటితో దంచిన దంపుడు బియ్యం భోజనం-అదీ 150 గ్రాములు. మరోవంద గ్రాముల దాకా పచ్చి కూరగాయలు. గుడ్డూగానీ మటన్ గానీ నహీ. పిల్లవాడు sharp గా ఉండడానికి ఉడకబెట్టిన వంటలేవీ లేవు - అంతా పచ్చికూరగాయలే!
4) సాయంకాలం నాలుగ్గంటలకల్లా స్కూలుకెళ్ళి వాణ్ణి pick up చేసుకుని 4.30 కి - నల్లకుంట రామయ్య కోచింగ్ సెంటర్ లో సీటు రావడానికి తీసుకునే కోచింగ్. 7.30 కి అక్కడ అయిపోతుంది.
5) రాత్రి ఎనిమిదికి ఇంటికి రాగానే మంచినీటి స్నానం. అర్థగంట ప్రశాంతత కోసం flute వాయించాలి. 8.30 కి పచ్చికూరలతో దంపుడు బియ్యం భోజనం.
6) రాత్రి పదకొండు దాకా మళ్ళీ subjects మీద పడడం.

ఇలాగే రోజూ జరుగుతుందిట. ఆదివారాలు ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లూ...బలే బిజీ. ఆ తండ్రికి ఇదొక యజ్ఞంట. ఇంతా చేస్తే ఆ కుర్రాడు చదువుతున్నది 8 వ తరగతి. ఈ మహా యజ్ఞం గురించి సదరు తండ్రే స్వయంగా నామిని కి చెప్పాడుట.

ఒక పిల్లడు తన నోట్స్ చివర టైమ్ టేబిల్ లో సోమ నుండీ శని వరకూ అన్ని పీరియడ్లలోనూ playing అని రాసుకుని చివరి పీరియడ్లో మాత్రం subject రాసుకున్నాడట. ఏంటమ్మా ఇలా టైమ్ టేబిల్ తయారుచేసుకున్నావ్ అని అడిగితే "ఇలా ఉంటే ఎంత బాగుంటుందా అని తమాషాగా రాసుకున్నా" అన్నాడుట. పాపం ఆ పిల్లవాడికి ఆడుకోవాలని ఎంత ఆశగా ఉండి ఉంటుందో కదా! ఇటువంటి దృష్టాంతాలెన్నో కళ్ళకుగట్టినట్టుగా రాసారు. ఆ పిల్లల బాధలు వింటూ ఉంటే మనసు చివుక్కుమంటుంది.

ఈ మధ్య నేను ఇంకో కొత్త విషయం చూసాను. ఒక కార్పరేటు స్కూల్లో మాకు తెలిసినవాళ్ళ పిల్లాడిని LKG లో పడేసారు. అక్కడ రూలు ఏమిటంటే పిల్లలు ఆ రోజు ఏమి తినాలో వాళ్ళు ముందే చార్ట్ ఇచ్చేస్తారుట. మొత్తం స్కూల్లు ఉన్న అన్నిరోజుల్లోను పిల్లలకి బాక్సుల్లో ఏమి పెట్టి పంపించాలో రాసి ఇచ్చేస్తారట. తల్లిదండ్రులు అవే చేసి పెట్టాలట. మారిస్తే ఒప్పుకోరుట, ఏదో ఫైన్ ఉంటుందిట. అయితే అందులో బలవర్థకమైన ఆహరమే ఉంది. కానీ ఇదేం దౌర్భాగ్యం, వాళ్ళు ఏమి తినాలో కూడా స్కూలు యాజమాన్యమే నిర్ణయిస్తుందా! ఒకవేళ ఆ తల్లిదండ్రులకి అలా చెయ్యడం కుదరకపోతే? ఒక తల్లిదండ్రుల ఆవేదన ఏమిటంటే - మంచి స్కూలని, ఎలాగొలా కష్టపడి స్కూలు ఫీజు కట్టి జాయిన్ చేసారు కానీ ఈ రూలు ప్రకారం ఆహారాన్ని అందించగలిగే స్థోమత లేదు...ఈ రూలు మా పిల్లకి పెట్టకండి అని ఎంతో ప్రాధేయపడినా యాజమాన్యం ఒప్పుకోలేదు. దాంతో ఇంక గతి లేక ఆ పిల్లని ఆ స్కూలునుండి విడిపించి వేరే స్కూలులో జాయిన్ చేసారు. ఇది నా కళ్ళముందే జరిగిన విషయం. ఆ తల్లిదండ్రులని చూస్తే నాకు బలే జాలేసింది. అయితే కొంతమంది తల్లిదండ్ర్లులు దీన్నో గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇలాగైనా పిల్లలకి తిండిలో క్రమశిక్షణ అలవడుతుందని, పోషకపదార్థాలు చేరుతాయని. అలా రూలు ఉండడమే మంచిదని కొందరి భావన.

కార్పరేటు స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉంటే గవర్నమెంటు స్కూళ్ళ పరిస్థితి మరో రకంగా ఉంది. నాకు తెలిసిన స్నేహితుడి అక్క, బావ ఇద్దరూ గవర్నమెంటు బడులలో టీచర్లు. అక్కడ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదుట. ఇన్స్పెక్షన్ కి వస్తే వీళ్ళే రిపోర్టులు రాసి ఇచ్చేస్తారుట. చదువు లేక, చెప్పేవారు లేక ఆ పసిమొగ్గలు బాధపడుతున్నాయి. అంతెందుకు మా విజయనగరంలో జరిగిన ఒక కథ: నాతోపాటూ BA చదివిన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను BA లో ఒకసారి ఫైల్ అయి రెండోసారి ఎలాగోలా పూర్తి చేసాడు. తరువాత ప్రైవేటుగా MA కట్టి మూడు సార్లు ఫెయిల్ అయి, నాలుగోసారి గట్టెక్కించాడు. అతనికి, మా విజయనగరంలో, ఓ 30 సంవత్సరాలపాటు మంచి బడిగా ప్రసిద్ధి చెందిన ఒక స్కూల్లో సైన్సు టీచరుగా ఉద్యోగం. పార్ట్ టైమే గానీ ఇతనే ఆ పిల్లలకి పాఠాలు చెప్పేది. మళ్ళి 10 వ తరగతి పిల్లలకి చెబుతున్నాడట. పాఠాలు పెద్దగా చెప్పక్కర్లేదుట. ఏదో నోట్స్ ఇస్తే చాలుట. పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా అనవసరం. మన జీతం మనకొస్తుంది అని అతను చెబుతుంటే నోరు వెళ్లబెట్టుకుని వినడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాను.

మొత్తనికి ఎక్కడైనా నలిగిపోయేది పసికందులే. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆశ ఉండొచ్చుగాని అది వారికి భారం కారాదు. "మనకి తలకాయలైతే ఉన్నాయిగదా ఆలోచిద్దాం" అంటారు నామిని. ఇదే విషయంపై నామిని పదే పదే రాస్తున్నాడు, ఇక ఆపితే బాగుందును అన్నది ఒక విమర్శ. కానీ పైన చెప్పిన లాంటి పరిస్థితులున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో రాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. "చదువులా చావులా" ప్రతీ ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. వెల 20 రూపాయిలు మాత్రమే. నేనైతే ఇది పదిమందికి పంచిపెట్టి, వీలైనంత మంది చేత చదివించాలని నిర్ణయించుకున్నాను. అంటే ఇది చదివేసి తల్లిదండ్రులూ,టీచర్లూ అందరూ మారిపోతారని కాదు, కనీసం ఆలోచిస్తారని. మరి మీరు కూడా చదువుతారు కదూ?


Monday, June 28, 2010

ము.వెం.ర-హాస్య గుళికలు

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.


"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"


రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!