మధురై....బహుశా ఈ పేరు తెలియని భారతీయులుండరేమో. మధురం (తియ్యనిది) అన్న పదం నుండి మధురై వచ్చిందని చెబుతారు. మొదట ఈ ప్రదేశంలో కదంబవనం అనే అరణ్యం ఉండేదని, అక్కడ స్వయంభువు అయిన శివలింగం కనిపించిందని, ఆ శివుని ఆదిగా చేసుకుని గుడిని, దాన్ని పునాదిగా చేసుకుని నగరాన్ని పాండ్య రాజులు నిర్మించారని చెబుతారు. ఆ శివలింగం నుండి మధురం (అమృతం) జాలువారినది కాబట్టే ఆ నగరానికి మధురై అని పేరు వచ్చిందని ఒక కథ. మరో కథనం ప్రకారం మీనాక్షిని పెళ్ళి చేసుకోవడానికి శివుడు భూలోకానికి వచ్చినప్పుడు కొన్ని అమృతపు చుక్కలను రాల్చాడని అందుకే మధురై అని పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఆధునిక చరిత్రజ్ఞులు ఏమి చెబుతున్నారంటే ఈ గుడి క్రీ.శ 7 వ శతాబ్దానికి చెందినదని, ఆనాటి గుర్తులన్నిటినీ తరువాతి కాలంలో వచ్చిన ముస్లిం రాజులు ధ్వంసం చేసారని, పిమ్మట నాయకర్ రాజులలో మొదటివాడైన విశ్వనాథ నాయకర్ దీన్ని పునఃనిర్మించాడానికి పునాది సిద్ధం చేసారని, నాయక రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ ఈ గుడిని అభివృద్ధి పరిచారని.
"సంగం" కాలం నుండి క్రీ.శ 10-11 శతాబ్దాల వరకు పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. తరువాతి కాలంలో కొన్నాళ్ళు చోళులు, ముస్లిం రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజులకి సామంతులుగా ఉన్న నాయకర్ రాజులు ఈ ప్రదేశాన్ని కాపుగాసేవారు. శ్రీకృష్ణదేవరాయుని కాలానంతరం నాయకర్ రాజులు ఈ మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకుని క్రీ.శ 16 వ శతాబ్దము నుండి సుమారు 200 యేళ్ళు అజరామరంగా పాలించారు. పాండ్యుల కాలంలో రోమ్, గ్రీసు లతో నుండి వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. మధురై ని "Athens of the East" గా పిలిచేవారు. ఈనాటికీ తమిళనాట రెండవ పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న మధురై, మీనాక్షి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. మరి ఆ ఆలయ విశేషాలు, ఇతర చారిత్రాత్మక ప్రదేశాల వివరాలేంటో చూద్దామా? రండి.
మధురైలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు రెండు; ఒకటి మీనాక్షి గుడి, రెండవది తిరుమల నాయకర్ మహల్. మొదట గుడి చూసేద్దామేం. ఈ గుడిలో 14 గోపురాలున్నాయి. అందులో రెండు బంగారు గోపురాలు. ఈ 14 గోపురాలలో అతి పొడవైన గోపురం ఎత్తు 170 అడుగులు. ఇక్కడ పార్వతినే మీనాక్షిగా కొలుస్తారు. శివుని పేరు సుందరేశ్వరుడు. మీనాక్షి, సుందరేశ్వరుని గర్భగుడులకి బంగారు గోపురాలున్నాయి. ఈ ఆలయం మొత్తం రకరాకల రంగులతో నిండి ఉంటుంది. ఎక్కువగా ఆకుపచ్చ రంగు కనిపిస్తూ ఉంటుంది. గుడి లోకి అడుగు పెట్టగానే ఆకర్షించిన విషయమేమిటంటే స్థంబాల మీద ధర్మరాజు, అర్ఝునుడు మొదలగువారికి పెద్ద పెద్ద మీసాలుండడం, ద్రావిడుల (దక్షిణ భారత దేశపు ప్రజల) ముఖ కవళికలు, శరీర దారుడ్యం స్పష్టంగా తెలియడం ....భలే నవ్వొచ్చింది, అవన్నీ చూస్తే. కాసింత ముందుకెళ్లగానే మీనాక్షి గుడి నమూనా కనిపించింది. మొత్తం గుడి నమూనాని అలా చూడడం భలే అనిపించింది. గుడి మధ్యలో ఉండే కొలను ప్రత్యేకాకర్షణ. కానీ మేము వెళ్ళినప్పటికి అక్కడ ఉన్న కొలనుని కడుగుతున్నారు కాబట్టి బంగారు పద్మం, ఆ అందాలు చూడలేకపోయాము.
ఆలయ నమూనా
మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం
ఇది చాలా పెద్ద గుడి, లోపలంతా తిరిగాలంటే గంట పైనే పడుతుంది. ఆ గుడి మండపం అంతా అద్భుతమయిన కళా సంపద కలిగి ఉంది.. వసంత మండపం, వేయి స్థంబాల మండపం, బంగారు పద్మం, అష్ట శక్తి మండపం, ఉయ్యాల మండపం (ఇక్కడ చిలుకలు అమ్మ నామస్మరణ చేస్తూ ఉండడం విశేషం), ముఖ్యంగా ప్రవేశ ద్వారం దగ్గరే ఉండే సిద్థివినాయకుడు చూసితీరాల్సినవే. ఈ గుడిలో దేనికదే ప్రత్యేకమయినా అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణ నలువైపులా ఉన్న వరండాయే, అందులో ఉన్న శిల్పకళా సంపద.
గుడి లోపలి భాగం-2
గుడి లోపల కొంతదూరమెళ్ళాక ఫొటోలు నిషిద్ధం, అందుకే ఎక్కువ తియ్యలేకపోయాను. మీనాక్షి దర్శనం చేసుకున్నాం. బృహదీశ్వరాలయంలో శివుణ్ణి చూసినప్పటి ఉద్వేగం అయితే కలగలేదు నాకు. సుందరేశ్వరుడు కూడా మామూలే. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మీనాక్షికి, సుందరేశ్వరునికి ఒక పడక గది ఉంది. అది చూస్తే నాకు విపరీతమైన నవ్వు వచ్చింది, నమ్మకం వెర్రితలలు వెయ్యడమంటే ఇదేనేమో అనిపించింది.
గర్భ గుడి బయటకి వచ్చిన తరువాత గమనించిన విషయమేమిటంటే ఒక స్థంబం పక్కన ఉన్న ఒక చిన్న పలక మీద ఒక్కొక్కరూ నిలుచుని పై కప్పుకేసి చూస్తున్నారు. ఎందుకు అందరూ అలా చూస్తున్నారో అని మేమూ వెళ్ళాం. ఆ పలక ఎక్కకుండా స్థబం పక్కనుండి పైకి చూసాం. పైకప్పుకి ఒక చిన్న కన్నముంది. అందులో నుండి ఆకాశం కనిపిస్తున్నాది. గుడి బయటికెళ్తే హాయిగా విశాలమైన ఆకాశాన్ని చూడొచ్చు, ఇక్కడ ఈ చిన్న కన్నంలో నుండి చూసేదేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ కాసేపు అక్కడే తచ్చాడాం. అటు జరిగి, ఇటు జరిగి రకరకాల భంగిమలలో నిలుచుని పైకప్పుకేసి చూస్తూ ఉన్నాం ఏమైనా కనిపిస్తుందేమో అని. కాసేప్పయ్యాక మాకు వెలిగింది ఆ పలక ఖచ్చితంగా ఎక్కాలని. ఎక్కి చూసాక తెలిసింది అసలు విషయం, ఏమిటంటే... ఆ కన్నం లో నుండి చూస్తే బంగారు గోపురం కనిపిస్తుంది. ఆ సువర్ణ గోపురం మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ పలక మీద నిల్చున్న మన మీద ప్రకాశిస్తాయి. మేలిమి బంగారు ఛాయలో ఉన్న ఆ కిరణాలు మా మీద పడగానే భలే సరదా వేసింది. ఒక్కొక్కరం మళ్ళీ మళ్ళీ ఆ కిరణాల కింద నిలుచున్నాం. ఆ కిరణాలు మనమీద అలా జారుతూ ఉంటే ఒక రకమైన మంచి అనుభూతి.....హ్మ్ ఎలాగంటే దివ్య తేజస్సుతో వెలుగుతున్నట్టు, అందరికంటే ఎత్తులో మనమున్నట్టు, శరీరం కొత్త ఛాయలను సంతరించుకున్నట్టు, మనసు స్వేచ్చావిహంగమైనట్టు, ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు (నాకు తెలిసిన గొప్ప అనుభూతుల్లో ఇదీ ఒకటి మరి :D)
ఇప్పుడు అతి ముఖ్యమైన, నేను నా టపాకి పెట్టిన పేరుని సార్థకపరిచే అంశం. ఇక్కడ ఒక వేయి స్థంబాల మడపం ఉంది. సౌందర్య ప్రభంజనం అంటారే, అదేమిటో తెలిసొచ్చింది మండపంలోకి అడుగుపెట్టగానే. వెళుతూనే కుడివైపున కొన్ని సన్నని స్థంబాలున్నాయి. వాటి మీద వాయిస్తే "స రి గ మ ప ద ని" అన్న స్వరాలు చాలా ఖచ్చితంగా వినిపిస్తాయి. "రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి సరి గమ ప ద ని స పాడగా" అన్న (శిల్పుల) చరణాలు గుర్తొచ్చాయి. ఒక్కో స్థంబం పైన ఒక్కో కళాసృష్టి..."వస్తువు"లో ఉండే అత్యంత సూక్ష్మ విషయాలను కూడా అతి లాఘవంగా చెక్కిన రీతి.... ప్రతీ ప్రతిమలోనూ హృదయాన్ని ఆవిష్కరించిన కళా పిపాస.....భావ వైశాల్యపు హద్దులు చూసిన సృజన. కాలి వేళ్ళు, నరాలు, కండలు, నెమలి ఈకలు, బుట్ట అల్లికలు, ఒకటేమిటి......అవి రాళ్ళు కావు, అది శిలాప్రతిమలు కావు, నవనాడుల్లోనూ జీవం పోసుకున్న అద్భుత మూర్తులు....మనిషి సృష్టించిన అపురూప ఆనందస్వరూపాలు. అవి చూసాక నరనరాల్లోంచి ఉప్పొంగిన ఆనందాన్ని, హృదయం భరించలేక కళ్ళంట నీరుగా వదిలింది, నిజం. ఆ మహా శిల్పులకు, ఉత్తమోత్తములైన కళాపిపాసకులకు జోహార్లు జోహార్లు జోహార్లు! ఈ మండపంలో ఉన్న మరో విశేషం ఎటుచూసినా స్థంబాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. అన్ని కోణాలలోనుండి మండపం "చివర" ను చూడవచ్చు. ఈ మండపం లోపల నటరాజస్వామి చూడచక్కని రూపంతో కనువిందు చేస్తాడు. అన్నిటినీ తనివితీరా చూసి, గొప్పదైన స్పూర్తితో, హృదయాంతరాళాల్లోంచి పొంగిన ఆనందంతో గుడి బయటకొచ్చాము. చాలు, ఇక అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.
కాలి వేళ్ళు, గోళ్ళు...పరిశీలించండి
బుట్ట మీద ఉన్న అల్లిక.....కనిపించిందా!
ఇందులో నాలుగు కోతులున్నాయి...కనుక్కోండి చూద్దాం :)
వేయి స్థంభాల మడపంలోని నటరాజు
మండపంలోని నాలుగు దిక్కులూ
ఇక ఈ మధురైనగరిలో చూడవలసిన ప్రాముఖ్యమైన ప్రదేశం తిరుమల నాయకర్ మహల్. ఈ కోటలోని అతి ముఖ్య భాగాలను మాత్రమే తమిళనాడు ప్రభుత్వం నిబద్దతతో కాపాడుతోంది. మిగతా భాగాలు జనవాహినిలో కలిసిపోయాయిట. ఈ కోటలో పురాతన కాలం నాటి నాణాలు, వస్తువులు, శిల్పాలు అనేకం ఉన్నాయి. కోటలోని కొన్ని దృశ్యాలు మీ కోసం.....
రాజు గారి సభా మండపం
క్రీ.శ 900 కాలంనాటి శిల్పం
అవండీ మధురై వింతలూ, విశేషాలు.
అయిపోలేదు, ఇంకా ఉంది.... మరో కొత్త ప్రపంచాన్ని చూడాలంటే కాస్త ఆగాలి సుమండీ.