నేనూ శ్రీరామరాజ్యం చూసేసానోచ్. శనివారమే చూసాను కానీ "ఆ శని, ఆది వారాలు బ్లాగు/బజ్జు ఎవరు చూస్తారులే, సోమవారం తాజాగా రాద్దాం" అని ఊరుకుంటే...అయ్యబాబోయ్ అందరూ చూసేయడం, రాసేయడం కూడా అయిపోయింది. అయినాసరే నేను రాసి తీరుతాను...మీకూ చదవక తప్పదు. :P
కథ మనకు తెలిసినదే. దానిలో న్యాయాన్యాలు, వాదోపవాదాలు ఎరిగినవే. దాని గురించి మళ్ళీ రాయక్కర్లేదు. బాపూ ఈ సినిమాని ఎలా తీసారో చూద్దామని వెళ్ళాను. సినిమా నేను అనుకున్నంత గా లేదు....నాకు కొంచం నిరాశ కలిగినమాట వాస్తవం. చాలరోజులుగా వేచి చూస్తున్నాను దీని కోసం. వెళ్ళే ముందు పెద్దగా రివ్యూలు చదవలేదు. బాగుంది అన్న టాక్ మాత్రం విన్నాను. చాలా expectatios తో వెళ్లాను. కానీ కొంచం నిరాశ ఎదురయింది.....గొప్పగా లేదు, బాపూ చమక్కులున్నాయి కాబట్టి బానే ఉంది.
కానీ ఏంటో నాకు లవకుశ జ్ఞాపకాలను వీడిపోవడం దుస్సాధ్యమయింది ఎంత ప్రయత్నిచినా సరే. ముఖ్యంగా లవకుశలో పద్యాలు, పాటలు అన్నీ కంఠతా రావడంతో ఏ సీనులో ఏపద్యమొస్తుందో పాడేసుకుంటూ ఉన్నాను. బొమ్మ ఇప్పటిది, పద్యాలు-పాటలు ఆనాటివి అన్నట్టు అయింది నాకు. అతి ముఖ్యంగా "ఏ మహనీయసాద్వి, ప్రతిదినమేను తొలుదొల్త, ఇది మన ఆశ్రమమ్ము, హ్రీంకారాసంగర్భితానలశిఖాం, కన్నులారగ తొలిసారి కొలువుదీరి" లాంటి పద్యాలు గుర్తురాకపోవడం అసాధ్యం అనిపించింది.
కుశలవుల బొమ్మలు పోస్టర్లలో ఎక్కడా కనిపించనివ్వకుండా ఉత్సుకతని పెంచారు. నేను మొట్టమొదటినుండీ వేచి చూసినది వారికోసమే. అయితే చూసాకా కాస్త నిరుత్సాహమనిపించింది. ఆ లవకుశులతో పోలిస్తే ఈ కుశలవులు తేలిపోయారు. నటన బాగానే ఉందిగానీ ఏమిటో...నాకు అంత నచ్చలేదు. పైగా డబ్బింగ్ పిల్లలిద్దరికీ వేరే ఎవరిచేతనో చెప్పించినట్టు అనిపించింది. ఆంజనేయుడు చిన్నపిల్లాడుగా రావడం నచ్చింది. ఆ అబ్బాయి కూడా బాగా చేసాడు. రామ రామ పాట నాకెంతో నచ్చింది.
ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలి. ఆహా ఎంత ప్రసన్నత, ఏమి అందం, ఎంత ఒదిగిపోయింది ఆ పాత్రలో! నయనతార ఎంపికని అనుమానించినందుకు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాను. అయితే అంజలి దేవితో పోలిక లేదు కానీ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. కన్నెసీత గా భలే ముద్దుగా ఉంది. సాధ్వీమణిగా అంతకన్నా ఇంపుగా ఉంది. నయనతార నటనకి సగం మార్కులు, సునీత డబ్బింగ్ కి సగం మార్కులు ఇవ్వాలి.
బాలకృష్ణకి, NTR తోనూ పోలిక రాక తప్పదు. బాలయ్యబాబు బాగా చేసాడు, నిజంగా. నాకు బాగా నచ్చినది అతని డైలాగ్ డెలివరీ. బాధతో, దుఃఖం తో గొంతు జీరబోయినట్టు పలికిన సంభాషణలు ఇంకెవ్వరివల్లా కాదు అనిపించింది. కొంత గాంభీర్యం, కొంత దైన్యం, కొంత నిస్సహాయత, కొంత బాధ...బాగా చూపించగలిగాడు. లవకుశలో NTR లో అన్నీ పరిస్థితులలోనూ గాంభీర్యమే కనిపిస్తుంది. కానీ ఈ రాముడిలో కొంత దైన్యం కనిపిచింది. అది సహజం కూడా. అలా పాత్రని రూపొందించడంలో బాపు గారిని మెచ్చుకోవాలి. కొన్ని చోట్ల రామారావు రూపు ని గుర్తు తెచ్చింది...NTR ని ఇమిటేట్ చేసినట్టూ అనిపించింది. ఒకచోట "చిరంజీవులారా" అని తమ్ములతో అన్నప్పుడు అచ్చు రామారావే కనిపించాడు. అది NTR ఆహార్యమే. కాకపొతే క్లోజప్ షాట్లలో బాలయ్య ని భరించడం నావల్ల కాలేదు. ముదిమి ఛాయలు మీదపడిన బాలయ్యని ఎందుకు అన్ని క్లోజప్ షాట్లలో చూపించారో అర్థం కాలేదు. దగ్గరనుండి చూస్తే మరీ ఇంకులో ముంచినట్టు మేకప్ ఎక్కువయిందనిపించింది. బాపూగారు ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండవలసినది. ఓ పదేళ్ళ క్రితం బాలయ్య ఈ సినిమా చేసుంటే ఆ రాముడి పాత్రకి పూర్తి న్యాయం చేసేవాడేమో! నవ్వొచ్చిన విషయం ఏమిటంటే వీపు మీద కాటుకమచ్చ పెట్టడం, అది కనిపించేలా రెండు షాట్లు తియ్యడం. :)
ఇళయరాజా సంగీతం మొదట్లో అంత గొప్పగా ఏమీలేదు అనిపించినా వినగా వినగా నచ్చింది. కానీ ఆడియోలో విన్న అన్ని పాటలూ సినిమాలో లేకపోవడం నిరుత్సాహపరిచింది. "కలయా, నిజమా" పాట ఎలా తీసుంటారో అని తెగ ఆశగా చూసాను...కానీ ఆ పాట సినిమాలో లేదు. :( నేపథ్య సంగీతంలో వయొలిన్ బిట్స్ చాలా వినసొంపుగా బావున్నాయి. పాత-కొత్త సంగీతాల కలయికలా ఉన్న నేపథ్య సంగీతం వీనులవిందుగా ఉంది. సీత సీమంతం పాట అనవసరమనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం చెప్పుకోదగ్గది. కానీ పద్యాలు లేని లవకుశని ఊహించడం కష్టమయింది.
వాల్మీకి పాత్రలో నాగేస్రావు గంభీరంగా కనిపించారు. ఆయన నటనని, ఆహార్యాన్ని శంకించే పనిలేదు గానీ...నాగయ్యగారిలో ఉన్న ప్రశాంతత కనిపించలేదు. నాకెందుకో ఏ విశ్వామితృడి పాత్రకో, పరశురాముడి పాత్రకో సరిపోతాడేమో అనిపించింది. కానీ ఇంత వయసులోనూ ఉచ్ఛారణలోని స్పష్ఠత, అభినయం మెచ్చుకోదగ్గది. అదే కంటితో బాలయ్యని (వశిష్టుడు) చూస్తే బాధేసింది. ఒకప్పుడు ఎంత చక్కగా డైలాగులు చెప్పేవాడు. ఇప్పుడు ఏదో నొక్కిపట్టినట్టు, వత్తి వత్తి కష్టపడి డైలాగులు చెబుతుంటే కష్టమనిపించింది. మిగతా పాత్రలలో అందరూ బాగానే సరిపోయారు.
కాకపోతే సినిమాలో మెలోడ్రామా ఎక్కువైనట్లుగానూ, మధ్యలో కాస్త సాగతీతగానీ అనిపిచింది. పాత లవకుశలో ఏడుపు తక్కువ...కళ్ల నీళ్ళు సున్నితంగా చిందించడం తప్ప భోరున ఏడవడం లేదు. కానీ ఇందులో ఉంది. కుశలవులు అంతఃపురంలో రామాయణ గానం చేస్తున్నప్పుడు కౌసల్య మున్నగువారు భోరు భోరున విలపించడం కాస్త చికాకు కలిగించింది. వాళ్ళు రాజమాతలు...ఎంత కష్టంలోనైనా కొంత సంయమనం, గాంభీర్యం ప్రదర్శించడం అవసరం. దీనాలాపన అంతగా నప్పలేదు. అలాగే సీత పాత్రలో కూడా...చాలా చోట్ల ఏడుపు ఎక్కువయినట్టు అనిపించింది. మిగతా పాత్రలలో కూడా అక్కడకడా ఏడుపుని చొప్పించారు. ఏడవని పాత్ర ఏదీ లేదనుకుంటా. ఈ మెలోడ్రామా కొంత భరించలేకపోయాను.
ఇంక రమణ గారి డైలాగులకి వంక లేదు. బాపూగారి చమక్కులు మాత్రం మరోసారి గుర్తుచేసుకోదగ్గవి. నాకు బాగా నచ్చిన విషయం...చివరిలో సీత రామునికి నమస్కారం పెట్టే అంశం....సీతకి రామునిపై అవ్యాజ్యమైన ప్రేమ ఉంది కానీ మాటమాత్రమైనా చెప్పకుండా ఇలా విడిచిపెట్టాడే అన్న కోపం, అలక కూడా ఉన్నాయి. అలా లేకపోతే అసహజం. ఆ కోపాన్ని, అలకని బాపు గారు చిత్రించిన తీరు అనితరసాధ్యం. అలాగే ఆపద సమయంలో ఆదుకుని రక్షగా నిలిచిన వాల్మీకికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని నమస్కరించే సన్నివేశం.....రామునికి, వాల్మీకికి నమస్కారాలలో తేడా ని గొప్పగా చూపించారు బాపూగారు. ఎంత అలక, కోపం ఉన్నా, తన తల్లి భూదేవితో వెళ్ళిపోతున్నప్పుడు చివరిసారిగా రాముని ప్రేమతో, ఆర్తితో చూసే సీతని చూస్తే నిజంగా ఏడుపొచ్చింది.
ఇక సీత కుటీరంలో ఒక రాతిపై రామబాణాన్ని ప్రతిష్ఠింపజేసి పూజిస్తుంటుంది. ఆ బాణం మొదట్లో విరిగిన తన గాజుని చంద్రవంకగా నిలిపి తమ అనురాగానికి సాక్ష్యాన్ని ఆ బాణంలో పొదగడం నన్ను విశేషంగా ఆకర్షించింది. రామబాణం, రాముని సీత - తిరుగులేనివి, చెక్కుచెదరనివి. ఈ రెండు విషయాలను ఒకే ఒక్క అంశంలో బంధించడం బలేగా ఉంది.
కౌటిల్య రాసినట్టు సీత చేతినుండి గాజులు ఊడిపడడం - ఆమె రాముని గూర్చి ఆలోచించి చిక్కిశల్యమైపోయినదనే విషయాన్ని అన్యాపదేశంగా వివరించడం...జయహో బాపు.
సింహాసనం ఎక్కబోతూ సీతను చిటికినవేలు పట్టుకుని సహా తీసుకెళ్లడం. సింహాసనం పై కూర్చున్న సీతను స్వయంగా లేపి సీత తో సహా రాజ్యపాలన సాగించబోతున్నట్టు రామరాజ్యం అనగా రాముడు సేవించిన రాజ్యం అని చెప్పడం. మొదట్లో సీత ఒడిలో తలపెట్టుకుని ఎలా కూర్చున్నాడో, మధ్యలో బంగారు సీత తొడిలో తలపెట్టుకుని అదే ఫోజులో కూర్చోవడం.....అంటే అదే మమతను, అనురాగాన్ని అనుభవిస్తున్నట్టు చూపించడం....బావుంది. సీతాలక్షణభరతశతృఘ్న సమేతంగా రాజ్యపాలన గావిస్తాను అని ప్రమాణం చేసినప్పుడు భరతలక్షణులు అవును అన్నట్టు తలూపడం లాంటి subtle expressions బాగా చిత్రీకరించారు.
"లేరుకుశలవుల సాటి" పాట పల్లవిని మాత్రం కుశలవుల చేత పాడించడం నచ్చింది. రాముడు, సీత మధ్య సరసం సున్నితంగా ఉంది. బాపు గారి postures తెలిసినవే కదా..చూడ్డానికి బావున్నాయి. సెట్టింగులు బావున్నాయి కానీ వనం లో జింకలు, నెమళ్ళని గ్రాఫిక్స్ లో పెట్టడం నచ్చలేదు. సహజమైనవాటిని వాడి ఉంటే బాగుండేది. పేటా తో గొడవ వస్తుందనో ఏమో అసహజంగా చిత్రీకరించారు. అవెందుకో కంట్లో ముల్లులా గుచ్చుకున్నాయి అక్కడక్కడా.
సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది. ముందే చెప్పానుగా లవకుశలో పద్యాలు నోటవెంట వచ్చేస్తున్నాయని. అతికష్టంచే బయటకి రాకుండా నోట్లో పాడుకుంటూ ఉన్నాను.
వాల్మీకి సీతని ఆశ్రమానికి తీసుకొచ్చి చూపిస్తూ ఇంకా డైలాగులు మొదలెట్టలేదు....అనుకోకుండా నా నోటివెంట "ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు వశియింపుము లోకపావని" అని పైకే వచ్చేసింది. సరిగ్గా అదే పద్యాన్ని నా వెనుక వరుసలోనూ, ఆపై వరుసలోనూ ఇద్దరు అందుకున్నారు. ముగ్గురం ఒకేసారి బయటకి పాడేసరికి హాలంతా ఘొల్లున నవ్వులు. ఎంత తమాయించుకుందామన్నా నాలాగే మరికొందరికి లవకుశ వదలడం లేదన్నమాట అనుకున్నాను. :)
అయితే మనల్నే కాదు బాపు-రమణ గార్లని కూడా వీడలేదు. అందుకే ఒకచోట వాల్మీకి సీతను లోకపావని అని పిలుస్తారు (లక్ష్మి అని నామకరణం చేసినా సరే). అలాగే "లేరుకుశలవుల సాటి" పాట పాడించడం...మున్నగునవి. :)
మొత్తానికి సినిమా కాస్త నిరాశపరిచినా బాపు-రమణల కోసం, నయనతార కోసం, వైవిధ్యమైన బాలయ్యబాబు కోసం ఒకసారి చూడొచ్చు. నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది.