StatCounter code

Friday, December 31, 2010

(ఆంగ్ల) నూతన సంవత్సర శుభాకాంక్షలు !


బ్లాగు మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
వచ్చే యేడాదిలో మీ కోరికలు అన్నీ నెరవేరాలని, మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలకు చేరువకావాలని మనసారా కోరుకుంటూ.... మీ సౌమ్య


Friday, December 24, 2010

మహానటికి అశ్రునివాళి

కొమ్మారెడ్డి మారుతి...సావిత్రిగా ఎదిగిన వైనం, కళ్ళతో భావాలు పలికించే నటనం, పాత్రలో ఒదిగిపోయే జీవం.....మహానటి సొంతం. పెదవులపై మాట కళ్లలో ఎలా ప్రతిఫలిస్తుందో ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే, ఎవరికీ చిక్కని లాఘవమే.

అంతవరకు వచ్చిన మహామహులు ఎందరో నాటకాలలో, సినిమాలలో నటిస్తూ "నటన" ప్రాశస్త్యం పెంపొందిస్తూ ఉంటే, ఎక్కడనుండి ఊడిపడిందో పల్లెటూరి వాటం....నటన లేదు గిటన లేదు, అసలు నటించడం ఏమిటి nonsense....జీవించాలి అంతే. సినిమాలయితే ఆయా పాత్రల్లో జీవించాలి, నిజజీవితంలో మన పాత్రలోనే మనమే జీవించాలి.....అని తెగేసి రుజువు చేసారు.

నీకు నువ్వే సాటి వేరెవరూ లేరు అని ఎవరి గురించైనా అనాలి అంటే అది ఒక్క సావిత్రిగారి గురించి మాత్రమే అనగలం.

డిసెంబర్ 24... కళామతల్లి ముద్దుబిడ్డ జీవనాడులు కృగిపోయి, అశువులు బాసిన రోజు. గొప్ప వెలుగు వెలిగి, అందరి చేత దాసోహమనిపించుకుని, చివరికి మనశ్శాంతి కరువై లోకాన్ని వీడి వెళ్ళిపోయారు.

మహానటికి ఇదే నా శ్రునివాళి.

అక్కయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ఫొటో పంపవా అని ప్రేమగా మా నాన్నగారు ఉత్తరం రాస్తే వెంటనే తన స్వహస్తాలతో చేసిన సంతకంతో పాటు ఫొటో మా ఇంటికి వచ్చిందిట. అదృష్టం నేను నోచుకోలేకపోయానే అని బాధపడినా, మా నాన్నగారికి దక్కినందుకు ఆనందంగానే ఉంటుంది.

గుండెల్లో నిండిన అభిమానం ఎలా చూపించాలో తెలియక కాగితంపై ఇలా ఒంపేసాను. ( ఇవి 12 యేళ్ల క్రితం గీసిన బొమ్మలు). ఇంతకుముందు బ్లాగులో పెట్టినవే అయినా మరొక్కసారి చూడాలనిపించి, చూపించాలనిపించి....



"నా తెగులు" మృత్యుంజయ్ గారు వేసిన మాయశశిరేఖ బొమ్మ....అద్భుతానికి మారుపేరు.


http://mrithyunjaya.blogspot.com/2010/02/maya-bazaar.html

(సావిత్రి గారి వర్ధంతి Dec 26 అని వికీ లో ఉంది. కానీ మన శిరాకదంబం రావుగారు Dec 24 అని చెప్పడం వల్ల ఇవాళే నివాళి అర్పించేసాను. వికీ కంటే రావుగారి మీద నాకు గురి ఎక్కువ. :) గీతగారొచ్చి మళ్ళీ 26 అంటున్నారు. నాకు confusion గా ఉంది. 24 అయినా 26 అయినా నివాళులర్పించడం ముఖ్యం కాబట్టి ఈ పోస్ట్ continue చేస్తున్నాను.)

Wednesday, December 15, 2010

ఆరెంజ్ నచ్చిందా? నచ్చలేదా?

......అంటే కొంత నచ్చింది, కొంత నచ్చలేదు. ఈ సినిమా గురించి చాలామంది చాలా రాసేసారు. కాబట్టి నేను కథ అదీ మళ్ళీ చర్చించదలచుకోలేదు. నాకు తట్టిన ఒకే ఒక్క విషయం గురించి చర్చించదలుచుకున్నాను.

ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిజమైన ప్రేమలో అబద్దాలాడకూడదు అన్న పాయింట్ నాకు నచ్చింది. నిజమే ప్రేమలో నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. కానీ అది ఎలాంటి ప్రేమ అవ్వాలి? ఈ విషయంలో దర్శకుడు భాస్కర్ కి ఉన్నన్ని అపోహలు ఇంకెవ్వరికీ ఉండవేమో! చూడగానే ప్రేమించేస్తే అది జీవితకాలం ఎలా నిలుస్తుంది? అలాంటి ప్రేమని నిలుపుకోవాలంటే అబద్దాలు ఆడక తప్పదు మరి. చరణ్ చేత చెప్పించినట్టు ప్రేమ అనేది రెండు బ్రైన్స్ కి సంబంధించిన విషయం. ఏ రెండూ మెదడులు ఒకేరకంగా ఆలోచించవు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటే ప్రేమ జీవితకాలం ఎలా నిలుస్తుంది? ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళలో నచ్చిన విషయమేదో ఉండాలిగా. వాళ్ల గుణగణాలో, వ్యక్తిత్వమో లేదా మరోటో...ఏదో ఒకటి నచ్చాలిగా. ప్రతీ మనిషిలోను కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. కొంత సహజసిద్ధమైన స్వభావం ఉంటుంది. ఇవేమీ చూడకుండా మొదటి చూపులోనే వచ్చే ప్రేమ ఎలా నిలుస్తుంది? ప్రేమలో ఒకరి ఇష్టాయిష్టాలను చంపుకోనక్కర్లేదుగానీ చిన్న సర్దుబాట్లు కచ్చితంగా ఉంటాయి.

చరణ్ మొదట ప్రేమించిన అమ్మాయి ఎందుకు నచ్చిదో తనకే తెలీదు. వెతుక్కుంటూ ముంబై వెళ్ళాడు. ఆ అమ్మాయికి ఉన్న విపరీతమైన possessiveness ని తట్టుకోలేకపోయాడు. అబద్దాలు చెప్పాడు, అది తనకి నచ్చలేదు విడిపోయడు. రెండు బ్రైన్స్ ఒకటి కావు అని తెలిసిన అబ్బాయికి ప్రేమ చివరిదాకా బతకాలంటే అవతలి బ్రైన్ ఎలాంటిదో, అందులో ఏముందో తెలుసుకోవడం చాలా అవసరం అని ఎందుకు తెలీలేదో!

9 ప్రేమలన్నాడు, మనకి అవేమీ చూపించలేదూగానీ జానూ ని ప్రేమించినప్పుడు కూడా తనలో ఏమి చూసాడు తింగరితనం తప్ప. జీవితాంతం కలిసి బతకడానికి ఆ తింగరితనం మాత్రం కచ్చితంగా సరిపోదు. మరి ఏమీ చూడకుండా ప్రేమించిన ప్రేమ చివరి వరకూ ఎలా నిలాస్తుందిట? అలా నిలవదు అని ఆ అబ్బయి చెబుతూ ఉంటే అందులో తప్పేమిటిట? సముద్రమంత ప్రేమని చూడాలంటే ఆ మనిషిపై మనకి ఎంత అభిమానం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి! అలా ఉండాలంటే ఆ వ్యక్తిలో మనల్ని కట్టిపడేసేది ఏదో ఒకటి ఉండాలి కదా. అలాంటి ప్రేమ తొలిచూపులో ఎలా రాగలదో నాకర్థం కావట్లేదు. చివరికి ఇంకొంచం ప్రేమిస్తానన్నాడు, అది కూడా ఎందుకు, ఏం చూసి? ఈ విషయంలో జానూ పాత్ర కొంతలో కొంత నయం. మొదట్లో ప్రేమించాలన్న ఆకాంక్ష తప్పితే ఆ పిల్లకి ఏమీ తెలీదు. రామ్ ని కలిసిన తరువాత తనకేం కావాలో మెల్లమెల్లగా తెలుసుకుంది. రాను రానూ ఆ పాత్రకి ఒక రకమైన మెచ్యూరిటీని తీసుకొచ్చారు. జానూకి తనకేం కావాలో తెలుసు. నిజంగా జీవితాంతం ప్రేమించే వ్యక్తి కావాలి అనుకుంది. అది సరి అయిన కోరికా కాదా అన్నది వేరే విషయం. కనీసం ఏదో ఒక క్లారిటీ ఉంది కదా ఆ అమ్మాయికి. ఇతగాడికీ అదీ లేదు, ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నాడో తనకి తెలీదు. మరి అలాంటి ప్రేమ కొంతకాలంకన్నా నిలవదు అని చెప్పే తన ఫిలాసఫీ కరక్టే కదా. అందులో తప్పేముంది? దానికంత చర్చ ఎందుకు? అంత సినిమా తీయడమెందుకు?

అయినా ఇది భాస్కర్ కి మొదటిసారి కాదు. "పరుగు" సినిమాలో కూడా అంతే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుట్టేస్తుందిట. తండ్రీకూతుళ్ళ బంధం గురించి గొప్పగా చెబుతూ యువతీయువకుల ప్రేమ విషయంలో మాత్రం పప్పులో కాలేసాడు. ఆ సినిమాలో మిగతా విషయాలన్నీ బాగుంటాయిగానీ ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే వచ్చేసే ప్రేమే మింగుడుపడదు. ఇప్పుడు ఆరెజ్ సినిమాలోనూ అదే చూపించాడు. మరీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం లేదుగానీ తొలిచూపు ప్రేమ మాత్రం బలంగా చూపించాడు. పైగా ఆ ప్రేమ మీద పెద్ద పెద్ద చర్చలు, వాగ్యుద్ధాలు. అవసరమా అనిపించింది. బొమ్మరిల్లు సినిమాలో ప్రేమకి కావలసినదేమిటి అన్నది ఎంతో బాగా చూపించాడు. హాసినిని హీరో ఎందుక్లు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కనీసం 1-2 సార్లయినా చెప్పించాడు సినిమాలో. హీరో తనకి నచ్చినట్టు జీవితం గడపలేకపోతున్నాడు. కాబట్టి అలా స్వతంత్ర్యంగా తనకి నచ్చినట్టు గడిపే ఒక అమ్మయిని చూసి చాలా ఇష్టపడతాడు. "నీకు ఏది నచ్చితే అది చేస్తావు, నీకు కావలసినట్టు బతుకుతావు అదే నీలో నాకు నచ్చింది" అని హీరో చేత చెప్పిస్తాడు. అది బావుంది. మరి అదే పద్ధతి మిగతా సినిమాలలో ఎందుకు పనికిరాలేదో!

ప్రేమ అంటే అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకటవడం మాత్రమే కాదు అవి కలవకపోయినా పెద్దగా వచ్చే నష్టం లేదు ( మరీ ఉత్తరదక్షిణ ధృవాల్లా ఉంటే చెప్పలేంగానీ)... కానీ భావాలు కలవడం, వ్యక్తిత్వం నచ్చడం అనేది చాలా ముఖ్యం. ప్రేమంటే ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించుకోగలగడం, ఒకరి తప్పుని ఇంకొకరు మన్నించగలగడం, ఒకరి సుఖదుఃఖాలను ఇంకొకరు పంచుకోగలగడం. ఒక సీనులో "నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రఫిటీ అంటే ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. జీవితం మొత్తం ప్రేమ ఒకలాగే ఉండదు" ఇందులో చివరి చెప్పిన వాక్యాలు కరక్టే కానీ వాటిని అన్వయించిన విషయాలే కరక్టు కాదు.

"ఇవాళ నచ్చినది రేపు నచ్చకపోవచ్చు"...నిజమే, కానీ అది ఏ గోల్ఫ్ ఆటకో, గ్రఫిటీకో సంబంధించిన ఇష్టమయితే నచ్చకపోయినా ఫరవాలేదు, దానికోసం విడిపోనక్కర్లేదు. అలా చిన్న చిన్న విషయాలకోసం విడిపోయేవాళ్ళు అసలు ప్రేమించకుండా ఉంటేనే మంచిది. కానీ జీవితంలో పెద్దవి అనుకునే విషయాల్లో, ఇప్పుడు నచ్చి తరువాత నచ్చకపోతే దానికి ఏదో ఒక సరి అయిన కారణం ఉండే ఉంటుంది. అలా కాకుండా నాఇష్టం నాకు నచ్చలేదంతే అని అంటే హాయిగా విడిపోవచ్చు, అలాంటి మూర్ఖులతో ఉండక్కర్లేదు. కాబటి ఇవాళ నచ్చింది, రేపు నచ్చకపోవడం అనేది అభిరుచులకి మాత్రమే సంబంధించిన అంశంగా చూపించి, విడిపోవడానికి అదొక కారణంగా చూపించి వాదించడం హాస్యాస్పదంగా ఉంది.

"జీవితం మొత్తం ప్రేమ ఒకలాగే ఉండదు"...ఇదీ నిజమే. ప్రేమతో పాటు బాధ్యతలు వస్తాయి. వాటిని నిర్వర్తించే క్రమములో ప్రేమ తగ్గినట్టుగానో, పెరిగినట్టుగానో అనిపించొచ్చు. అసలు ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఒక్కరోజులోనూ, ఒక్క సంవత్సరంలోనో తెలుసుకోలేడు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్న కాలంలో ఒక్కోరొజూ ఒక్కో కొత్త అనుభూతి వస్తుంటుంది. కొత్త విషయం తెలుస్తుంటుంది. ఆ అనుభూతులు చాలామాటుకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తులు ఎదుగుతూ ఉంటారు, కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియేగానీ ఒక్కరోజులో జరిగేది కాదు. అలా వ్యక్తులు మారుతున్నప్పుడు ప్రేమ తగ్గడమో, పెరగడమో జరుగుతూ ఉంటుంది. అంత మాత్రనా విడిపోవడమే పరిష్కారం కాదు, మరీ భరించలేనంతాగా మారిపోతే తప్ప.

మొత్తం ఇలాంటి కంఫ్యూజన్ తోనే సినిమా నడిచింది. సినిమా చివరివరకూ చూసిన తరువాత ఇందులో చెప్పిన విషయమేమిటో నాకు బోధపడలేదు. ప్రేమలో నిజాయితీ ఉండాలి అన్నదే పాయింటయితే తొలిచూపు ప్రేమల్లో "కొంతకాలం ప్రేమ", "జీవితం చివరి వరకూ ప్రేమ" అన్న వాదనేమిటి విడ్డూరంగా! పోనీ చివరికి దర్శకుడు ఏ విషయాన్ని బలపరిచాడో కూడా అర్థం కాలేదు.

అందరిలాగే కాన్సెప్టు గురించి పెద్దగా ఆలోచించకుండా ఏదో మూసలో సినిమాలు తీస్తే ఈ తొలిచూపు ప్రేమలని చూడొచ్చు. తాతల కాలము నుండి భరిస్తున్నాం కదా ఇంకో సినిమాకి కూడా సర్దుకుపోతాం. కానీ ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తూ, conceptual movie తీద్దామనుకున్నప్పుడు మాత్రం ఈ తొలిచూపు ప్రేమని చూపించడం, దానిలో వాదనలు, చర్చలు....చాలా అనవసరం.

ఇంక మిగతా విషయాలకొస్తే ప్రపంచంలో ఎవరి ప్రేమలోనూ నిజాయితీ లేదని చూపడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. జానూ తల్లిదండ్రుల మధ్య ప్రేమ గురించి చూపించినప్పుడు కూడా...వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. జీవితంలో బాధ్యలు, బరువులు పెరిగాయి. అలాంటి సమయంలో ఒకరి మీద ఒకరు ప్రేమని వ్యక్తపరుచుకునే సందర్భాలు ఎక్కువగా రావు. అంతమాత్రాన గుండెల్లో ప్రేమ లేదని కాదు.

అలాగే బోలెడంతమంది ప్రేమజంటలని చూపించారు సినిమాలో. కానీ అన్ని జంటల్లోనూ మగవాళ్లదే తప్పు, మగవాళ్ల ప్రేమలోనే అబద్దాలుంటాయి అని చూపించడం ఏమీ బాలేదు. సినిమాలో రామ్ చెప్పిన విషయాన్ని గ్రహించిన అన్ని జంటల్లోనూ అబ్బయిలదే నిజాయితీలేని ప్రేమ అన్నట్టు ఆ అమ్మాయిలందరూ అబ్బాయిలని వదిలేసి వెళ్ళిపోతారు.

ఇక నాగబాబు చేత చివర్లో చెప్పించిన మాటలు బావున్నాయికానీ అసలు ఆ పాత్ర ఎందుకు, ఆ పాత్ర ఉద్దేశమేమిటో అస్సలు బోధపడలేదు. నాగబాబు భార్య ఎప్పుడూ ఆయనగారి నెత్తిమీద పూలకుండీలు విసిరేస్తూ ఉంటుంది. సినిమా మొత్తం వాళ్ళిద్దరూ భయంకరంగా తగవులాడుకుంటున్నట్టే చూపించారు. మరి అప్పుడు కూడా సముద్రమంత ప్రేమని పొందడానికి ఒక్కరినే ప్రేమించాలా, ఒక్కరితోనే ఉండాలా? హేవిటో!

చాలా ఒళ్ళు మండిన విషయం ఆ truth or dare ఆట. ఒకమ్మాయి నీ దగ్గరకొచ్చి లవ్ or సెక్స్ అని అడిగితే....లవ్ అని సమాధానమిస్తాడు ఆ అబ్బాయి. అది తప్పంటాడు హీరో. అదెలా తప్పవుతుందో నాకర్థం కాలేదు. అది ఒక hypotheticle question, దీనికి సమాధానం చెప్పినప్పుడు ముందు 30 యేళ్ళు ఏమి జరిగింది, వెనుక 30 యేళ్ళు ఏమి జరిగింది అని ఆలోచించి చెబుతారా ఎవరినా బుద్ధి లేకుండా. ఇంక ఆ చీటీల బేఛ్ ముగ్గురూ జానూ ని మిగతావారికోసం త్యాగం చేస్తామంటారు. అంతమాత్రాన జానూని ముగ్గురూ వదిలేసినట్టెలా అవుతుంది, తిక్క ప్రశ్నలు కాకపోతే. మిగతా ప్రశ్నలలో కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అస్థవ్యస్థంగా ఉన్నాయి.

ఇంక, బాగా నచ్చిన సీను.....రామ్ తనని ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్నిసార్లు తనకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా చేసాడు అని జానూ చెప్పే సీను. అలాగే రామ్ "నేను ఏదీ నిన్ను కాపాడాలని చెయ్యలేదు,నా ప్రేమలో నిజాయితీ చూపించాను." అని చెప్పే సీను.

జెనీలియాని అస్సలు భరించలేకపోయాను. ఏదో బొమ్మరిల్లు హాసిని ఊహించుకుని వెళితే ఇకేదో కనిపించింది. చరణ్ నటనలో కొంత మెచ్యూరిటీ కనిపించింది. మనిషి కూడా కాస్త బావున్నాడు ముందర సినిమాలతో పోలిస్తే. పాటలు కొన్ని బావున్నాయి, సందర్భోచితంగా ఉన్నాయి.

మొత్తానికి ఒక అర్థం లేని విషయం కోసం ఒక అనవసర చర్చ అనిపించింది సినిమా చూసాక. ఏ విషయాన్ని ప్రధానంగా చూపించాలనుకున్నాడో ఆ విషయం గురించి సరైన పద్ధతిలో చర్చించకపోవడంతో సినిమా తేలిపోయింది.

అయితే ఒక్కటి.....

సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడో ఓకచోట ప్రతీ ఒక్కరికీ "నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉంది" అన్న ప్రశ్న రావడం, తమని తాము బేరీజు వేసుకోవడం కచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అదే సినిమా లక్ష్యమయితే అది నెరవేరినట్టే!
---------------------------------

ఇదే వ్యాసం నవతరంగం లో కూడా ప్రచురితమయింది.


Monday, November 8, 2010

భాషా ప్రవీణులు

అనగా అనగా విజయనగరంలో ఒక సౌమ్య ఉంది. ఆ సౌమ్యేమో డిగ్రీ వరకూ అన్నీ తెలుగు మాధ్యమంలోనే చదువుకుంది. తరువాతేమో సెంట్రల్ యూనివర్సిటీలో సీటొచ్చి హైదరాబాదొచ్చేసింది. యూనివర్సిటీలోనేమో అందరూ ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు మాట్లాడడం లేదు. మన అమ్మాయికేమో తెలుగు తప్ప మరే భాష రాదు. ఎలారా దేవుడా అనుకుంటూ జాయిన్ అయింది. హిందీ కాస్తో కూస్తో వచ్చు. హిందీ ప్రచార పరీక్షలలో "రాష్ట్ర భాష" వరకు పాస్ అయింది. కానీ మాట్లాడడం అలవాటు లేదు కదా, అందుకని కాస్త బిడియం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒక ఒరియా పిల్ల తనకి రూమ్మేట్ గా వచ్చింది. ఆ పిల్లేమో చిన్నప్పటినుండీ అన్నీ ఇంగ్లీషు మీడియం లో చదివిన ఘనాపాటి. హిందీ కూడా దంచేస్తుంది. ఇహ మన సౌమ్య పని అయిపోయినట్టే. పోనీలే ఆ చందాన అయినా మనకి భాషలు వచ్చేస్తాయి కదా అని సర్దిచెప్పుకుంది. ఆ ఒరియా అమ్మాయి చాలా మంచిది. సౌమ్యకొచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని తనకి సహాయం చేస్తూ ఉండేది. తప్పుగా మాట్లాడితే కరక్ట్ చేస్తూ ఉండేది. ఎలాగోలా అష్టకష్టాలు పడి అవకతవకలతో హిందీ, ఇంగ్లీషు రెండూ కలిపేసి బండి లాగించేస్తూ ఉండేది మన హీరోయిన్. ఆ ఒరియాపిల్లకి అప్పుడప్పుడూ మాంచి ఝలక్కులిచ్చేది. ఇలా కథ నడుస్తూ ఉండగా ఓరోజు మన సౌమ్య ఆ ఒరియా అమ్మాయితో అందీ " నేను రేపొద్దున్నే క్లాసుకి ఈ పుస్తకం తీసుకెళ్ళాలి, remember me అంది. ఆ పిల్ల "ఏమిటీ" అని మళ్ళీ అడిగింది. remember me అని ఓ 2-3 సార్లు చెప్పాక అప్పటికి అర్థమయింది ఆ అమ్మాయికి. ఒహో remind me ఆ అని "అలాగే remind చేస్తాను" అని చెప్పి, ముసిముసిగా నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయింది. మరి బయటికెళ్ళి భళ్ళున నవ్వుకుందేమో తెలీదుకానీ ఆ దెబ్బతో remind అన్న పదం తెలిసింది మన సౌమ్యకి. ఇంకోసారేమో మన సౌమ్య, ఆ ఒరియా అమ్మాయి తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా తెగ దోమలు కుట్టేస్తూ ఉన్నాయి. అప్పుడు మన సౌమ్య "అబ్బ ఇస్ రూం మే బహుత్ సారే మచిలియా హై" అంది ఠక్కున. ఇహ చూసుకోండి ఆ ఒరియా పిల్ల పడీ పడీ నవ్వింది. కింద పొర్లి పొర్లి నవ్వి కడుపునొప్పి తెచ్చుకుంది. "మచిలియా కాదు సౌమ్యా మచ్చర్ అనాలి, మచిలియా అంటే చేపలు" అని చెప్పింది. అర్రె ఈ మచ్చర్ అన్న పదం మనకి తెలుసు కద మరి మచిలియా అని ఎందుకన్నానబ్బ అని నాలుక కరుచుకుంది మన హీరోయిన్. ఇలాంటి ఝలక్‌లు అబ్బో ఒకటా రెండా...మన సౌమ్య దెబ్బకి ఆ ఒరియాపిల్ల ఢంగైపోతూ ఉండేది.

ఇదిలా ఉండగా మన సౌమ్యతో పాటు వాళ్ళ ఊరినుండి ఇంకో అమ్మాయి కెమిస్ట్రీలో జాయిన్ అయింది. ఓనాడు ఆ తెలుగమ్మాయితో ముచ్చట్లాడుతూ "సబ్బులు అవీ కొనుక్కోవాలీ ఎక్కడ దొరుకుతాయి" అని అడిగింది సౌమ్య.
"గోప్స్ లో దొరుకుతాయి" అంది ఆ తెలుగుపిల్ల.
"గోప్స్ అంటే? అదెక్కడుంది?" అని అడిగింది సౌమ్య.
"గోప్స్ తెలీదా" అంటూ రూట్ చెప్పి అక్కడ అన్నీ దొరుకుతాయి అని చెప్పింది ఆ అమ్మాయి.

అసలే మన భాషా ప్రావీణ్యతతో జనాల్ని అబ్బురపరుస్తున్నాం ఇప్పుడు ఈ గోప్స్ కి అర్థం తెలీదంటే మనూరి అమ్మాయి ముందు మనకి అవమానమయిపోతుంది అని అనుకుని "సరే సరే వెళ్ళి కొనుక్కుంటా" అని చెప్పి సరాసరి తన గదికి వెళ్ళిపోయి తనతో పాటు తెచ్చుకున్న oxford పెద్ద డిక్షనరీ తీసి గోప్స్ కోసం వెతికింది. స్పెల్లింగ్ ఏమయుంటుందబ్బా అని తెగ ఆలోచించి gops, gopse ఇలా రకరకాలుగా వెతికింది. ఉహూ అర్థం దొరకలేదు. ఇందులో లేదంటే ఇదేదో లాటినో, ఫ్రెంచో అయుంటుంది. పోనీ అక్కడికే వెళ్ళి చూద్దాం అని అనుకుని గోప్స్ కి ప్రయాణం కట్టింది. అక్కడికి వెళ్ళి చూస్తే అదో కిరాణా కొట్టు. ఒహో గోప్స్ అంటే కిరాణాకొట్టా అని తన మెదడులో ఆ పదాన్ని ముద్రించేసుకుంది. ఓ రెండ్రోజులు పోయాక తన స్నేహితులతో పిచ్చాపాటిలో ఉండగా
"నాకు ఈ వస్తువు మన యూనివర్సిటీ గోప్స్ లో దొరకలేదు, బయట గోప్స్ లో ఉంటుందేమో చూడాలి" అంది.
వెంటనే ఫ్రెండొకడు "అదేంటి గోపాల్‌జీ కి బయట మరో దుకాణం ఉందా" అని అడిగాడు.
"గోపాల్‌జీ దుకాణమేమిటి, నేనంటున్నది గోప్స్ గురించి" అంది సౌమ్య.
"అదే నేనూ అంటున్నా గోపాల్‌జీ కి మరో దుకాణం ఉందా బయట అని" అన్నాడు అతడు.
అప్పటికి మన సౌమ్యకి బల్బ్ వెలిగింది. "ఒహో గోప్స్ అంటే 'గోపాల్‌జీ షాప్' కి షార్ట్ కట్ అని తెలుసుకుంది. అసలే చావు తెలివితేటలు ఎక్కువున్న మన సౌమ్య వెంటనే తన తప్పుని కప్పి పుచ్చుకుంటూ " అవును గోపాల్‌జీకి బయట ఇంకో షాపు ఉందని నేను విన్నాను, మరి నిజమో కాదో తెలీదు" అని చక్కగా కవర్ చేసేసుకుంది. కానీ మనసులో "హమ్మ ఎంత ప్రమాదం తప్పింది. నేను గోప్స్ పదం కోసం డిక్షనరీ వెతికానని వీళ్లకిగానీ తెలిస్తే ఇంక ఊరుకుంటారా, జీవితాంతం నన్నాడుకోరూ" అనుకుంటూ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డందుకు సంతోషించింది. ఇలా ప్రజలని తన ప్రావీణ్యతతో అబ్బురపరుస్తూ ఓ 2-3 మూడునెలలకి అన్ని భాషలు చక్కగా నేర్చేసుకుంది మన సౌమ్య. అదండీ కథ.
.......................................

ఇలాంటి భాషాకష్టాలు పలుమార్లు మనం వింటూ ఉంటాం. భాషలతోటి, accent తోటి అప్పుడప్పుడూ బలే తిప్పలు వస్తూ ఉంటాయి. ఇంగ్లీషు, హిందీలతోటే కాకుండా మన భారతీయ భాషల విషయంలో కూడా బలే సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడూ.

వరుసకి మావయ్య అయిన ఒకాయనకి విశాఖనుండి జబల్‌పూర్ కి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ హిందీ తప్ప వేరే గతి లేదు. ఆఫీసులో అయితే ఇంగ్లీషుతో ఏదో కాలక్షేపం చేసేవారు కానీ చుట్టుపక్కల వారితో మాట్లాడాలన్నా, బయట పనులు చేసుకోవాలన్నా హిందీ ఒక్కటే మాధ్యమం. మా అత్తయ్యకి హిందీ బాగానే తెలుసు, కానీ మావయ్యకి అసలు తెలీదు, ఏవో రెండు మూడు ముక్కలు తప్ప. హిందీ సినిమాలు చుస్తూ, అత్తయ్యని అడిగి తెలుసుకుంటూ మెల్లిగా కాస్త నేర్చుకున్నారు. ఆయనకి పందుంపుల్లలతో పళ్ళు తోముకునే అలవాటుంది. అవేమో ఆయనకి ఎక్కడా దొరకలేదు. ఓరోజు వాళ్ళ క్వార్టర్స్ గార్డ్ ని పిలిచి "ముఝే లడకీ చాహియె, రాత్ కో భేజో" అన్నారట. ఆయన భావమేమిటంటే నాకు పుల్లలు కావాలి, రాత్రి లోపల పంపించు" అని. హిందీలో కర్రను, పుల్లని "లకడీ" అంటారని ఆయనకి తెలుసు. కానీ అది కాస్త "లడకీ" అయింది. ఆ రెంటికీ ఉన్న వ్యత్యాసం ఆయనకి తెలీదు. ఆ గార్డ్ బిత్తరపోయి కోపం తెచ్చుకునే లోపలే, ఈ సంభాషణ అంతా వింటున్న మా అత్త పరిగెత్తుకునొచ్చి "బాబ్బాబూ కోప్పడకు, ఆయనకి హిందీ రాదు, ఆయన ఉద్దేశం వేపపుల్లలు కావలని" అని సర్దిచెప్పి పంపించారట.

ఇలాగే ఇంకోటి....ఒక మళయాళీ ప్రొఫెసర్ గారు, చెన్నై వెళ్ళారట ఒక నెలరోజులు ఏదో కోర్సు చెప్పడానికి. ఆయనకి ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఒక పనమ్మాయి వచ్చి రోజు ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేది. ఈ ప్రొఫెసర్ గారికి కాస్తంత తమిళ్ తెలుసు. మళయాళం, తమిళ్ రెండూ కలిపి ఏలాగోలా మాట్లాడేవారు ఆ పనమ్మాయితో. ఆయనకి రోజు సాయంత్రం 5.00 నుండి 6.00 వరకు యోగా చేసే అలవాటుంది. సరిగ్గా అదే సమయానికి ఈ పనిపిల్ల వచ్చి ఇల్లు, వాకిలి తుడవడం మొదలెట్టేది. ఆయనకి అది కాస్త చిరాకుగా ఉండేది. ఓరోజు ఆ అమ్మాయిని పిలిచి "నువ్వు సాయంత్రం రావొద్దు రోజూ 'రావెలె వా', వస్తే నీకు నాకు కూడా హాయిగా ఉంటుంది" అన్నారట. అంతే ఆ అమ్మాయి చేతిలో చీపురు కట్టని అక్కడే పడేసి పారిపోయిందిట. కాసేపయ్యాక ఓ నలుగురు పెద్దవాళ్ళని తీసుకుని వచ్చిందిట. వాళ్ళు ఈయన కాలర్ పట్టుకుని "ఏమిటిరా మా అమ్మాయిని రాత్రికి రమ్మంటావా" అని అడిగారట. ఆ ప్రొఫెసర్ గారు బిక్కచచ్చిపోయి నేనలా అనలేదు మొర్రో అని చెప్పి, పక్కనే ఉన్న వేరొక ప్రొఫెసర్ గారిని పిలుచుకొచ్చారట. ఆయన విషయమంతా గ్రహించి ఆ వచ్చినవాళ్ళకి సర్దిచెప్పి పంపించారట. ఇంతకీ సంగతేమిటంటే మళయాళంలో "రావలె" అంటే తెల్లవారుఝాము, పొద్దున్న అని అర్థం. అదే తమిళ లో "రావెలె" అంటే రాత్రి అని అర్థం. ఆ ప్రొఫెసర్ ఏమో "నువ్వు పొద్దున్నే వచ్చి ఇల్లు అదీ ఊడిస్తే ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది" అని చెబితే, ఆ అమ్మయేమో "నువ్వు రాత్రికి వస్తే మనిద్దరికీ బావుంటుంది" అని అర్థం చేసుకుంది. దానితో లేనిపోని గొడవలు వచ్చాయి.
.......................

ఇతర భాషలతో వచ్చే గొడవలు ఇవైతే మన తెలుగుతోనే వచ్చే గొడవలు మరికొన్ని.

మా విజయనగరంలో సంగీత కళాశాల ఉంది. అది ద్వారం వెంకటస్వామి నాయుడిగారి కోసం విజయనగరం రాజులు కట్టించి ఇచ్చిన కళాశాల. చాలా పేరుమోసిన పాఠశాల అది. అక్కడ వినాయక నవరాత్రులలో రోజూ పొద్దున్న, సాయంత్రం కూడా కచేరీలు జరుగుతాయి. పెద్దపెద్దవాళ్ళందరూ వస్తారు. ఆ తొమ్మిది రోజులూ ఉదయం వెళ్ళినా వెళ్ళకపోయినా సాయంత్రం మాత్రం కచేరీ వినడానికి కచ్చితంగా వెళ్ళేవాళ్ళం. నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడనుకుంటా....వినాయక నవరాత్రులలో ఓరోజు ఓ పెద్దాయన (X) కచేరీ జరగాల్సి ఉంది. మరో పెద్దాయన (Y) ఆ కచేరీకి వ్యవహారకర్తగా వచ్చారు. ఈ Y అనే పెద్దాయన కర్ణాటిక సంగీతంలో చాలా చాలా గొప్పాయన. ఇంచుమించు బాలమురళీకృష్ణకి సరిసమానంగానో, ఓ పిసరు తక్కువగానో ఉండగలిగినంత పెద్దాయన. ఈయన పేరు తెలీకుండా ఎవరూ సంగీతం నేర్చుకోరు. అంత గొప్ప వ్యక్తి. ఆ కచేరీ చేసే X కూడా చాలా గొప్పవారు. సరే సాయంత్రం 6.00 గంటలకి కచేరీ మొదలవ్వాల్సి ఉంది. ఆరోజు మధ్యాన్నం నుండి ముసురు పట్టుకుంది. అలా ధారాపాతంగా వర్షం పడుతూ ఉంది. మేము ఆ చినుకుల్లోనే తడుసుకుంటూ 6.00 కల్లా సంగీత కాలేజీ కి చేరిపోయాం. పెద్దాయన కచేరీ కదా హాల్ నిండిపోయిఉంది. 6.00 అయింది, 7.00 అయింది కచేరీ చెయ్యాల్సిన X గారు రాలేదు. ఆరోజుల్లో కార్లు లేవు. మా ఊర్లో ఆటోలు కూడా ఉండేవి కాదు. రిక్షాలే గతి. ఆ పెద్దాయన రిక్షాలోనే రావాలి కచేరీ చెయ్యడానికి. 8.00 అవుతున్నా వర్షం తగ్గే జాడ కనిపించలేదు. ఇంతలో ఆయన దగ్గరనుండి ఫోన్ వచ్చింది. "ఇంక నేను రాలేను. కచేరి జరగకున్నందుకు చింతిస్తున్నాను" అని. ఈ వ్యవహారకర్తగా ఉన్న పెద్దయన (Y) వెంటనే మైక్ అందుకని "వర్షాభావం వల్ల X గారు రాలేకపోయారు, అంత పెద్దాయన కచేరీని వినలేకపోతున్నందుకు మీ అందరితోపాటూ నేనూ చింతిస్తున్నాను" అని చెప్పారు. సభలో చిన్నగా నవ్వులు ప్రారంభమయ్యాయి. నాకు గొప్ప ఆశ్చర్యమేసింది. అంత పెద్దాయన, సంగీతంలో కీర్తనలు రాసారూ, సంగీతసాహిత్యాలపై మంచి అవగాహన, పట్టు కలిగిన వ్యక్తి, ఆయన కూడా ఇలా తప్పుగా మాట్లాడారా అని ఆశ్చర్యపోయాను. వర్షాభావం అంటే వర్ష లేకపోవడం. బయట హోరున వాన కురుస్తుంటే వర్షాభావమేమిటీ అని కొందరు జోకులు వేసుకోవడం ఆరంభించారు. ఎంత పెద్దవాళ్ళైనా అప్పుడప్పుడు తప్పులో కలువేస్తారన్నమాట అనుకున్నాను నేను.

అంతంత పెద్దవాళ్ళకే ఈ భాషాకష్టాలు తప్పలేదు. ఇక TV-9 సంగతేముంది చెప్పండి. ఆమధ్య అంటే ఓ 6-7 నెలల క్రితం టీవీ-9 లో వార్తలు చూస్తున్నా. ఎక్కడో జరిగిన ప్రమాదం గురించో, కొట్లాట గురించో...నాకు సరిగ్గా గుర్తిలేదు. వార్తలు చెబుతూ "ఇది ఎలా జరిగి ఉంటుంది అన్నదానిపై స్పష్టమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి" అన్నాడు. ఆహా ఊహాగానాలకి స్పష్టత ఏమిటిరా నీ పిండాకూడు అని వాడి పీక నొక్కి వేరే చానెల్ పెట్టుకున్నాను. చూసారా ఊహగానాలకి స్పష్టతట. నేను దీని తరువాత ఏ టపా వెయ్యబోతున్నానో మీరు స్పష్టంగా ఊహించి నాకు చెప్పండేం :).

Thursday, September 30, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-3

మధురై....బహుశా ఈ పేరు తెలియని భారతీయులుండరేమో. మధురం (తియ్యనిది) అన్న పదం నుండి మధురై వచ్చిందని చెబుతారు. మొదట ఈ ప్రదేశంలో కదంబవనం అనే అరణ్యం ఉండేదని, అక్కడ స్వయంభువు అయిన శివలింగం కనిపించిందని, ఆ శివుని ఆదిగా చేసుకుని గుడిని, దాన్ని పునాదిగా చేసుకుని నగరాన్ని పాండ్య రాజులు నిర్మించారని చెబుతారు. ఆ శివలింగం నుండి మధురం (అమృతం) జాలువారినది కాబట్టే ఆ నగరానికి మధురై అని పేరు వచ్చిందని ఒక కథ. మరో కథనం ప్రకారం మీనాక్షిని పెళ్ళి చేసుకోవడానికి శివుడు భూలోకానికి వచ్చినప్పుడు కొన్ని అమృతపు చుక్కలను రాల్చాడని అందుకే మధురై అని పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఆధునిక చరిత్రజ్ఞులు ఏమి చెబుతున్నారంటే ఈ గుడి క్రీ.శ 7 వ శతాబ్దానికి చెందినదని, ఆనాటి గుర్తులన్నిటినీ తరువాతి కాలంలో వచ్చిన ముస్లిం రాజులు ధ్వంసం చేసారని, పిమ్మట నాయకర్ రాజులలో మొదటివాడైన విశ్వనాథ నాయకర్ దీన్ని పునఃనిర్మించాడానికి పునాది సిద్ధం చేసారని, నాయక రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ ఈ గుడిని అభివృద్ధి పరిచారని.

"సంగం" కాలం నుండి క్రీ.శ 10-11 శతాబ్దాల వరకు పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. తరువాతి కాలంలో కొన్నాళ్ళు చోళులు, ముస్లిం రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజులకి సామంతులుగా ఉన్న నాయకర్ రాజులు ఈ ప్రదేశాన్ని కాపుగాసేవారు. శ్రీకృష్ణదేవరాయుని కాలానంతరం నాయకర్ రాజులు ఈ మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకుని క్రీ.శ 16 వ శతాబ్దము నుండి సుమారు 200 యేళ్ళు అజరామరంగా పాలించారు. పాండ్యుల కాలంలో రోమ్, గ్రీసు లతో నుండి వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. మధురై ని "Athens of the East" గా పిలిచేవారు. ఈనాటికీ తమిళనాట రెండవ పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న మధురై, మీనాక్షి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. మరి ఆ ఆలయ విశేషాలు, ఇతర చారిత్రాత్మక ప్రదేశాల వివరాలేంటో చూద్దామా? రండి.

మధురైలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు రెండు; ఒకటి మీనాక్షి గుడి, రెండవది తిరుమల నాయకర్ మహల్. మొదట గుడి చూసేద్దామేం. ఈ గుడిలో 14 గోపురాలున్నాయి. అందులో రెండు బంగారు గోపురాలు. ఈ 14 గోపురాలలో అతి పొడవైన గోపురం ఎత్తు 170 అడుగులు. ఇక్కడ పార్వతినే మీనాక్షిగా కొలుస్తారు. శివుని పేరు సుందరేశ్వరుడు. మీనాక్షి, సుందరేశ్వరుని గర్భగుడులకి బంగారు గోపురాలున్నాయి. ఈ ఆలయం మొత్తం రకరాకల రంగులతో నిండి ఉంటుంది. ఎక్కువగా ఆకుపచ్చ రంగు కనిపిస్తూ ఉంటుంది. గుడి లోకి అడుగు పెట్టగానే ఆకర్షించిన విషయమేమిటంటే స్థంబాల మీద ధర్మరాజు, అర్ఝునుడు మొదలగువారికి పెద్ద పెద్ద మీసాలుండడం, ద్రావిడుల (దక్షిణ భారత దేశపు ప్రజల) ముఖ కవళికలు, శరీర దారుడ్యం స్పష్టంగా తెలియడం ....భలే నవ్వొచ్చింది, అవన్నీ చూస్తే. కాసింత ముందుకెళ్లగానే మీనాక్షి గుడి నమూనా కనిపించింది. మొత్తం గుడి నమూనాని అలా చూడడం భలే అనిపించింది. గుడి మధ్యలో ఉండే కొలను ప్రత్యేకాకర్షణ. కానీ మేము వెళ్ళినప్పటికి అక్కడ ఉన్న కొలనుని కడుగుతున్నారు కాబట్టి బంగారు పద్మం, ఆ అందాలు చూడలేకపోయాము.

గుడి ముఖద్వార గోపురం

ఆలయ నమూనా

మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం

ఇది చాలా పెద్ద గుడి, లోపలంతా తిరిగాలంటే గంట పైనే పడుతుంది. ఆ గుడి మండపం అంతా అద్భుతమయిన కళా సంపద కలిగి ఉంది.. వసంత మండపం, వేయి స్థంబాల మండపం, బంగారు పద్మం, అష్ట శక్తి మండపం, ఉయ్యాల మండపం (ఇక్కడ చిలుకలు అమ్మ నామస్మరణ చేస్తూ ఉండడం విశేషం), ముఖ్యంగా ప్రవేశ ద్వారం దగ్గరే ఉండే సిద్థివినాయకుడు చూసితీరాల్సినవే. ఈ గుడిలో దేనికదే ప్రత్యేకమయినా అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణ నలువైపులా ఉన్న వరండాయే, అందులో ఉన్న శిల్పకళా సంపద.

గుడి లోపలి భాగం-1

గుడి లోపలి భాగం-2

గుడి లోపలి విగ్రహాలు-1

గుడి లోపలి విగ్రహాలు-2

గుడి లోపల కొంతదూరమెళ్ళాక ఫొటోలు నిషిద్ధం, అందుకే ఎక్కువ తియ్యలేకపోయాను. మీనాక్షి దర్శనం చేసుకున్నాం. బృహదీశ్వరాలయంలో శివుణ్ణి చూసినప్పటి ఉద్వేగం అయితే కలగలేదు నాకు. సుందరేశ్వరుడు కూడా మామూలే. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మీనాక్షికి, సుందరేశ్వరునికి ఒక పడక గది ఉంది. అది చూస్తే నాకు విపరీతమైన నవ్వు వచ్చింది, నమ్మకం వెర్రితలలు వెయ్యడమంటే ఇదేనేమో అనిపించింది.

గర్భ గుడి బయటకి వచ్చిన తరువాత గమనించిన విషయమేమిటంటే ఒక స్థంబం పక్కన ఉన్న ఒక చిన్న పలక మీద ఒక్కొక్కరూ నిలుచుని పై కప్పుకేసి చూస్తున్నారు. ఎందుకు అందరూ అలా చూస్తున్నారో అని మేమూ వెళ్ళాం. ఆ పలక ఎక్కకుండా స్థబం పక్కనుండి పైకి చూసాం. పైకప్పుకి ఒక చిన్న కన్నముంది. అందులో నుండి ఆకాశం కనిపిస్తున్నాది. గుడి బయటికెళ్తే హాయిగా విశాలమైన ఆకాశాన్ని చూడొచ్చు, ఇక్కడ ఈ చిన్న కన్నంలో నుండి చూసేదేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ కాసేపు అక్కడే తచ్చాడాం. అటు జరిగి, ఇటు జరిగి రకరకాల భంగిమలలో నిలుచుని పైకప్పుకేసి చూస్తూ ఉన్నాం ఏమైనా కనిపిస్తుందేమో అని. కాసేప్పయ్యాక మాకు వెలిగింది ఆ పలక ఖచ్చితంగా ఎక్కాలని. ఎక్కి చూసాక తెలిసింది అసలు విషయం, ఏమిటంటే... ఆ కన్నం లో నుండి చూస్తే బంగారు గోపురం కనిపిస్తుంది. ఆ సువర్ణ గోపురం మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ పలక మీద నిల్చున్న మన మీద ప్రకాశిస్తాయి. మేలిమి బంగారు ఛాయలో ఉన్న ఆ కిరణాలు మా మీద పడగానే భలే సరదా వేసింది. ఒక్కొక్కరం మళ్ళీ మళ్ళీ ఆ కిరణాల కింద నిలుచున్నాం. ఆ కిరణాలు మనమీద అలా జారుతూ ఉంటే ఒక రకమైన మంచి అనుభూతి.....హ్మ్ ఎలాగంటే దివ్య తేజస్సుతో వెలుగుతున్నట్టు, అందరికంటే ఎత్తులో మనమున్నట్టు, శరీరం కొత్త ఛాయలను సంతరించుకున్నట్టు, మనసు స్వేచ్చావిహంగమైనట్టు, ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు (నాకు తెలిసిన గొప్ప అనుభూతుల్లో ఇదీ ఒకటి మరి :D)

ఇప్పుడు అతి ముఖ్యమైన, నేను నా టపాకి పెట్టిన పేరుని సార్థకపరిచే అంశం. ఇక్కడ ఒక వేయి స్థంబాల మడపం ఉంది. సౌందర్య ప్రభంజనం అంటారే, అదేమిటో తెలిసొచ్చింది మండపంలోకి అడుగుపెట్టగానే. వెళుతూనే కుడివైపున కొన్ని సన్నని స్థంబాలున్నాయి. వాటి మీద వాయిస్తే "స రి గ మ ప ద ని" అన్న స్వరాలు చాలా ఖచ్చితంగా వినిపిస్తాయి. "రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి సరి గమ ప ద ని స పాడగా" అన్న (శిల్పుల) చరణాలు గుర్తొచ్చాయి. ఒక్కో స్థంబం పైన ఒక్కో కళాసృష్టి..."వస్తువు"లో ఉండే అత్యంత సూక్ష్మ విషయాలను కూడా అతి లాఘవంగా చెక్కిన రీతి.... ప్రతీ ప్రతిమలోనూ హృదయాన్ని ఆవిష్కరించిన కళా పిపాస.....భావ వైశాల్యపు హద్దులు చూసిన సృజన. కాలి వేళ్ళు, నరాలు, కండలు, నెమలి ఈకలు, బుట్ట అల్లికలు, ఒకటేమిటి......అవి రాళ్ళు కావు, అది శిలాప్రతిమలు కావు, నవనాడుల్లోనూ జీవం పోసుకున్న అద్భుత మూర్తులు....మనిషి సృష్టించిన అపురూప ఆనందస్వరూపాలు. అవి చూసాక నరనరాల్లోంచి ఉప్పొంగిన ఆనందాన్ని, హృదయం భరించలేక కళ్ళంట నీరుగా వదిలింది, నిజం. ఆ మహా శిల్పులకు, ఉత్తమోత్తములైన కళాపిపాసకులకు జోహార్లు జోహార్లు జోహార్లు! ఈ మండపంలో ఉన్న మరో విశేషం ఎటుచూసినా స్థంబాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. అన్ని కోణాలలోనుండి మండపం "చివర" ను చూడవచ్చు. ఈ మండపం లోపల నటరాజస్వామి చూడచక్కని రూపంతో కనువిందు చేస్తాడు. అన్నిటినీ తనివితీరా చూసి, గొప్పదైన స్పూర్తితో, హృదయాంతరాళాల్లోంచి పొంగిన ఆనందంతో గుడి బయటకొచ్చాము. చాలు, ఇక అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.

నెమలిపైనున్న కార్తికేయుడు

నెమలి ఈనెలు, పాదం తొడని తగిలిన చోట వంపు ఇంకా ఎన్నో ఎన్నెన్నో....గమనించండి

కాలి వేళ్ళు, గోళ్ళు...పరిశీలించండి

నెమలి వేళ్ల మీద ఉబ్బిన నరాలు...చూసారా!


బుట్ట మీద ఉన్న అల్లిక.....కనిపించిందా!


ఇందులో నాలుగు కోతులున్నాయి...కనుక్కోండి చూద్దాం :)

వేయి స్థంభాల మడపంలోని నటరాజు




మండపంలోని నాలుగు దిక్కులూ

ఇక ఈ మధురైనగరిలో చూడవలసిన ప్రాముఖ్యమైన ప్రదేశం తిరుమల నాయకర్ మహల్. ఈ కోటలోని అతి ముఖ్య భాగాలను మాత్రమే తమిళనాడు ప్రభుత్వం నిబద్దతతో కాపాడుతోంది. మిగతా భాగాలు జనవాహినిలో కలిసిపోయాయిట. ఈ కోటలో పురాతన కాలం నాటి నాణాలు, వస్తువులు, శిల్పాలు అనేకం ఉన్నాయి. కోటలోని కొన్ని దృశ్యాలు మీ కోసం.....

కోట లోపలి పైకప్పు





నాట్య శాల


రాజు గారి సభా మండపం


క్రీ.శ 900 కాలంనాటి శిల్పం


అవండీ మధురై వింతలూ, విశేషాలు.

అయిపోలేదు, ఇంకా ఉంది.... మరో కొత్త ప్రపంచాన్ని చూడాలంటే కాస్త ఆగాలి సుమండీ.