సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అరవనుగానీ ఈ యేడదిలో నేను చదివిన పుస్తకాల్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామని.
చదువులా, చావులా? - నామిని
ఈ పుస్తకం గురించి ఇదివరకే ఒక టపాలో కూలంకషంగా చర్చించాను. కార్పొరేటు విద్యా సంస్థల్లో చిన్నారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో, ఆటపాటలకు దూరం అవుతూ చదువు బరువును ఎలా మోస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతూ తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు నామిని. ఆ బుజ్జాయిల మనసుని తెలుసుకుంటే ఎంతో బాధగా అనిపించింది. మిగతా వివరాలన్నీ ఈ పోస్ట్ లో చదవొచ్చు.
కృష్ణవేణి - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారు తన పంతొమ్మిదవ యేట రాసిన మొట్టమొదటి నవలకి ఫుట్ నోట్స్ ని జోడిస్తూ తిరిగి ప్రచురించారు. ఈ కథ అప్పట్లో జ్యోతిలోనో, ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమీ లేవుగాని ఆవిడ రాసిన ఫుట్ నోట్స్ కోసం ఈ పుస్తకం చదివి తీరాలి. ఎప్పుడో తన చిన్నప్పుడు రాసిన కథని తనే విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవిడ రాసిన విధానం అద్వితీయం. ఒక నలభై, యాభై యేళ్ళ తరువాత రచయిత్రి తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుతో, పరిణితితో తన పాత రచనను నిర్మొహమాటంగా విమర్శించుకోవడమనేది రంగనాయకమ్మగారికి ఉన్న గొప్ప గుణం. Hats off to you Madam! ఫుట్ నోట్స్ లో కూడా తన హాస్యశైలిని వదిలిపెట్టలేదు. చదువుతున్నంతసేపు బాగా నవ్వుకున్నాను.
మానవి, సహజ - ఓల్గా
సుజాతగారి ధర్మమా ఆని మొట్టమొదటిసారి ఓల్గా రచనలు చదివాను. మానవి, సహజ రెండూ విలక్షణమైన రచనలు. రెండూ స్త్రీవాద రచనలే. స్త్రీకి తనదైన వ్యక్తిత్వం ఉండాలని, పెళ్ళి అయినా కూడా భర్త, పిల్లలే కాకుండా తనకంటూ ఇష్టాయిష్టాలను కలిగి ఉండాలని చెప్పే నవలలు.
సహజ విషయానికొస్తే నలుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు- పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. సహజ తప్ప మిగతా ముగ్గురు పెళ్ళి వల్ల తమ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నవాళ్ళే. ఎన్నో యేళ్ళ తరువాత నలుగురు కలుసుకోవడం వారి జీవితాలను చూసి సహజ ఆశ్చర్యపోవడము, పెళ్ళి అంటే వ్యక్తిత్వం కోల్పోవడం కాదని మెత్తగా చివాట్లు పెడుతూ తన ఇద్దరు స్నేహితురాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు తేగలగడం ఇదీ కథ. స్నేహితురాళ్ల మధ్య జరిగే వాదోపవాదాలు, సహజకి తన భర్తకి మధ్య జరిగే చర్చలు ఎంతో ఆలోచింపజేస్తాయి. సహజ ఉద్యోగం చేసుకుంటూ తన మనసుకి నచ్చిన ప్రసాద్ ని పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ స్వతహాగా మంచివాడు. భార్య భర్తలలో ఎక్కువ తక్కువలు లేవని, ఇద్దరూ సమానమేనని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. పెళ్ళయ్యాక అలాగే మెలుగుతాడు కూడా. ఇద్దరూ ఉద్యోగస్థులు అవ్వడం వలన సహజ, ప్రసాద్ కూడా ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ప్రసాద్ కి ఒక పెద్ద చిక్కొచ్చిపడుతుంది. తను అందరి మగవాళ్లలా కాకుండా మంచి భర్తగా మెలుగుతూ సహజకి ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉన్నాడు కదా, మరి సహజ ఇవన్నీ ఎందుకు గుర్తించడం లేదు? తనని మంచివాడుగానో లేదా ఉత్తమ భర్తగానో ఎందుకు గుర్తించడం లేదో అనుకుంటూ మధనపడుతుంటాడు. ఇంక ఆగలేక ఒకరోజు ఈ విషయాన్ని సహజ దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి సమాధానంగా సహజ నవ్వుతూ చెప్పే మాటలే ఈ పుస్తకం లోని "Take away". అవి యథాతథంగా…
“నేనిన్నాళ్ళు నీ భార్యననుకోలేదు ప్రసాద్ నీకు అత్యంత ఆప్తురాలినన స్నేహితురాలిననుకున్నాను. స్నేహితులతో ప్రవర్తిస్తున్నటే ప్రవర్తిస్తున్నావు అనుకున్నానుగానీ నువు ప్రత్యేకంగా నన్ను మంచిగా, దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావనుకోలేదు. ఎంత భ్రమలో ఉన్నాను! నేను ఆడదాన్ని ఏ హక్కులూ లేనిదాన్ని, బానిసను. నువ్వు మంచివాడివి. నీ బానిసకి అన్ని సహాయాలు చేసావు, దయగా చూసావు. అయినా ఈ బానిస తన యజమానిని గుర్తించలేదు. లోకంలో చాలామంది మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటారు, నువ్వు అలా కాకుండా మంచివాడివనీ నీకు తెలుసు. కానీ నా సంగతేమిటి? నేను చాలా భ్రమల్లో ఉన్నాను. స్త్రీ పురుషులు సమానమనన్నట్లు ప్రవర్తించాను. నేను ఏ పురుషుడి కన్నా తక్కువదాన్ని అనుకోలేదు. ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకివాళ తెలిసింది. ఔను...సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరు-మేం స్వేచ్ఛగా ఉన్నాం. పురుషులతో సమానులం అనుకోవటం ఎంత వెర్రితనం. అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి. ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది." అని వ్యంగ్యంగా చురక అంటిస్తుంది.
ఈ మాటలతో ప్రసాద్ కు, చదివే ప్రేక్షకులకూ కూడా జ్ఞానోదయం అవుతుంది. :)
ఇంక మానవి పుస్తకంలో భర్త, ఇల్లు, పిల్లలే లోకం అనుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంట్లో పనిమనిషిలా చాకిరీ చేస్తూ అదే జీవితం అనుకుని ఆనందంగా గడిపే ఇల్లాలి జీవితంలో సంభవించే పెనుమార్పులు, తరువాతి పరిణామాలే మానవి కథ. వసంత, భర్త, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి తల్లిలాగే ఉంటుంది అన్ని కోణాలలోనూ. చిన్నమ్మాయి స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. వసంత అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కాకపోతే రాను రాను తన వ్యక్తిత్వం త్యజించి, అభిరుచులను పక్కనబెట్టి ఒక పనిమనిషిలా మారిపోతున్న భార్యతో కాపరం చెయ్యడం దుస్సాధ్యమవుతున్న భర్త మరొకరిని ఆశ్రయిస్తాడు. తల్లిని అవసరాలకు వాడుకోవాలనే చూసే పెద్ద కూతురి చెర నుండి విడిపించి తల్లిని తనతో పాటే తీసుకువెళుతుంది చిన్న కూతురు. వసంత, చిన్న కూతురు, తన స్నేహితురాళ్ళు, వాళ్ల ఆశయాలు, ఉద్యమాలు అన్నిటిలో పాలుపంచుకుంటూ జీవితంలో తను ఏమి కోల్పోయిందో, తన వ్యక్తిత్వాన్ని ఎలా విడిచిపెట్టిందో మెల్లిమెల్లిగా గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని సాధించి మానవి అవుతుంది. ఈ రచనలో మార్కిజం పాళ్ళు కాస్త ఎక్కువైనట్టు అనిపించినా చదవదగ్గ పుస్తకం.
కోమలి గాంధారం - మృణాళిని
స్వీట్ హోం తో చాలా పోలికలున్న చిన్న కథల సమాహారం. అన్ని స్త్రీవాద కథలే. కోమలి చాలా తెలివైంది. తన భర్తకి, తనతో పాటు పనిచేస్తున్న మగవాళ్ళకూ అవసరమైనప్పుడల్లా చురకలు అంటిస్తూ చాకచక్యంగా పనులను నెట్టుకొస్తూ ఉంటుంది. మొదట్లో బావున్నట్టు అనిపించినా కొన్ని కథలయ్యాక చాలా బోర్ కొట్టింది. నాకు నచ్చని విషయం ఏమిటంటే కోమలికి తన భర్త మీద అస్సలు గౌరవం లేదు. ఎప్పుడూ తీసి పారేస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న భర్తని మరీ అంత హీనంగా, చులకన చెయ్యడం ఏమిటో నాకర్థం కాలేదు. స్వీట్ హోం తో పోల్చుకుంటే విమల, బుచ్చిబాబుని ఎంత వెక్కిరించినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతను వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరచదు. కానీ కోమలి అలా కాదు. ఇది నాకు కనిపించిన నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే కోమలి, తన అత్తగారు రెగ్యులర్ అత్త-కోడళ్ళ సీరియల్స్ లాగ కీచులాడుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మంచి స్నేహితురాళ్ళలా ఉంటారు. ఇది నాకు బాగా నచ్చింది.
కోతికొమ్మచ్చి - మూడు భాగాలు - ముళ్ళపూడి వెంకటరమణ
కోతికొమ్మచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది. పసందైన విందు భోజనంలాంటి రచన. మెల్లిగా చదువుతూ ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ కొంత జీర్ణం చేసుకుంటూ, కొంత నెమరువేసుకుంటూ....ఇక్కడ తమిళంలో ఉన్న ఒక expression వాడాలనుంది...."రసిచ్చి, రుసిచ్చి, ఇనిచ్చి" చదివాను. అంటే రసాస్వాదన చేస్తూ, రుచిని అనుభవిస్తూ, తియ్యదనాన్ని నెమరువేసుకుంటూ చదివాను.
ఈ రమణ గారేంటో ఆయన కష్టాలను కూడా ఏదో కథ చెబుతునట్టు, ఆయనేకేం పట్టనట్టు చాలా మామూలుగా చెబుతారు. చదువుతున్న మనకే గుటక పడదు. తెల్లబోయి తేరుకుని కన్నీళ్ళు పెట్టాలా, వద్దా అన్న మీమాంసలో ఉండిపోతాం. కళ్ళు మాత్రం మనమాట వింటాయేంటి...మెదడు ఏదో ఆలొచిస్తుందిలే మనం కన్నీళ్ళు కార్చేద్దాం అంటూ నీళ్ళకుండల్ని జారవిడుస్తాయి. తెప్పరిల్లే టైము కూడా ఇవ్వకుండా వెనువెంటనే నవ్వించేస్తారు. ఈయన మాత్రం అసాధ్యులు, నిజంగా! ఆయన రచనావ్యాసగం, ఉద్యోగం, సినిమ అనుభవం కడురమణీయంగా ఉన్నాయి. మూడు భాగాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.
అతడు అడవికి జయించాడు - డా. కేశవరెడ్డి
పట్టుమని వంద పేజీలు కూడా లేని పుస్తకం...పొద్దున్నుండీ, సాయంత్రం వరకూ ఒక ముసలాడి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు - అంతే కథ. చెప్పడానికి ఇంత సులువుగా ఉందిగానీ ఆ తొంభై పేజీలలో జీవిత పరమార్ధాన్ని చూపించారు. పందులను పెంచుకునే ఒక ముసలివాడు, అతని మనవడు, రెండు సుక్క పందులు - ఇవే కథలో పాత్రలు. ఒకరోజు సాయంత్రం ముసలివాని మనవడు మేతకు తీసుకువెళ్ళిన రెండు పందుల్లో ఒకదానితో మాత్రమే తిరిగొస్తాడు. రెండో పంది - కడుపుతో ఉన్నది తప్పిపోయిందని తెలుసుకున్న ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడవిలోకెళ్ళి, రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు తెల్లారాక ఇంటికి తిరిగొస్తాడు. అయితే సుక్క పంది దొరికిందా లేదా? అతని జరిపిన పోరాటం ఏమిటి? అన్నదే మొత్తం కథ. జీవనము- మరణము, సంతోషం-దుఃఖము, నిశ్చలత-అనిశ్చలత, ఆశ-నిరాశ, జయము-అపజయము, నిర్వేదం-స్థితప్రజ్ఞత, అన్వేషణ-అస్థిత్వ సంఘర్షణ...ఒకటేమిటి, వీటన్నిటి గురించీ ఉంది. మొత్తం జీవితం యొక్క తత్వాన్ని ఆ చిన్న కథలో బంధించారు. చెప్పాలంటే చాలా హెవీ డోస్. ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. ఈ పుస్తకం ఒకసారి చదివి పక్కనపెట్టేసేది కాదు. కొంచం కొంచం మెల్లిగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ దానిలో మమైకమైపోతేగానీ పరమార్థం బోధపడదు. చాలా బరువైన రచన. భాష కొంచం కొత్తగా ఉండి నలగడానికి కాస్త సమయం పట్టిందిగానీ భావం నలగడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్టుంది. ఇది పూర్తిచేసేసరికి ఏమిటో నేను వేదాంతంలో పడిపోయాను..ఎంతోసేపటికిగానీ తేరుకోలేదు. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.
వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి వీరేంద్రనాథ్
ఆ మధ్య యండమూరి నవలల గురించి బ్లాగు/బజ్జు మితృలతో ఓ పెద్ద చర్చ జరిఒగింది. యండమూరిని ని మరీ అంత తీసిపారేయక్కర్లేదు, కొన్ని చదవాల్సినవి ఉనాయి అన్న మితృల సలహా మీదట మళ్ళీ వెన్నెల్లో ఆడపిల్లతో మొదలెట్టాను. ఒక చెస్ క్రీడాకారుడు, అతన్ని అజ్ఞాతంగా ప్రేమిస్తూ కవ్వించే ఒక ఫోనమ్మాయి. ఆ అమ్మాయిని కనిపెట్టడానికి అతనికి క్లూలిస్తూ ఉంటుంది. అతను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా, ఆ అమ్మాయి కనిపెట్టాడా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే. మొదట్లో ఓ 20 పేజీలకవరకూ కథ బాగానే నడించింది. పాత్రల పరిచయం అదీ బాగానే ఉంది. ఆ పిల్ల ఇచ్చే పజిల్స్ అవీ తమాషాగా అనిపించాయిగానీ కాసేపయ్యేటప్పటికి బండి అస్సలు ముందుకి నడవలేదు. నాకు ఆ పజిల్స్ గోల చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నిక్కుతూ నీల్గుతూ మెల్లిగా నడిపించాను మొత్తానికి. అయితే మధ్యలో జేమ్స్ పెళ్ళి గురించి జేమ్స్ మనస్తత్వ విశ్లేషణ మొదలయినదగ్గరనుండీ బాగుందనిపించింది. ఆఖరాఖరుకి ఆ పజిల్స్ ని ఆ తెలివితేటల్ని చాలా ఎంజాయ్ చేసాను. కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ఆ పజిల్స్, కథ నడిపించిన తీరు బాగుంది అనిపించింది. అయితే మళ్ళీ మళ్ళీ చదివే నవల మాత్రం కాదు.
సాయంకాలమైంది - గొల్లపూడి మారుతీరావు
నాకు అస్సలు అస్సలు నచ్చలేదు అన్నది చిన్న expression అవుతుంది. ఏ కాలానికీ, ఏ సంఘానికీ పనికిరాని, అవసరంలేని కథ ఇది అనిపించింది. పోనీ కొత్తగా ఏదైనా నేర్చుకుందామా అంటే అదీ లేదు. పోనీ నిజాయుతీగా, చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్టుగా రాసారా అంటే అదీ లేదు...రంగులు పులిమి, కంటి తుడుపు కోసం అక్కర్లేని పాత్రలు ప్రవేశపెట్టడం. పోనీ వర్ణనలను, రచనాశైలిని మెచ్చుకుందామా అంటే ఉహూ మనసొప్పట్లేలేదు.
సదాచారసాంప్రదాయాన్ని పాటించే ఒక వైష్ణవుల కుటుంబం. నాలుగో తరం నుండి వారింట్లో వచ్చే మార్పులు. పిల్లాడు పైచదువుల కోసం అమెరికా వెళ్ళడం. అమ్మాయి వేరే కులస్థుడిని పెళ్ళి చేసుకోవడం. తద్వారా ఆ దంపతులు ఎలా బాధపడ్డారు - ఇదీ కథ.
ఏ రకంగానూ నచ్చలేదు నాకు. కొన్ని వర్ణనలైతే రోత పుట్టించాయి. నవనీతాన్ని ఒక దరిద్రుడు రేప్ చేస్తుంటే కోపంతో ఆ అమ్మాయి వాడిని సగం విరిగిన సీసాని తూట్లు తూట్లుగా పొడుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టు విడువడు. అప్పుడు "కూలిపోతున్న యోధుడు శరీరమంతా బుల్లెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తూటా పేల్చి ఒక్క శతృవునైనా కబళించి పోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్యనిరతి వీటన్నిటినీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమయిన శరీరానికి అఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు." యుద్ధంలో యోధుడికి, రేపిస్ట్ కి పోలికా? ఇంతటి జుగుప్సాకరమైన వర్ణనని నేనింతవరకూ చదవలేదు, నిజంగా.
అలాగే ఒక వైష్ణువుడికి, క్రిస్టియన్ కి పుట్టిన అమ్మాయిని కలుపుమొక్కతో పోల్చడం....దారుణం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందులో.
సమాజం మారుతోంది, నిజమే. అలా మారడం పై రచయిత ఏ మాత్రము గౌరవము లేనట్టు అనిపించింది. నన్నడిగితే అలా మారడం చాలా గొప్ప విషయం. ఈ సమాజపు అభివృద్ధికి సంకేతం.అయినా కుటుంబాలలో మార్పు అన్నది ఒక్క వైష్ణవ కుటుంబానికే పరిమితం కాదు. అన్ని కులాలలోనూ ఈ మార్పు జరిగింది. ఎవరి పరిధుల్లో వాళ్ళు సంప్రదాయపు బంధాల నుండి బయటపడ్డారు, పడుతున్నారు. ఈ మార్పు మంచిదే కదా. సంప్రదాయాలు, సదాచారాలు కాలానుగుణంగా మారుతాయి, మారాలి. కానీ అదేదో మహాఘోరాపరాధం అన్న భావన కలిగించారు రచయిత ఈ పుస్తకంలో. అంతే కాకుండా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన భారతీయులపై ఏ మాత్రమూ గౌరవము లేకపోవడం. వాళ్ళేదో తల్లిదండ్రులను వదిలేసి వారి సుఖం వారు చూసుకున్నట్టు, పై దేశం వెళ్ళగానే అన్నీ వదిలేసుకున్నట్టు చిత్రీకరించారు. అది చాలా అన్యాయంగా తోచింది నాకు.
ఈ పుస్తకం గురించి ఎంత తక్కువ చెపుకుంటే అంత మంచిది.
పాకుడు రాళ్ళు - డా. రావూరి భరద్వాజ
500 పేజిల పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కథ - వాళ్ళు పడే కష్టాలు, ఆ పరిశ్రమలో ఉండే రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు. చదువుతున్నంతసేపు ఎంత అసహ్యం కలుగుతుందంటే సినిమా అంటే విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చేవాళ్ళ దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు రాసారు. ఈ పరిశ్రంలో ఆడది అంటే అంగడిబొమ్మ. పనికావాలంటే పక్కలోకి చేరాల్సిందే. ఈ పుస్తకం 1990 లో రాసారు. అంటే అప్పటివరకూ సినిమా పరిశ్రమలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేసి రాసి ఉంటారు. అసలు అవి ఎంతవరకు నిజమో తెలీదుగానీ అలా జరిగి ఉంటుంది అన్న ఊహే గొప్ప భయంకరంగా అనిపించింది. మనకు తెలిసిన హీరోయిన్లను ఆ స్థితిలో ఊహించుకోవడానికి భయం వేసింది. అసలు ఊహించుకోవడం అసాధ్యం అయ్యింది. నమ్మబుద్ధి కాలేదు. ఏంటో బాధనిపించింది, ఏడుపొచ్చింది కూడా. ఇంకా 100 పేజీలు మిగిలున్నాయి. ఈ యేడాది లోపల అనగా రేపటి లోపల పూర్తిచెయ్యాలనుకుంటున్నాను :)
వైట్ టైగర్ - అరవింద్ అడిగా (ఇంగ్లీషు)
ఇంగ్లీషు సాహిత్యం..ఈ యేడాదిలో ఈ ఒక్కటే చదివాను. ఢిల్లీ లో ఉండే కారుడ్రైవర్ల దయనీయ పరిస్థితిని వివరించే గొప్ప రచన. మూడేళ్ళు ఢిల్లీ లో ఉంటూ కారు డ్రైవర్ల జీవన విధానాన్ని పరిశీలిస్తున్నానేమో నన్ను గొప్పగా కదిలించిది ఈ పుస్తకం. ఎక్కడో బీహార్ లో పుట్టి, తిండికి గతిలేక, ఒక్కడు పని చేసినా చాలు ఇంటిల్లిపాదీ కనీసం రెండు-మూడు రోజులకైనా తింటారు అనుకునే పరిస్థితులలోనుండి కారు డ్రైవర్లుగా నెలకి రెడు-మూడు వేల రూపాయల జీతానికి ఢిల్లీకి వస్తారు. యజమానులు వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. అడుగులకు మడుగులు ఒత్తిస్తారు. నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ, మనిషిని అన్న విషయమే మరచిపోయి బతుకులీడుస్తున్న కారు డ్రైవర్ల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా రాయడంలో అరవింద్ సఫలమయ్యారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
ఇవే కాకుండా కినిగె ద్వారా గిఫ్ట్ గా పుచ్చుకున్న పుస్తకాలు సెబాసురా శంకరా, తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు చదివాను. రెండూ అద్భుతమైన రచనలు. ఇంకా కినిగె పుస్తకాలు కొన్ని ఉన్నాయి. చదవాలి.
మొత్తానికి ఈ యేడాది నా పుస్తకపఠనము సంతృప్తికరంగానే ఉంది. ఒకే ఒక్క చిన్న అసంతృప్తి ఏమిటంటే ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువ చదవలేకపోయాను. చాలా పుస్తకాలు సగం సగం చదివి ఆపేసాను. ఈసారి అలా చెయ్యకూడదనుకుంటున్నాను. వచ్చే యేడాది ఇవి కూడా ఎక్కువ చదవాలి.
ఇక పుస్తకాల సేకరణ విషయంలో నేను అద్భుతంగా మరో అడుగు ముందుకేసాను. బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను. బహుమతులుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు.
2011 లో నేను కొనుక్కున్న పుస్తకాలు
ఇవే కాకుండా కృష్ణవేణి, చలం-సత్యం, శైవం, సుందరం కూడా వచ్చాయి. మిధునం పుస్తకాన్ని శంకర్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు. మిగతా పుస్తకాలన్నీ సుజాత గారు (మనసులో మాట) పంపించారు...ఆవిడకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తనకి నేనెంతో ఋణపడిపోయాను. ఇంకా కినిగె పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన రెహ్మాన్ ని, మురళి కి, నాగార్జున కి ధన్యవాదములు!
ఇవే కాకుండా మరికొన్ని కొన్నాను. కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు కాబట్టి, వాటిని వచ్చే యేడాడి ఖాతాలో వేస్తున్నా.
ఈ పుస్తకపఠనాన్ని, కొనుగోలుని 2012 లో కూడా ఇదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను...చూద్దాం! :)