StatCounter code

Wednesday, September 22, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-1

చెన్నై నుండి తిరుచిరాపల్లి (తిరిచ్చి) కి ఐదు గంటలు ప్రయాణం రైల్లో. రాత్రి 9.00 కి ఎక్కి, అర్థరాత్రి 2.00 కి తిరుచ్చి లో దిగి ఆటోవాళ్ల సహాయంతో హొటేలు చేరుకున్నాం. మర్నాడు ఉదయాన్నే ఉపాహారం సుబ్బరంగా లాగించి శ్రీరంగం ప్రయాణం కట్టాం. తిరుచ్చి నుండి శ్రీరంగానికి ఏడు కిలోమీటర్లు మాత్రమే, కారులో అరగంట ప్రయాణం. శ్రీరంగం అసలు పేరు "తిరువారంగం". ఇక్కడ విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు, రంగనాథుడి పేరుతో కొలవబడుతూ ఉంటాడు. అక్కడ తమిళ్ లో రాసిన కథని నేను అర్థం చేసుకున్న విధంబెట్టిదనిన......సముద్రమధ్యంలో ఉన్న విష్ణువుని బ్రహ్మ పూజిస్తూ ఉండేవాడట. ఆ విష్ణువుని, బ్రహ్మ కొందరు ఋషులకు (నాకు పేర్లు గుర్తు లేవు) ఇచ్చి నిత్య పూజలు జరుపమని చెప్పాడట. వారు ఇంకెవరికో ఇవ్వగా...అలా అలా తిరిగి తిరిగి ఇక్ష్వాకుల రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి యాగానికి వెళ్ళిన చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి "అరే ఇది మా దక్షిణ భారతంలో దొరికిన విగ్రహం, ఇది మాది, మాకు ఇప్పించండి" అని వేడుకున్నాడట. "బెంగపడకు రాజా, ఇది మీకు చేరుతుంది" అని ఇక్ష్వాక మహారాజు అభయమివ్వగా" ఆనందహృదయుడై చోళరాజు తన రాజ్యమునకు మరల ఏతెంచను. రాముడు తన పటాభిషేకానంతరం విభీషణునికి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వగా, సంతోషంతో అది తీసుకుని ఆయన శ్రీలంకకి పయనమయిరి. మార్గమధ్యంలో శ్రీరంగం లో విభీషణుడు, సూర్యుడుకి అర్ఘ్యం ఇద్దామని.......ఆ అదిగో మీ అందరికీ భూకైలాస్ సినిమా గుర్తొచ్చింది కదూ, అచ్చం అలానే ఆ విగ్రహం శ్రీరంగ పట్టణంలో భూమిలోకి దిగిపోయింది. బాధపడుతున్న విభీషణుడితో విష్ణువు అన్నాడట..."భయపడకు, బాధపడకు, నేనెప్పుడు నిన్ను కాచుకుంటూ ఉంటాను. నీ రాజ్యాన్ని ఓ కంట చూస్తూ ఉంటాను". అందుకే ఆ విగ్రహం చూపు శ్రీలంక వైపు ఉందిట. ఆ విగ్రహం కళ్ళు శ్రీలంకని చూస్తూ ఉంటాయట. ఈ గుడి ని 14-17 శతాబ్దాల మధ్యన కట్టారు. గోపురం ఎత్తు 236 అడుగులు. గుడి లోపల విగ్రహాం చాలా చాలా పెద్దది. నల్లగా, నిగనిగలాడుతూ కనులకు నిండుగా ఉంటుంది. ఏకశిలపై, ఆదిశేషువుపై పవళించే విష్ణుమూరిని చెక్కిన కళ చూసితీరవలసినదే. గుడి లోపల నేలపై తెలుగు లిపి కనిపించింది. చాలా చోట్ల తమిళంకన్నా ఎక్కువగా తెలుగు లిపి కనిపించింది. కాస్త అర్థమయీ అవనట్టు ఉన్నాది. అక్షరాలు చదవగలిగానేగానీ భావం బోధపడలేదు. చాలాచోట్ల గొలుసుకట్టు లో రాసి ఉంది. అక్షరాలు విడగొట్టడానికి కూడా కష్టపడవలసి వచ్చింది. ఇంకా గుడి లోపల శిల్పాలు కడు రమణీయంగా ఉన్నాయి. కంబర్ తను రాసిన రామాయణాన్ని (అదే కంబ రామాయణం) గానం చేసి, వినిపించే ప్రదేశం ఉంది. అది ఒక చిన్న మండపంలా ఉంది, అందులో నిలుచుని ఆయన గానం చేస్తూ ఉంటే చుట్టూ ప్రజలు కూర్చుని వినేవారట.

శ్రీరంగం గోపురం

ఈ గుడికి గల ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇది కావేరీ నది ఒడ్దున ఉంది. ఇక్కడ ఉన్న కావేరికి పేరు "కొల్లిడం" అంటే "చంపబడిన ప్రదేశం (కొల్=చంపడం, ఇడం=ప్రదేశం)" అని అర్థం. ఈ గుడి కట్టాక, ఆ కట్టిన వాళ్ళని కావేరి మధ్యలోకి తీసుకెళ్ళి చంపేసారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. వారిని ఈ క్రింది ద్వారం గుండానే తీసుకెళ్ళారట అందుకని ఈ ద్వారానికి "పరమపద వాసల్" అని పేరు. అంటే పరమపద గుమ్మం అని అర్థం. గూడార్థం ఏమిటంటే....వారి కళను అక్కడితో నిలిపివేయడానికి చంపారని, వారిని గుడి ముందర పవిత్ర కావేరీ మధ్యలో చంపేసారు కాబట్టి వారు పరమపదం చేరే ఉంటారని, అలా వారిని పరమపదం చేర్చిన కావేరీ నది కి మొక్కాలని. ఈ ద్వారాలు తెరిస్తే కావేరి కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం విన్న, చదివిన వెంటనే అంతవరకూ అక్కడి కళాకృతులు చూస్తూ ఆనందిస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లు మంది. భయం, బాధతో కంపించిపోయాను. చాలా ఘోరం, పాపం, అన్యాయం కదూ! ఆ గుమ్మానికి భక్తులు మొక్కుతూ, కావేరిలో భక్తితో మునుగుతూ ఉంటే నాకెందుకో ఏవగింపు కలిగింది. అలా మునిగితే వారూ చివరికాలంలో పరమపదం చేరుతారని వారి నమ్మకం.


పరమపద వాసల్


కొల్లిడం అనబడు కావేరీ నది

ఇక్కడ కనిపించిన ఇంకో విచిత్రం: కింది ఫొటోలో మూడు చిన్న గదులు కనిపిస్తున్నాయిగా అవి చిన్న చిన్న గుళ్ళు. అందులో కొలువుతీరిన మూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. ముగ్గురూ లింగాకారంలో ఉంటారు. చాలా ఆశ్చర్యమేసింది. బ్రహ్మ, విష్ణువులను లింగాకారంలో నేనెప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి.



అక్కడినుంచి తిరిగి తిరుచ్చి వచ్చి మలైకోట ఎక్కాము. ఇక్కడ వినాయకుడి గుడి ఉంది. ఇక్కడి నుండి ఏరియల్ వ్యూ బావుంటుంది. మలైకోట నుండి శ్రీరంగం గుడి గోపురం చూడడానికి బావుంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసినవి జలకంఠేశ్వరుని గుడి, ఇది పురాతనమైనది, కానీ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

మలైకోట నుండి శ్రీరంగ గుడి

అక్కడకి మధ్యాన్నం అయింది. భోజనం చేసి తంజావూరు పయనమయ్యాము. వెళ్ళడానికి గంటంపావో, గంటన్నరో పట్టింది, 54 కిలోమీటర్లు కదా మరి. ఉదయమునుండి తిరిగి తిరిగి ఉన్నామేమో కడుపులో బువ్వ పడగానే గొప్ప అలసట వచ్చేసింది. కారులో మాంచి కునుకు తీసాము. తంజావూరులో దిగి మొదట "సరస్వతీ మహల్" గ్రంధాలయానికి వెళ్ళాము. ఇది క్రీ.శ. 1500-1600 లలో తంజావూరుని పాలిస్తున్న నాయకర్ రాజుల ప్రైవేటు గ్రంధాలయంగా ఉండేది. 1675 లో తంజావూరుని మరాఠా రాజులు ఆక్రమించుకున్నాక ఈ గ్రంధాలయాన్ని చాల విస్తృతపరిచారు. సర్‌ఫోజీ అనే మరాఠీ రాజు పఠనాసక్తిగల గొప్ప రాజు. సర్‌ఫోజీ అనగానే త్యాగయ్య సినిమా గుర్తొస్తోందా? ఆ, అవును ఆ శరభోజి మహారాజే ఈ సర్‌ఫోజీ గారు. తంజావూరు అనగానే త్యాగయ్య గుర్తురాని తెలుగువారుండరేమో కదా! ఈ సర్‌ఫోజీ మహారాజుకి ఉన్న పఠనాశక్తి వలన ఎక్కడెక్కడి నుండో పుస్తకాలను సంపాదించి ఇక్కడ భద్రపరిచారు. ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఉన్న అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే అత్యంత పురాతనమైనవి, పొడవైనవి అయిన తాళపత్రగ్రంధాలు ఇక్కడ ఉన్నాయి. చిన చిన్న అక్షరాలతో, గొలుసుకట్టు రాతతో భలే ఉన్నాయి ఆ తాళపత్రాలు. మాములు కంటితో వాటిని చదవలేము అంత చిన్న అక్షరాలు. సందర్శకుల సౌలభ్యం కోసం అక్కడ ఒక భూతద్దం పెట్టారు. అసలు నాలుగు అంగుళాల వెడల్పు, ఒక అడుగు పొడవు ఉన్న తాళపత్రం పై ప్రింటింగ్ లో రెండు ఠావులలో పట్టేటంత విషయాన్ని ఎలా రాసారో ఏమిటో! నాకైతే ఆ రాతలు చూసి మతిపోయింది. ఆవగింజంత అక్షరాలు, అలా కలిపేసుకుంటూ రాసుకుంటూ పోయారు. మనకి ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెంది అక్షరాలని ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకుని చదువుకోవచ్చుగానీ, ఈ రోజుకీ అలాంటి తాళపత్రాలే చదువుకోవాల్సి వస్తేనా మనందరికీ ఖచ్చితంగా సోడాబుడ్డికళ్ళద్దాలు వచ్చేవి. ఇంకా అక్కడ అప్పటి భౌగోళిక నియమాలను సూచించే పత్రాలు, మేప్ లు ఉన్నాయి. అప్పటి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను సూచించే రకారకాల చిత్రపటాలు కూడా ఉన్నాయి.

అలా ఆ గ్రంధాలయం చూడడం పూర్తి అయ్యాక పక్కనే ఉన్న గంట ఆకారపు భవనం (bell shaped building) చేరుకున్నాం. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలీదు. కొంతమందేమో జైల్ అన్నారు. కొంతమందేమో ఊరికే కట్టారన్నారు.

గంట ఆకారపు కట్టడం

ఆ పక్కనే ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అక్కడ క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుండి దొరికిన దేవుని విగ్రహాలున్నాయి. కొన్ని విగ్రహాలు చెక్కిన తీరుని చూస్తే చెక్కిన ఆ చేతులకి జోహార్లు అర్పించక మానరు, ముఖ్యంగా ఏకశిలావిగ్రహాలు.


శివుడు - క్రీ.శ 9 వ శతాబ్దం


మహా విష్ణువు - క్రీ.శ 8-10 వ శతాబ్దాలు


నటరాజు - క్రీ.శ 11 వ శతాబ్దం

ఇవన్నీ చూసేసరికి సాయంత్రం 4.00 అయింది. చాలా అలసిపోయాము. పైన చెప్పినవాటిల్లో చాలామటుకు చెప్పులు లేకుండా అరికాళ్లతో తిరిగాము. ఆ దెబ్బకి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇంక నడవలేమేమో అనిపించింది. ఓపిక నశించిపోయింది. గొప్ప నీరసం ఆవరించింది...నాకయితే ఇంటికి పోయి కాళ్ళకి కాసింత నూనె రాసుకుని వేన్నీళ్ళ కాపడం పెట్టుకుంటేగానీ ఎక్కడికీ కదలలేను అనిపించింది.

కానీ కానీ............
ఏం చెప్పను, ఎలా చెప్పను ఈ కళ్ళతో చూసిన అద్భుతాన్ని మాటలలో వర్ణించగలనా, నా తరమౌనా!


(సశేషం)

Wednesday, August 11, 2010

పి.హెచ్.డి కష్టాలు (సరదాగా...)


PHD అంటేనే "Permanent Head Damage" అని అర్థం..మరి కష్టాలు కాక ఇంకేముంటాయి చెప్పండి.

నేను ఐదు సంవత్సరాలు చేసాను. ఆ ఐదేళ్ళు చాలా రకాల టెన్షన్లు, బాధలు, సరదాలు, సంతోషాలు, సాహసాలు ...ఓహ్ ఒకటా రెండా. ఒక్కోసారి కొన్ని సంఘటనలు తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ అవి జరిగినప్పుడు విపరీతమైన టెన్షన్ పడ్డాం, అలాంటివి కొన్ని...

ఒకరోజు నేను, మా ఫ్రెండు కోటీ వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం. బస్ మా కేంపస్ గేట్ దగ్గర ఆగింది. బస్ వెనక తలుపు దగ్గరనుండి మా ఫ్రెండు ముందు దిగాడు, తన వెనకే నేను దిగబోతున్నంతలో డ్రైవరు లాగించేసాడు....బొక్క బోర్లా పడ్డాను, మోకాలి చిప్ప పగిలిపోయింది. మా ఫ్రెండు చెయ్యి పట్టుకుని కుంటుకుంటూ హెల్త్ సెంటర్ కి వెళ్ళాను. ఎముకలు కాస్త అటుఇటు అయ్యాయి ఎక్స్-రే తీయించాలన్నారు. సైకిల్ తొక్కకూడదు, మెట్లెక్కకూడదు, ఎక్కువ నడవకూడదు, కూర్చోకూడదు, నిల్చోకూడదు అంటూ బోల్డు కండీషన్లు పెట్టారు. సరే, డాక్టరు చెప్పినవన్నీ చక్కా వినేసి, మందులు మాకులు పుచ్చేసుకుని రూముకి చేరాను. మర్నాడు నేను డిపార్ట్‌మెంటుకి వెళుతూ ఉంటే మా సీనియర్ ఎదురొచ్చి "సౌమ్య పడిపోయావంటగా, ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నారు?" అని అడిగాడు. ఎముకలు కాస్త డిస్‌లొకేటయ్యాయట, డాక్టర్ గారు జెరాక్స్ తీయించుకోమన్నారు అని చెప్పాను. "ఏంటి?" అని మళ్ళీ అడిగాడా అబ్బాయి, కాస్త ఆశ్చర్యపోతూ. "జెరాక్స్ తీయించుకోమన్నారు" అని మళ్ళీ చెప్పాను. ఆ పిల్లాడు నవ్వాపుకోలేక పడీ పడీ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వెర్రిమొహం వేసాను. ఆ అబ్బాయి ఈసారి ఇంకాస్త విపులంగా "ఏం తీయించుకోమన్నారు?" అని అడిగాడు. జెరాక్స్ అనబోతూ ఆగిపోయాను...అప్పుడర్థమయింది నాకు. మొదట ఉడుక్కున్నా తరువాత నవ్వేసాను:). కానీ ఆ అబ్బాయి ఊరుకుంటాడా! వెళ్ళి అందరికి టమకు వేసాడు. ఇహ చూసుకోండి....ప్రతీ ఒక్కరూ "సౌమ్యా, నీ కాలికి జెరాక్స్ తీయించుకున్నవటగా, బాగా వచ్చిందా? సైడులు కట్ అయిపోకుండా అన్ని సరిగ్గా వచ్చాయా" అని ఒకటే గోల. నేను ఎక్కువ నడవకూడదు, సైకిల్ తొక్క కూడదు కాబట్టి రోజూ ఎవరో ఒకరు నన్ను డిపార్ట్‌మెంటుకి, రూము కి సైకిలు మీద తిప్పుతూ ఉండేవారు. రెండు రోజులు పోయాక నేను మళ్ళీ హెల్త్ సెంటర్ కి వెళ్లవలసి వచ్చింది కాలు చూపించుకోవడానికి. నా ఫ్రెండు నన్ను దింపుతానన్నాడు. నేను సైకిల్ మీద ఎక్కి కూర్చోగానే తను "సౌమ్య ఎక్కడికి వెళ్ళమంటావు జెరాక్స్ సెంటర్ కా, హెల్త్ సెంటర్ కా?" అని అడిగాడు. నాకు మండింది చూడండి....ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక అని పాడుకుంటూ నేను తలకొట్టుకున్నాను. ఇలా నా కాలు నొప్పి తగ్గేవరకు జనాలు నన్ను వదలలేదు. అక్కడితో అయిపోయిందా అబ్బే...... ఎప్పుడైన్నా ఏదైన ఫొటో కాపీ తీయించుకోవాలంటే "సౌమ్యా ఎక్స్ రే తీయించమంటావా" అని ఓ వెకిలి నవ్వు నవ్వేవారు. ఈరోజుకి ఎవరూ ఆ విషయాన్ని మరచిపోలేదు నాతో సహా :D

ఇంతకీ విషయమేమిటంటే మేమేమి చదువుకోవాలన్నా లైబ్రరీకెళ్ళి కావలసినవి జెరాక్స్ తీసుకోవడమేగానీ పుస్తకాలు కొనుక్కుని చదివే అలవాటు లేదు. కొనుక్కోలేము కూడా. ఇక జర్నల్స్, పీరియాడికల్స్ అయితే కొనడమన్న మాటే లేదు. అలా జెరాక్సులు తీసి తీసి ఎక్స్-రే కి బదులు జెరాక్సు అని అన్నాననమాట.

ఇంకోసారేమయిందంటే....
మాకు పి.హెచ్.డి లో రెండేళ్ళ పూర్తి అయిన తరువాత నుండీ ప్రతీ ఆరునెలలకొకసారి ఒక సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థికి గైడ్ కాక ఇంకో ముగ్గురితో కూడిన డాక్టరల్ కమిటీ ఉంటుంది. వాళ్ళ ముందు అప్పటివరకు మేము చేసిన ఘనకార్యాలన్నీ అదేనండీ రిసెర్చి అంతా చెప్పి ఒప్పించాలన్నమాట. వాళ్ళేమో రకరకాల వంకలు పెడుతూ మమ్మల్ని చీల్చి చెండాడేస్తారు. ఈ సెమినార్ అయి, వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటే తప్ప స్కాలర్షిప్ వచ్చి చావదు. అందుకని ఈ డాక్టరల్ సెమినార్ అంటేనే ప్రతీ ఒక్కరికి దడ. నా స్నేహితురాలికి వాళ్ళ గైడ్ తో సబ్జెక్ట్ విషయంలో కాస్త సమస్య వచ్చి ఈ డాక్టరల్ కమిటీ సెమినార్ వచ్చేసరికి చాలా టెన్షన్ పడింది. తను అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో రిసెర్చి చేస్తోంది. ఈ పిల్లకి రెండు రోజులముందు నుండే విపరీతమైన టెన్షన్. ఆ సెమినార్ కి ముందురోజు నేను తను, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లంచ్ కి మెస్‌కెళుతూ ఉండగా మాలో ఒకర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. మేము గాబరాపడి ఆ అమ్మాయిని హెల్త్ సెంటర్ కి తీసుకెళ్ళాం. ఏ కళనున్నాడో ఆ డాక్టరు మహానుభావుడు చిటపటలాడుతూ కనిపించాడు. "ఈ అమ్మాయి బాగా నీరసంగా ఉంది, అందుకే కళ్ళు తిరిగాయి" అన్నాడు. అసలే సెమినార్ టెన్షన్ లో ఉన్న నా ఫ్రెండు డ్రిప్ ఇస్తారా అనబోయి "అయితే డ్రిప్ ఇరిగేషన్" ఇస్తారా అంది. దాంతో ఆ డాక్టరుకి పిచ్చ కోపం వచ్చింది, మండిపడిపోయాడు. కళ్ళతో నిప్పులు కురిపిస్తూ "యు ఆర్ ఇన్సల్టింగ్ మై ప్రొఫెషన్" అన్నాడు. డ్రిప్ ఇరిగేషన్ అంటావా అని అంత ఎత్తున ఎగిరాడు. నేను వెంటనే తేరుకుని "హయ్యో ఆ పిల్ల టెన్షన్లో అలా మాట్లాడిందండీ. మిమ్మల్ని కించపరచడం తన ఉద్దేశ్యం కాదు అని సర్ది చెప్పబోయాను. ఊహూ వింటేగా...అసలు ముందు నుండే ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు, హాట్ హూట్ అని ఎగిరాడు. పక్కనే నా స్నేహితురాలికి కళ్ళమ్మట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. ఒక్కసారిగా అతను అలా అరిచేసరికి తను నిశ్చేష్టురాలయిపోయింది. తేరుకుని సారీ చెప్పింది. మేము అతన్ని బతిమాలి, తప్పయిపోయింది పొరపాటున అలా అన్నాది అని సర్ది చెప్పేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. మరేమనుకున్నాడో ఏమో, ఇంకెప్పుడు అలా ఒళ్లు పై తెలియకుండా మాట్లాడకండి అని చెప్పి తనకి సెలైన్ ఎక్కించాడప్పుడు.

నా ఫ్రెండు అగ్రిగల్చర్ ఎకనామిక్స్ లో చేస్తోంది అని చెప్పాగా...తను ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఏదో చేస్తోంది. దాని పర్యవసానమే ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట :P.

మరోసారేమయిందంటే...
గోప్స్ (గోపాల్‌జీ షాపుకి షార్ట్ కట్ అన్న మాట) అని ఒక ప్రదేశముండేది. అక్కడ చిరుతిళ్లు, టీ, కాఫీలు దొరుకుతాయి. వీటి కోసం కాకపోయినా, పిచ్చపాటీ వేసుకోవడానికి సాయంత్రమయ్యేసరికి విద్యార్థులంతా అక్కడకి చేరుతారన్నమాట. ఒకరోజు మేమంతా గోప్స్ లో ఉన్నప్పుడు యధాతధంగా గైడ్స్-వాళ్ళతో మా కష్టాలు (సాధారణంగా రిసెర్చి చేసేవాళ్ళకి ఉండే కామన్ టాపిక్ "గైడ్") గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మా గుంపులో ఆర్థికశాస్త్రము, తెలుగు, పొలిటికల్ సైన్స్, హిందీ లలో పి.హెచ్.డీ చేస్తున్నవాళ్ళు ఉన్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. తెలుగులో రిసెర్చి చేస్తున్న అబ్బాయి " మా గైడ్ చాదస్తంతో చంపేస్తున్నాడురా బాబు, పదాలల చివర "ము" పెడితే "అం" పెట్టమంటాడు. "అం" పెడితే "ము" పెట్టమంటాడు. అంటే కలము అని రాస్తే కలం అని రాయమంటాడు, కలం అని రాస్తే కలము అని రాయమంటాడు. ఏదైనా రాసి ఇస్తే విషయం చూడకుండా విసర్గ ఏది అంటాడు, కామా లేదంటాడు, బుర్ర తినేస్తున్నాడు. ఏది రాసినా ఇంకా బాగా రాయలంటాడు. నీ ఆలోచనలు సరిగ్గా ఆవిష్కృతం కాలేదంటాడు. ఏమైనా తెలుగులో రిసెర్చి చెయ్యడం కష్టం రా బాబూ" అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అంతా విన్నక మరొక మితృడు "ఎళ్ళెళ్ళవోయ్, తెలుగులో రిసెర్చి ఏమి కష్టం?.... ఏదో ఒక కథో, కవితో తీసుకుని మరు చూపు, ముందు చూపు, తొలి చూపు అని దాన్నే మళ్ళీ తిరగరాస్తారు. లేదా కొత్త కోణం, దృక్కోణం, లంబకోణం అని వెనకనుండి ముందుకి రాస్తారు అంతే కదా" అన్నాడు. అది విని మేమంతా పగలబడి నవ్వాము. తను సరదాకే అన్నాడని మాకు తెలుసు. ఆ తెలుగు లో రిసెర్చి చేస్తున్న అబ్బాయి కూడా పడి పడి నవ్వుతూ ఎందుకో వెనక్కి తిరిగాడు.....వెనుక దృశ్యం చూసి హతాశుడైపోయాడు. ఏముంది సిగరెట్ కాల్చుకోవడానికి అక్కడికొచ్చిన వాళ్ళ గైడు ఉరిమి ఉరిమి చూస్తున్నారు. మాకు పై ప్రాణాలు పైనే పోయాయి, "విన్నాడా" అని సందేహమొచ్చింది. ఇహ చూసుకోండి ఆ గురుడు మొదలెట్టాడు.....మీకేం తెలుసు తెలుగు గురించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమైనా అంటే క్షమించవచ్చు. తెలుగు విద్యార్ధివైయుండి నువ్వు కూడా నవ్వుతావా అని మా స్నేహితుడిని చెడామడా తిట్టి, నా ఆఫీసుకి రా నీ పని చెప్తాను అన్నట్టు చూసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఇక మా ఫ్రెండుకి ఒకటే భయం, గుండెదడ, వణికిపోయాడు. మేము అక్కడ జేవురించిన మొహాలతో బిక్కచచ్చిపోయాము. కాళ్ళు చేతులు ఆడలేదు ఎవ్వరికీ. ఆ అబ్బాయి సంగతేమవుతుందో అని మా అందరికీ బెంగే. మర్నాడు భయపడుతూ భయపడుతూ వాళ్ళ గైడ్ ఆఫీసుకి వెళ్ళాడు. బెరుకు బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు. వాళ్ళ గైడేమో "రావోయ్, ఏదీ నేనిచ్చిన కరక్షన్స్ చేసావా, చూపించు" అంటూ నవ్వుతూ మాట్లాడాడట. ఇదేమిటి ఇలా మామూలుగా మాట్లాడేస్తున్నారు అని తను ఆశ్చర్యపోయి తను చేసిన వర్క్ చూపించాడట. ఆ గైడేమో అసలు నిన్నటి విషయమేమీ జరగనట్టు చాలాసేపు నా స్నేహితుడితో మాట్లాడి చివర్లో "నిన్న ఎందుకో మీ స్నేహితుల మాటలు వినగానే గొప్ప కోపం వచ్చేసిందోయ్, కాని తరువాత తలుచుకుంటే నవ్వొచ్చింది, ఆ అబ్బాయి సరదాకే అన్నా తను చెప్పిన దాన్లోనూ నిజం లేకపోలేదనిపించింది. నిన్న అనవసరంగా మీ అందరినీ తిట్టేసాను, సారీ అని మీ మితృలందరి చెప్పు" అన్నారట. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మా స్నేహితుడు పరిగెత్తుకుంటూ మా వద్దకొచ్చి విషయం చెప్పాడు. విన్నాక మేమంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నాం :).

ఇలాంటివి ఇంకా బోలేడు. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నవ్వొస్తున్నాది, కానీ ఆ రోజు వచ్చిన దడ, టెన్షన్ చెప్పనలవి కాదు. వీటితో పాటు గైడ్స్ సరిగ్గా సహకరించక కొన్ని పాట్లు, సహకరించినా అనుకున్న రిజల్ట్స్ రాక మరికొన్ని బాధలు. అన్నీ సరిగ్గా అమరినా సెమినార్స్‌లో అందరినీ ఒప్పించడానికి పడే కష్టాలు...ఇంకో వైపు ఇంకా అవ్వలేదా, ఎన్నేళ్ళు చేస్తావు అంటూ బంధువుల సొడ్డు మాటలు. ఇవన్నీ చూస్తూ అమ్మనాన్నాల విచారం. ఇన్ని పాములూ దాటుకుని నిచ్చెన ఎక్కేసరికి తల ప్రాణం తోకకి వస్తుంది. అందుకే అన్నాను "Permanent Head Damage" అని. అది పూర్తి చెయ్యడమంటే వైకుంఠపాళీ యే.



ఏది ఏమైనా పి.హెచ్.డీ పూర్తి చేసాక వచ్చే విజయ గర్వం,ఆనందాలతో సరిసమానమయినది ఏదీ లేదు. అది అది అనుభవైకవేద్యమే తప్ప చెప్పనలవి కాదు.

Wednesday, July 7, 2010

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి ముచ్చట్లు

నిన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినమట, నాకు ఈరోజు తెలిసింది. ఆలశ్యమైనా కూడా ఆయనకు నా బ్లాగు ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

ఆయన గురించి కొన్ని విశేషాలు:

బాలమురళీకృష్ణగారు మా యూనివర్సిటీకి వచ్చారు ఓ 4-5 యేళ్ళ క్రితం. అదెలా అంటే మా యూనివర్సిటీలో తెలుగు విభాగానికి హెడ్ బేతవోలు రామబ్రహ్మంగారు. ఆయన, బాలమురళీకృష్ణ (MBK) గారు మంచి దోస్తులు. బేతవోలుగారి విన్నపం మీద MBK మా కేంపస్ లో ఓ వారం రోజులు గడిపారు. MBK ముఖతా ఒక సంగీత విభాగాన్ని కూడా మొదలెట్టాలనే ఆలోచన ఉండేది అప్పట్లో. వచ్చిన మొదటిరోజు మా విద్యార్ధులందరికి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో కొన్ని విషయాలు నన్ను అబ్బుర పరిచాయి, ఆహా అనుకున్నాను. మరికొన్ని విస్మయపరిచాయి, అదేమిటి ఇలా? అనుకున్నాను.

MBK సంగీత కచేరిలలో కొన్ని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారట. అవి నాకు బాగా నచ్చాయి. కచేరి మధ్యలో మృదంగం టర్న్ వస్తుంది. గాత్రం లో స్వరం అయ్యాక మృదంగం, వయొలిన్ టర్నులొస్తాయి. అప్పుడు చాలామంది కచేరీ నుండి లేచివెళ్ళిపోయి బయట కాసేపు విశ్రాంతి తీసుకునొస్తారు. నేను కూడా ఇది చాలాసార్లు గమనించాను కచేరీల్లో. ఒకసారి ముంబాయిలో MBK కచేరీ జరుగుతుండగా, మృదంగం టర్న్ వచ్చినప్పుడు ఆయన మైమరచి కళ్ళు మూసుకుని వింటున్నారట. అంత బాగా వాయిస్తున్నారట ఆ మృదంగ విద్వాంసులు. కాసేపయ్యాక కళ్ళు తెరిచి చూస్తే హాల్ లో ఓ పది మంది మాత్రమే ఉన్నారట. మిగతావారంతా హాల్ బయట పిచ్చాపాటీ వేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇది గమనించిన వెంటనే ఆయన కచేరీ నిలిపివేసారట. మృదంగం ఆయన ఇంత అద్భుతంగా వాయిస్తుంటే ఎవరూ వినట్లేదేమిటి అని ఆలోచించారట. అప్పుడు ఆయనకి తట్టిన విషయం కచేరీలో "బ్రేక్" ఇవ్వడం. సినిమా చూస్తే భ్రేక్ ఇస్తారు. టీవీలలో బ్రేకులుంటాయి. క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు కూడా బ్రేక్ తీసుకుంటారు. మరి కచేరీకి ఎందుకు బ్రేక్ ఇవ్వకూడదు, తప్పేమిటి? వింటున్న జనాలకి మధ్యలో విశ్రాంతి లేక ఇలా మృదంగం టర్నో, వయలిన్ టర్నో వచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ పక్కవాయిద్యాల విద్వత్తును గుర్తించలేకపోతున్నారు అని అనుకున్నవారై అప్పటినుండి తన ప్రతీ కచేరీకి మృదంగం టర్న్ ముందు బ్రేక్ ఇవ్వడం మొదలెట్టారట. అలా అయినా జనాలు పక్కవాయిద్యాలను పక్కనబెట్టకుండా విని ఆస్వాదిస్తారని.

నాకు కూడా చాలాసార్లు కచేరీలో బ్రేక్ తీసుకోవాలనిపించేది. నేనూ ఎన్నోసార్లు మృదంగం టర్న్ లో బ్రేక్ తీసుకున్నాను. వయొలిన్ నేను నేర్చుకున్నాను కాబట్టి, అదంటే నాకిష్టం కాబట్టి వయలిన్ టర్న్ వస్తే తాళం వేస్తూ శ్రద్ధగా వినేదాన్ని. మృదంగం టర్న్ కి మాత్రం బయటికెళ్ళిపోయేదాన్ని కాసేపు. నేనే కాదు చాలామంది అలా వెళ్లిపోయేవారు. ఆరోజు ఉపన్యాసంలో MBK ఈ విషయం చెప్పగానే ఉలిక్కిపడ్డాను నేను. నాకు కూడా ఈ బ్రేక్ కాన్సెప్టు చాలా నచ్చింది. కచేరీ చేసేవాళ్లందరూ దీన్ని పాటిస్తే బాగుందును అనుకున్నాను.

మరో నిఖార్సైన విషయం.....ఆరోజుల్లో కచేరీలు ఆడవాళ్ళకి నిషిద్దం. వాళ్ళు స్టేజీ ఎక్కకూడదు. ఇంట్లో కూర్చుని జోలపాటలు మాత్రమే పాడుకుంటూ గడపొచ్చు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళు ధైర్యం చేసి కచేరీ చేసినా వాటిని సంగీతంలో పెద్దలందరూ బేన్ చేసేవారట. ఆ కచేరీకి ఎవరినీ వెళ్ళనిచ్చేవారు కాదట. అటువంటి సమయంలో MBK కచేరికి తంబురా వెయ్యడానికి ఒక ఆవిడని కూర్చోమన్నారట. అదేదో చాలా పెద్ద కచేరీట, ప్రముఖులు, విద్వాంసులు అందరూ వచ్చారట. హాల్ అంతా జనంతో కిటకిటలాడిపోతున్నాదిట. ఆ కచేరీలో ఈవిడ తంబురా పట్టుకుని కూర్చోగానే అందరూ వ్యతిరేకించారట. MBK మాత్రం ఆవిడ తంబురా వేస్తేనే పాడతానన్నారట. పెద్దలందరూ సభ విడిచి బయటికెళ్ళిపోయారట. ఆడవాళ్ల పట్ల ఇటువంటి దృక్పధం మంచిది కాదు. వాళ్ళూ మగవాళ్లతో పాటు సమానంగా సంగీతం నేర్చుకోగల, పాడగల సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి, ప్రోత్సహించాలి అని చెప్పి,ఎవరు విన్నా, లేకున్నా నేను కచేరీ చేస్తాను, ఆవిడే తంబురా వేస్తారు. ఇష్టం వచ్చినవాళ్ళు ఉండండి, లేకపోతే దయచేయండి అని చెప్పేసారట. ఈయన మాటని కొట్టేసి చాలామంది వెళ్ళిపోగా మిగిలిన 20-25 మందిని పెట్టుకుని కచేరీ చేసారట. ఇది ఒక పెద్ద issue అయి ఒక విప్లవంలా మొదలయ్యిందిట ఆ రోజుల్లో.

ఇలాంటి మంచి విషయాలు ఇంకా బోల్డు చెప్పారు ఆ ఉపన్యాసంలో.

మరి కొన్ని సరదా విషయాలు కూడా చెప్పారు. ఆయన నారదుడుగా వేసిన భక్తప్రహ్లాద సినిమా గుర్తందిగా అందరికీ. ఆ సినిమా సూపరు డూపరు హిట్టు అయ్యాక ఆయనకి 12 సినిమాలలో నారదుడి వేషం వేసే అవకాశం వచ్చిందిట. బాబోయ్ ఇలా అయితే నేను సినిమాల్లో పెర్మనంటు నారదుణ్ణుయిపోతాను ఎందుకొచ్చిన గొడవ అని అన్ని అవకాశాలను తోసిపుచ్చారట. ఆయనకి సినిమాలలో నటించాలని చాలా సరదాట. హీరోగా వెయ్యాలని ఉండేదిట. అవకాశమొస్తే చెయ్యడానికి రెడీగా ఉన్నారట. కానీ పాపం అన్ని నారదుడి వేషాలొచ్చాయి :). నాకయితే ఈ మాట విని ఎంత నవ్వొచ్చిందో చెప్పలేను......భక్త ప్రహ్లాదలో ఆయన పర్సనాలిటీ ఏమిటి, ఆయన ఎత్తెంత, మనిషి బక్కపలచగా, పొట్టిగా ఊదితే గాల్లో ఎగిరిపోయేలా ఉండేవారు...ఈయనకి హీరో వేషమెవడిస్తాడని ఎదురుచూసారో అని తెగ నవ్వుకున్నాను. భక్తప్రహ్లాదలో జోలపాట గుర్తుందా? గుర్తులేనివాళ్ళకి ఇదిగో లింకు.
నాకయితే ఈ రోజుకీ జోలపాటల్లో "సిరిసిరి లాలి, చిన్నారి లాలి" ప్రధమ స్థానంలోనే ఉంటుంది.

ఈయనకి సినిమాలలో డిష్యుం డిష్యుం ఫైటింగులు చాలా ఇష్టమట. కారణం అవి ఆయన చెయ్యలేరు గనక...ఏమిటో భలే విచిత్రంగా ఉంది కదా! ఈయనేమిటి ఫైటింగులిష్టముండడమేమిటి....ఎక్కడో ఏదో అసమతౌల్యంగా ఉన్నట్టనిపించింది. సంగీతం ముఖ్యంగా కర్నాటక సంగీతం నేర్చుకున్నవాళ్ళు ప్రధానంగా భక్తి, శాంతి లో కూరుకుపోయి ఉంటారు. మరి ఈయనకి ఈ హింసా పద్ధతులు నచ్చడమేమిటో నాకర్థం కాలేదు.

MBK 72 మేళ కర్తలలో కృతులు రచించారన్న విషయం లోకవిదితమే కదా. ఆయనొక సంగీత శిఖరాగ్రం, అంతే ఇంకా వేరే మాట లేదు. సంగీతంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసారు. ఆయన "హనుమా, వినుమా"...అని ఒక కీర్తన రాసారట. ఇందులో గమ్మత్తేమిటంటే స్వరంలో మధ్యమం వచ్చినచోటల్లా సాహిత్యంలో "మ" అనే అక్షరం వచ్చేట్టు రాసారట. ఇప్పుడు "హనుమ" లో "మ" వచ్చినదగ్గర మధ్యమం వస్తుంది.....అలాగే మొత్తం కీర్తనంతా ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పారు. చాలా కీర్తనలు పాడి వింపించారు. పెద్దవారవడం మూలానగాబోలు చాలా వాటికి సాహిత్యం, కొన్ని సార్లు స్వరం కూడా మరచిపోయేవారు. ఆయన శిష్యుడు మోహనకృష్ణ గారు అందిచేవారు మరచిపోయినప్పుడల్లా. ఇంకొక సరదా కలిగించిన విషయమేమిటంటే MBK కి తెలుగు నోటి ముందు ఉంటుంది. ఆయన చక్కగా తెలుగులోనే మాట్లాడతారు. కానీ ఉపన్యాసం ఇంగ్లీషులో ఇచ్చారనుకోండి తెలుగురాని వాళ్ళు కూడా ఉంటారని. కాకపోతే అవకాశం చిక్కినప్పుడల్లా సుబ్బరంగా తెలుగులోనే మాట్లాడేస్తారు. ఈ ఇంగ్లీషు ఉపన్యాసంలో కూడా అప్పుడప్పుడు తెలుగు వచ్చేస్తూనే ఉంది...భలే ముచ్చటేసింది విన్నంతసేపూ :D.


ఆ ఉపన్యాసం మొత్తం విన్నక నాకు చాలా సరదాగా, హాయిగా, గర్వంగా అనిపించింది. గర్వం ఎందుకనుకుంటున్నారా ఆయన ఉపన్యాసం డైరెక్టుగా వినే అవకాశం వచ్చింది కదా అందుకని :).

సరే ఆ రోజు ఆయన చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, ఆస్వాదిస్తూ, నవ్వుకుంటూ గడిపేసాను. మర్నాడు తెలిసిన విషయమేమిటంటే MBK తెలుగు డిపార్టుమెంటులో ఒక క్లాసురూములో మూడురోజులపాటు సంగీత పాఠాలు చెప్తారు, ఔత్సాహికులు వెళ్ళి నేర్చుకోవచ్చు అని. మరోమాట వినకుండా, పుస్తకం పెన్ను చేతబట్టి, పరిగేట్టుకొని వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. కానీ ఆ పాఠం విన్నాక నాకు చెప్పలేనంత చిరాకు వేసింది. స్వరం చెప్పకుండా సాహిత్యం మాత్రమే చెబుతున్నారు. విసుగొచ్చింది. ఇంత పెద్దయన ఇలా పాఠం చెప్తున్నారేమిటి అనిపిచింది. ఓ పేద్ద పుస్తకం ఆయన దస్తూరీతో ఉన్నది పట్టుకొచ్చి అందులో చూస్తూ కీర్తన చెబుతున్నారు. ఆయన అంటూంటే వెనక మేము అనడం...అలా ఒక్కో కీర్తన మూడు సార్లు పాడించారు. మధ్యలో ఒక స్వరజతికి మాత్రం స్వరం చెప్పారు. కొంతమంది వర్ణాలు చెప్పమనడిగితే మధ్యలో కాస్త స్వరం చెప్పారు, అంతే. నాకయితే అస్సలు నేర్చుకోబుద్ధెయ్యలేదు. సరే ఇవాళ ఇలా చెప్పేరు కాబోలు రేపు చూద్దామని మర్నాడు వెళితే మళ్ళీ అదే తంతు. స్వరం లేకుండా సాహిత్యం చెబుతూ పాడించేస్తున్నారు. అక్కడ ఓ పాతికమంది విద్యార్ధులు చేరారు. నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్ళు కొందరయితే, రాగాలు, తాళాలు తెలిసినవారు ఇంకొందరు. మిస్సమ్మలో నాగేస్రావులా సపసలు తీసేసి పాట చెప్పండి అనేవాళ్ళు మరికొందరు. కానీ స్వరం చెప్పకుండా కీర్తన ఎలా నేర్చుకోవడం, నాకేమీ అర్థం కాలేదు. సాహిత్యం చెబితే స్వరం అల్లుకునేటంత సంగీత ఙ్ఞానమే ఏడిస్తే నేనెందుకు economics లో PhD చేస్తాను, చోద్యం కాకపోతే! నాకు తెలిసి నాలాగ మిడిమిడి ఙ్ఞానం ఉన్నవాళ్లే తప్ప అలా స్వరఙ్ఞానమున్నవాళ్ళు ఆ గుంపులో ఎవరూ లేరు. అవేవో ఊరికే పాటలు పాడుకున్నట్టు అందరూ పుస్తకాలలో సాహిత్యం రాసేసుకున్నారు, ఆయన వెనకే పాడుతున్నరు. అపశ్రుతులు చెవులకి కన్నం పెట్టేస్తున్నాయి. తాళాలు తప్పుతుంటే నా చెయ్యి బాధగా మూలిగింది. అలా ఒక వారం రోజులు చెప్పినా ఎవరికీ ఆ కీర్తనలు వచ్చే అవకాశమే లేదు. మరి అంత సమయం వెచ్చించి చేస్తున్న పని బూడిదలో పోసిన పన్నీరే కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారీయన అని అనిపించింది నాకు. లేచి అడుగుదామనుకున్నాను. కానీ తిరిగి ఆయన నీకేంతెలుసు అని ఓ రెండు ప్రశ్నలేసారనుకోండి, నేను అచేతనురాలినయిపోతా, ఎందుకొచ్చిన గొడవలే అని కిం అనకుండా కూర్చున్నాను. ఇంక మూడవరోజు వెళ్లనేలేదు.

ఎలాగైనా MBK గారితో ముఖాముఖి మాట్లాడాలనిపించింది. బేతవోలుగారు మా చెల్లికి గైడు. అది అప్పుడు ఆయన దగ్గర Mphil చేస్తున్నాది. నేను దాన్ని గోకి, అది ఆయన్ని గోకితే మర్నాడు ఉదయం 10.00 గంటలకి నాకు అరగంట టైం దక్కింది MBK తో మాట్లాడడానికి. గబగబా రూముకొచ్చేసి ఆయనని అడగవలసిన ప్రశ్నలన్నీ రాసేసుని మళ్ళీ మళ్ళీ మననం చేసేసుకున్నాను. ఒకవేళ నేను ఏ ప్రశ్న అడిగితే ఆయన తిరిగి ఏ ప్రశ్నలేస్తారో ఊహించేసుకుని, వాటికి జవాబులు కూడా తయారు చేసేసుకుని రెడీగా కూర్చున్నాను. రాత్రి మళ్ళీ అన్ని చూసుకుని పడుకున్నాను.....చెప్పొద్దూ రాత్రంతా బాలమురళిగారే కలల్లో. రోజూ 9.00 అయినా పొద్దు మొహమెరగని నేను ఆరోజు ఆరింటికే లేచి, ఫలహారం కానిచ్చి, చక్కగా ముస్తాబయిపోయి ఎనిమిదింటికల్లా సైకిలు పట్టుకుని రెడీ అయిపోయాను. మరీ ఇంత తొందరగా వెళ్తే బావుండదులే అని చెప్పి, 9.00 వరకు అటూఇటూ కాలక్షేపం చేసేసి అప్పుడు వెళ్ళిపోయా తెలుగు డిపార్టుమెంటుకి. ఒక రకమైన ఉత్సాహం, ఒకరకమైన భయం, ఇంకో రకమైన బిడియం, మరో రకమైన ఆసక్తి మొత్తం కలగలిసి నాలుగు వర్ణాల ఇంధ్రధనస్సూలా మెరిసింది నా ముఖం (బాచెప్పానా? ;)). అక్కడే ఇంకో అబ్బాయి నాలాగే నాలుగు వర్ణాలతో మెరిసిపోతూ కనిపించాడు. విషయమేమిటని ఆరాతీస్తే అతనికీ 10.00 గంటలకే టైం ఇచ్చారట. ఇద్దరం కలిసి ఎనిమిది వర్ణాలయిపోయి ఏమైనా కామన్ ప్రశ్నలున్నయేమొ చూసుకుని ఉన్నవి కొట్టేసి, లేనివి మళ్ళీ మళ్ళీ బట్టీ పట్టేసి, వాచీ చూసుకుంటూ కూర్చున్నాం. ఇంతలో ఒక దుర్వార్త మాకు చేరింది. మా V.C కి అర్జంటుగా అప్పుడే టైం కుదిరిందిట. MBK ని అప్పుడే కలవాలని ముహూర్తం పెట్టేసారట. కాబట్టి ఆయన డిపార్టుమెంటుకి రావట్లేదు, ఆయన ఇచ్చిన టైములన్నీ కేన్సిల్ చేసేసుకున్నారు అని దుర్వార్త వచ్చింది. మా మొహాలు వివర్ణమయిపోయాయి. విభ్రాంతితో కూడిన బాధ వల్ల వచ్చిన ఏడుపుని దిగమింగుకుని రూముముఖం పట్టాము ఇద్దరమూ :(. ఇక ఆ ఆవేదనలోంచి తేరుకోవడం నా వల్ల కాలేదు. అందుకే నా రిసెర్చిని వారం రోజులకి వాయిదా వేసాను. చాలారోజులుగా బాగా పడుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఈ బాధవల్ల ఆ టైం వచ్చిందని చెప్పి హాయిగా ముసుగుదీసాను. you see నేనెప్పుడూ ఇంతే, positive thinking ఎక్కువ. ఎలాంటి పరిస్థితినైనా సద్వినియోగం చేసేసుకుంటాను :P. అలా బాలమురళిగారిని కలిసే అవకాశం చేతిదాకా వచ్చి బాగా వెలిగిన తోలుగొట్టం విసిరేయకముందే అరచేతిలో చీదేసినట్టు చీదేసింది. దాంతో మనసు కాలగా వచ్చిన పొగ మెదడుని కమ్మేసి నన్ను నిద్రలో ముంచేసింది :).

ఇప్పుడు ఇంకో మంచి విషయానికొద్దాం. బాలమురళీకృష్ణ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు కలిసి ఎంకిపాటలు పాడారన్న విషయం మీకు తెలుసా? అవును పాడారు, మామూలుగా కాదు అద్భుతంగా పాడారు. మచ్చుకి మీకు కొన్ని వినిపిస్తాను, వినండి.



అవండీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి ముచ్చట్లు.

Monday, June 28, 2010

ము.వెం.ర-హాస్య గుళికలు

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.


"1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"


రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!







Wednesday, June 23, 2010

"అ" చిన్నదయిపోయింది

ఓలమ్మీ అల్లుడుగోరొచ్చేసినారు కుర్సీ యెయ్యవే.

అత్తా బోగుండావా? మామేడకెల్లినాడు?

బోగున్నానబ్బీ, మీ మామ పట్నమెల్లినాడురా, బళ్ళోకి అయేటో సరుకులు కావలని...సాయంత్రానికొచ్చేస్తాడు.

ఒలేయ్ రావేటే, అల్లుడు నిలబడిపోనాడు బేగి రా.

ఏండీ ఎప్పుడొచ్చారు, కూకోండి. ఊల్లో అత్తా మామా అంతా బోగున్నారా?

బోగున్నారు మల్లీ, నీ ఆరోగ్యం ఎట్టా ఉన్నాదే?

మీరిద్దరు కూకోండి నాయనా, పొయ్యిమీద ఇగురెట్టినాను, సూసొత్తాను.

అలాగే అత్తమ్మా, ఏటొండుతున్నావేటి?

నీకిత్తమని నెత్తల్లు తీసుకొచ్చినానయ్యా :)

...................................................................

అత్తమ్మా కూర బలే సేసినావే....తిన్నాకా ఆయాసమొత్తన్నాది.......మల్లీ నీకు వేవిల్లు తగ్గినాయంటనే?

టిక్ టిక్ టిక్......ఎవరండీ లోపల, మీకు ఉత్తరం వచ్చింది.

సూడల్లుడూ అదేదో వచ్చినాదంట.

నాను సూత్తానత్తమ్మా, నువ్వు తొంగో.

ఏటల్లుడూ ఏటిరాసుంది అందులో, మొగమేటి అలాగయిపోతన్నాది?

అత్తమ్మ, అ అ అ అ ....అ అ అ

ఏటల్లుడూ అట్టా గాబరాపడిపోతన్నావు, ఏటయినాదో సెప్పు.

అ అ అ అ....అ అ అ

ఓలమ్మో ఒరినాయనో ఏటయిపోనాది, నాకు కాల్లు సేతులు ఆట్టంలేదు బగమంతుడో.

అది అ అ అ...

ఏటండీ ఏటిరాసుందందులో, సెప్పండి.

అ అ అ అ....

అ అ అంటున్నారు, మీ అమ్మకేటయిందండీ, ఓలమ్మో అత్తమ్మకేటయిపోనాది? మొన్న సూసినప్పుడు దిమ్మిసెక్కలా బాగానే ఉంది, ఉప్పుడేటయిపోనాది.

ఓలమ్మో ఇయ్యపురాలికేటయిపోనాది...మాయరోగమేటొచ్చినాదో...నానేటి సేసేదిరా దేవుడో.....ఆ రోగమేదో నాకొచ్చినా బాగున్ను, దాని జిమ్మడిపోనూ...సిన్న వయసులో బొట్టికెంతకట్టమొచ్చినాదిరో :(

ఓరల్లుడో అందులో ఏటి రాసున్నాదో సెప్పిసావరా...నాకు రగతం చల్లబడిపోనాది. ఓరేయ్ రాములూ...లగెత్తుకు రారా, ఓ రిక్సా తీసుకురా, బస్సుకెల్లాలి. బేగి రా రా...

అదికాదత్తమ్మా అదీ అదీ అత్తమ్మా అ అ అ అ......

ఓరి గుంటడో సరిగా సెప్పిసావరా...

ఏండీ, మావ ఏడున్నాడు? అత్తమ్మ కి కాల్లుసేతులడిపోనాయా, దేవుడిదగ్గరకెల్లిపోయినాదా...ఏటయినాదండీ, సెప్పండీ?
.....................................................................

ఏవయిందర్రా, ఎందుకలా ఏడుస్తున్నారు అందరూ. ఎప్పుడొచ్చావల్లుడూ, ఏమయింది? ఆ కాగితం ఏమిటి చేతిలో...ఏదీ ఇలా చూడనీ.

ఆపండి ఏడుపులు, ఉత్తరం చదువుతున్నాగా....చూసి చెప్తా.

గౌరవనీయులైన నాయుడుగారికి
అందరూ కుశలమే కదా. నేను వచ్చే వారం మీ ఊరొస్తున్నాను. మిమ్మల్ని కలుస్తాను.
ఇట్లు
గోపాలం

ఇందులో ఏడవడానికేముంది? ఎందుకు అల్లుడూ అలా కంగారు పడ్డావు?

ఏటల్లుడూ ఎందుకంత గాబరా ఎట్టేసినావూ....ఏటయిపోనాది?

అదీ అదీ "అ" చిన్నదయిపోయింది.

అ చిన్నదయిపోవడమేమిటి అల్లుడూ?

అదికాదు మావా, సిన్నప్పుడు సదుకునేటప్పుడు "అ" తాటికాయంత పెద్దగా ఉండేదికదా పలకమీద, ఉప్పుడేమో ఉసిరికాయంత సిన్నదయిపోయింది ఈ కాగితం మీద. అది సూస్తే ఏడుపొచ్చేసినాది.

ఓరి నీతెలివిసంతకెల్ల, "అ" చిన్నదయిపోవడమంటే అదా. చిన్నప్పుడు బాగా రావాలని పెద పెద్ద అక్షరాలు రాసి దిద్దిస్తారు. పెద్దయ్యాక చిన్న అక్షరాలు రాయక తాటికాయంత అక్షరాలు రాస్తారేమిటిరా, నీ తెలివిపాడుగాను. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోరా అని ఎన్నిసార్లు చెప్పిన బడి ఎగ్గొట్టి ఇప్పుడు ఇలా అఘోరించావు. చెల్లెలి కొడుకువి కదా అని పిల్లనిస్తే ఇంట్లో వాళ్ళందరిని ఇలా కంగారుపెడతావా, ఏడ్చినట్టే ఉంది.

నీ జిమ్మడిపోనూ ఏటల్లుడూ ఇది, బాగానే ఉంది సంబడం...ఇదేనా నువ్వు సదిగిన సదుగు...కలకటేరులా మాటాడతావు ఒప్పుడూనూ, ఇదేనేటి నీ సదుగు. బొట్టికేటయిపోనాదోనని ఎంత గిలగిల్లాడిపోనానూ.....ఓరి గుంటడా, పేనం పోనాదిగందా !

ఏటండీ ఏదో పేద్ద సదుగు సదిగీసినట్టు నాతో ఆసికాలాడతారు ఒప్పుడూనూ....ఇదేనేటి మీరు సేసిన నిర్వాకమూ.

ఒరేయ్ అందుకే చెప్పేది సరిగ్గా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి అని.

తప్పైపోనాది మావా.

...........................

ఇది నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మా బళ్ళో వేసిన నాటిక. ఇది మా తెలుగు టీచరు శ్రీమతి దేవీ ప్రకాష్ గారు మా చేత వేయించారు. దీన్లో నేను అత్తగారి పాత్ర పోషించాను. నాకు మంచి పేరు తెచ్చిన నాటిక ఇది. స్కూలు స్థాయి నాటకపోటీలో గెలిచి జిల్లా స్థాయి నాటకపోటీల్లో అవకాశమిప్పించింది ఈ నాటిక. అక్కడ కూడా మూడవ బహుమతి గెలుచుకుకున్నాం. నాకు ఒక తెలుగు సామెతల పుస్తకం, Rs.116 మరియు చిన్న సరస్వతీ దేవి విగ్రం ప్రైజుగా ఇచ్చారు. మా టీచరు మా చేత వేయించిన నాటికలు నాకెప్పుడూ చెరిగిపోని మధుర స్మృతులే!

Tuesday, June 22, 2010

డింగుటక ఆహా డింగుటక

భ.రా.గో గారి చిరకాల మిత్రుడు అమెరికానుండి వచ్చిన సందర్భంలో "తెలుగు సినిమా చూసి చాన్నాళ్లయింది, వెళదాం రారా" అన్నాట్ట.

భ.రా.గో గారేమో "వద్దురా, నువ్వుభరించలేవు, మనకాలమనుకున్నవా, కానే కాదు ఇంటి దగ్గరే కబుర్లు చెప్పుకుందాం చక్కగా అన్నారట".

"ఊహు లేదు వెళ్లాల్సిందే" అని పట్టుబట్టారట ఆ స్నేహితుడు. "సరే కానీ" అని ఇద్దరూ వెళ్లారట.

అందులో మోకాలు ఊపుకుంటూ, నడ్డి ముందుకి వెనక్కి తిప్పుతూ డేన్సులు వేస్తూ పాడుతున్నారట. కాసేపయ్యక ఆ మిత్రుడు అడిగాడట "ఓరేయ్ ఆ పాటకి అర్థమేమిటంటావ్?" అని

భ.రా.గో గారికి చిర్రెత్తుకొచ్చి "మనసున మల్లెల మాలలూగెనే" అంటే అర్థం చెప్పగలను కానీ "డింగుటక ఆహా డింగుటక ఓహో డింగుటక" అంటే ఏమి చెప్పమంటావురా" అన్నారట.

ఈ మధ్య ఇలాటి సంఘటనే మా ఇంట్లో జరిగింది.

మా దూరపు బంధువు (మామయ్య వరస) పాతికేళ్ల తరువాత ఇండియా వచ్చారు. "పొద్దున్నే 9.30 కి రెడియోలో మనోరంజని వస్తుంది పెట్టవే చాలా రోజులయింది మంచి తెలుగు పాటలు విని" అని అడిగారు.

మావయ్య ఏ కాలం పాటలనుకుంటున్నారో అని నవ్వుకుని రేడియో పెట్టాను.

మొదటి పాట "బిల్లా" సినిమా లోది.

"ఏమిటే హిందీ పాటలిస్తున్నారు" అని గాబరాపడ్డారు మావయ్య. "లేదు మావయ్యా అది ఈ మధ్యనే వచ్చిన తెలుగు సినిమావే" అన్నాను.

"బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వొదలా బొమ్మాళీ"...పాట విని ఆయన అసహనంగా కుర్చీలో కదిలారు.

రెండవ పాట అదుర్స్ లో "వేర్ ఈజ్ ద పంచకట్టు వేర్ ఈజ్ ఇట్"......... ఆయన కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరిగనారంభించారు.

మూడో పాట :
"ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను"......ఇంక ఆయనకి సహనం చచ్చిపోయింది. ఈ పాటకి కంటిన్యుయేషన్ గా ఇలా పాడారు

ముక్కు ఏమో మూతి ఆయెను
బుద్ధి కాస్త వంకరాయెను
గోళ్ళ చివర గడ్డి మొలిచెను
మెదడు కాస్త అరికాలుకి పాకెను
తెలుగు పాటలు బురదలో పొర్లెను


ఆ పాట విని మేమంతా ఒకటే నవ్వులు.








Monday, June 21, 2010

సీత అభిమానించిన "రావణ్"

ద్రవిడ భారతంలో ముఖ్యంగా తమిళంలో ఇదే కథావస్తువుతో రామయణం అనేక మార్పులు చెంది రాయబడింది. రాముని కన్నా రావణుడే సీతని ఎక్కువగా గొప్పగా అభిమానించి ప్రేమించాడు అనే వాదన కూడా ఉంది. తెలుగులో చలం కూడా ఇదే కాన్సెప్టు తో రెండు కథలు రాసారు."సావిత్రి" "జెలసీ" పుస్తకంలో ఈ కథలు ఉంటాయి.

ఇప్పుడొచ్చిన రావణ్ సినిమా తమిళ సాహిత్యంలోంచి పుట్టుకొచ్చినదే. రాముడికి వ్యతిరేకంగా రాసిన తమిళ కథలు నేను చదవలేదుగానీ విషయాలు మాత్రం కాస్త తెలుసు. రాముడిని ఆర్యులకు ప్రతినిధిగా, రావణుణ్ణి ద్రావిడులకి ప్రతినిధిగా చేసి ద్రావిడులను తక్కువచేసి చూపడానికి, ఆర్యులను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రామాయణం రాయబడినదని వాదన. ఈ వాదన లోంచి కొంత కథావస్తువుని తీసుకుని "రావణ్" తీసారు మణిరత్నం.

ప్రచారంలో ఉన్న రామాయణంతో పోల్చి చూస్తే ఈ కథ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే ఈ కథలో రాముణ్ణి చెడ్డవాడుగానూ, అన్యాయం చేసేవాడుగానూ చూపించారు. రావణుడు మంచివాడుగానూ, మంచి మనసున్నవాడుగాను, సీతని నిజంగా ప్రేమించినవాడుగానూ చూపించారు. అలాగే సీత కూడా రావణుడి మంచితనాన్ని చూసి అభిమానిస్తుంది చివరికి.

రామాయణాన్ని పక్కనబెట్టి దానితో ఈ కథని పోల్చకుండా చూస్తే "వీరా" (రావణ్) మీద మనకి అభిమానము, పోలీస్ ఆఫీసర్ (రాముడు) మీద ద్వేషం కలగకమానదు. పోలీసుల కుళ్ళుకుతంత్రాల మీద, గిరిజనుల మంచితనం మీద మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిని మనం ఆదరించాం, అలాగే దీన్ని మనం ఆదరించగలం. కానీ రామాయణంతో పోలిక పెట్టడం వలన దీన్ని ఆదరించి మెచ్చుకోవడం సమాజానికి కష్టమే.

ఇంక సినిమా పరంగా చూస్తే ఫొటోగ్రపీ చాలా బాగుంది, విక్రం నటన, ఐశ్వర్య అందం బాగున్నాయి. కానీ కథలో ఒక ఇంటిగ్రిటీ లోపించింది. ఏమి చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నడో సగం సినిమా అయ్యేవరకు అర్థం కాదు. కథావస్తువు కొత్తగా ఉన్నా కట్టె కొట్టె తెచ్చే అని చెప్పినట్లనిపించింది. ఆ ముక్కల్ని కూడా సాగదీస్తూ చెప్పాడనిపించింది.

తన వాదన జనప్రచారంలో ఉన్న కథకి వ్యతిరేకంగా ఉన్నా, తను అనుకున్నదానికి బలమైన కారణాలను, తర్కాన్ని చూపెట్టి ఉంటే బాగుండేది. కనీసం కథకి పట్టునిచ్చే సంభాషణలు పెట్టినా బాగుండేది. ఈ సినిమాలో అవేవీ లేవు. అసలు ఈ సినిమాకి రావణ్ అని పేరు పెట్టకుండా, ఇది రామాయణం అని హైప్ ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది దళపతి సినిమాలా (దళపతి దుర్యోధన, కర్ణుల కథ). ఇదేమి కథో ప్రేక్షకుల విఙ్ఞతకే వదిలేయాల్సింది.

కాకపోతే దేశభక్తి పేరు పెట్టుకుని లవ్ స్టొరీస్ (రోజా, బోంబే) తీసిన మణిరత్నం ఆ మాత్రం బుర్రపెట్టి తీసాడే అని అనిపించింది నాకయితే (మణిరత్నం అసలు బుర్రలేనివాడని, పనికిరాని పిచ్చి సినిమాలు తీస్తాడని నాకో ఒపీనియన్). సినిమా మొదటిభాగం బోరు, చివరి భాగం పర్లేదు. విక్రం అంటే ఇష్టమున్నవాళ్ళు (అంటే నాలాంటి వాళ్ళు) సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ (అంటే విక్రం ని చూస్తూ) చూడొచ్చు.

రాముడిని నమ్మినవారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. చూసే ప్రయత్నం కూడా చెయ్యకండి. కానీ దేవుని నమ్మనివాళ్ళకి, ద్రవిడులకి ఆర్యులు అన్యాయం చేసారు అని నమ్మేవాళ్లకి ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.

పోలికలేం పెట్టకుండా కాస్త లాజిక్కు ఉంటే చాలు అనుకునేవాళ్ళకి, ఏది ఏమైనా ఈ సినిమా చూస్తాం అనుకునే ఔత్సాహికులకు ఉచిత సలహా: సినిమా OK. ఒకసారి చూడొచ్చు.